NDSA
-
భద్రతకు ‘డ్యామే’జ్
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని సాగు నీటిరంగ నిపుణులు, అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రాజెక్టు భద్రతకు తక్షణం చేపట్టాల్సిన చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీఅథారిటీ(ఎన్డీఎస్ఏ) సిఫార్సులను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ప్లంజ్పూల్(భారీ గొయ్యి) స్పిల్ వైపు విస్తరించకుండా ఏప్రాన్కు చివరన వేసిన కాంక్రీట్ సిలిండర్లు వరద ఉద్ధృతికి ధ్వంసమయ్యాయి. వరద వచ్చేలోగా వాటిని పునరుద్ధరించాలని ఎన్డీఎస్ఏ పదేపదే సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. స్పిల్ వే గ్యాలరీల్లో లీకేజీలకు అడ్డుకట్టవేయడానికి గ్రౌటింగ్ చేయాలన్న సూచననూ బుట్టదాఖలు చేసింది. ఇక ప్రాజెక్టుకు శాశ్వత భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై తీవ్ర జాప్యం చేస్తూ వస్తోంది. ఎన్డీఎస్ఏ చైర్మన్ అసహనం ప్రాజెక్టు భద్రతపై ఈ ఏడాదిమార్చి 6న ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్.. మే 31లోగా ప్లంజ్ పూల్, స్పిల్ వేకు మరమ్మతులు చేయాలని ఏపీ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. గత నెల 28–29న శ్రీశైలం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అనిల్ జైన్ తక్షణం చేపట్టాల్సిన మరమ్మతులు చేయకపోవడాన్ని ఆక్షేపించారు. వరద వచ్చేలోగా ఏప్రాన్కు చివరన ధ్వంసమైన కాంక్రీట్ సిలిండర్లను పునరుద్ధరించాలని.. స్పిల్ వే గ్యాలరీల్లో లీకేజీలను అడ్డకట్ట వేయడానికి గ్రౌటింగ్ చేయాలని ఆదేశించారు. ప్లంజ్ పూల్ను శాశ్వతంగా పూడ్చడానికి.. ప్రాజెక్టుకు శాశ్వతంగా మరమ్మతులు చేయడానికి చేయాల్సిన అధ్యయనాలపై సూచనలు చేశారు. కానీ.. ప్రభుత్వం ఆ పనులను చేపట్టలేదు. వర్షాకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో స్పిల్ వే దిగువన రోడ్డు, కుడి గట్టు పనులకు రూ.25 కోట్లు.. కుడి వైపు, ఎడమ వైపు కొండవాలు జారకుండా షార్ట్ క్రీటింగ్ చేయడానికి రూ.5.90 కోట్లు వెరసి రూ.31.40 కోట్లు మంజూరు చేస్తూ గురువారం సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పనులకు టెండర్లు పిలవాలని కర్నూల్ సీఈని ఆదేశించడం గమనార్హం. 2009 వరదకు భారీ నష్టం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం 1963లో ప్రారంభమై 1984లో పూర్తయింది. 1975–76లో ప్రాజెక్టు స్పిల్ వే దిగువన గేట్ల నుంచి వరద ప్రవాహం పడే(బకెట్) ప్రాంతం కోతకు గురై భారీ గుంత(ప్లంజ్ పూల్) ఏర్పడినట్లు అప్పట్లో నిపుణుల కమిటీ గుర్తించింది. ఆ కమటీ సూచన మేరకు ఎప్రాన్ను నిర్మించినా ఫలితం కనిపించలేదు. మళ్లీ ఆ కమిటీ సూచన మేరకు 1984–85లో ఎప్రాన్కు రక్షణగా కాంక్రీట్ సిలిండర్లతో కటాప్ వేశారు. అది కూడా వరద ఉద్ధృతికి కోతకు గురైంది. కృష్ణా నదికి 19 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించారు. కానీ.. 2009, అక్టోబర్ 2న ఏకంగా 25.5 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 271.8 మీటర్లు కాగా, వరదల సమయంలో 273.25 మీరట్లకు పెరిగిపోవడంతో స్పిల్ వే గేట్లపైన వరద ప్రవాహం ప్రవహించింది. ఈ బీకర వరద 78 గంటలపాటు పోటెత్తడంతో ప్లంజ్ పూల్ మరింత పెద్దగా మారింది. ప్రాజెక్టు స్పిల్వే దిగువన ఏప్రాన్ నుంచి 50 మీటర్ల నుంచి 220 మీటర్ల దూరంలో 120 మీటర్ల లోతుతో ప్లంజ్ పూల్ విస్తరించింది. ఈ భారీ ప్లంజ్ పూల్ స్పిల్వే పునాది దిగువకు విస్తరిస్తోందేమోనని ఎన్డీఎస్ఏ కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. -
మేడిగడ్డ బ్యారేజీపై NDSA ఇచ్చిన నివేదిక అంతా బూటకం: కేటీఆర్
-
సాగర్కు ఓనర్ తెలంగాణే
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆనకట్టల భద్రత చట్టం–2021 ప్రకారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఓనర్ తెలంగాణ రాష్ట్రమేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్జైన్ స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏకు సంబంధించిన ‘డ్యామ్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ మానిటరింగ్ అప్లికేషన్’ వెబ్సైట్ (http://dharma.cwc.gov.in)లో డ్యామ్ ఓనర్గా ఎవరి పేరుతో ఉంటే.. వారే ఓనర్గా ఉంటారని తెలిపారు. దీని ప్రకారం సాగర్ ఓనర్ తెలంగాణ రాష్ట్రమేనని తేల్చి చెప్పారు. ఏపీ పర్యటన ముగించుకొని తెలంగాణ పర్యటనకు వచ్చిన అనిల్జైన్తో బుధవారం ఈఎన్సీ జి.అనిల్కుమార్ నేతృత్వంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారుల బృందం వాలంతరిలో సమావేశమైంది. రాష్ట్రంలో జాతీయ ఆనకట్టల భద్రత చట్టం అమలు తీరును అనిల్జైన్ అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి డ్యామ్కు సంబంధించిన డ్యామ్ బ్రేక్ అనాలసిస్ తయారు చేస్తున్నామని ఈఎన్సీ అనిల్కుమార్ తెలియజేశారు. వర్షాలకు ముందు, తర్వాత డ్యామ్లకు తనిఖీలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ప్రతి డ్యామ్, బరాజ్కు సంబంధించిన ప్రత్యేక నిర్వహణ, పర్యవేక్షణ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) నియమావళి (మాన్యువల్)ని సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అనిల్జైన్ సూచించారు. నాగార్జునసాగర్ డ్యామ్కు మరమ్మతులు చేయకపోతే డ్యామ్ భద్రత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ విభజన తర్వాత నాగార్జునసాగర్ నిర్వహణ తెలంగాణకు, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీకి వెళ్లిందని అనిల్కుమార్ జైన్కు వివరించారు. 2023 నవంబర్లో ఏపీ ప్రభుత్వం పోలీసు బలగాలతో బలవంతంగా నాగార్జునసాగర్ కుడివైపు భాగాన్ని తన అధీనంలోకి తీసుకుందని తెలిపారు. దీంతో డ్యామ్కు మరమ్మతుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. చట్ట ప్రకారం సాగర్ డ్యామ్ ఓనర్ తెలంగాణ రాష్ట్రమేనని ఎన్డీఎస్ఏ చైర్మన్ బదులిచ్చారు.కాళేశ్వరం బరాజ్లపై దిశానిర్దేశం చేయాలి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల తాత్కాలిక, శాశ్వత పునరుద్ధరణ చర్యలకు ఎన్డీఎస్ఏ తుది నివేదికలో ఎలాంటి సిఫారసులు చేయలేదని ఈఎన్సీ అనిల్కుమార్ అన్నారు. ఈ అంశంపై చర్చించడానికి ఢిల్లీకి వస్తే నిపుణుల కమిటీని పిలిపించి తగిన సిఫారసులు చేయిస్తామని అనిల్జైన్ బదులిచ్చారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ (ఓఅండ్ఎం) టి.శ్రీనివాస్, రామగుండం సీఈ సుధాకర్రెడ్డి, కొత్తగూడెం సీఈ ఎ.శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని, దిగువన ప్రమాదకర స్థాయిలో ప్లంజ్ పూల్ విస్తరించిందని, వర్షాలు ప్రారంభానికి ముందే మరమ్మతులు నిర్వహించాలని ఈఎన్సీ అనిల్కుమార్ విజ్ఞప్తి చేశారు. తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని అనిల్జైన్ బదులిచ్చారు. నాగార్జునసాగర్ స్పిల్వేకు శాశ్వత మరమ్మతుల కోసం టవర్ క్రేన్ ఏర్పాటు చేశామని అనిల్కుమార్ చెప్పారు. సాగర్ కట్టపై ఏపీ ఆక్రమణను తొలగించి, మరమ్మతులకు సహకరించాలని కోరారు. -
రాజకీయ ప్రేరేపిత చర్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదికను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ప్రేరేపిత చర్య. 2024 మే 1 వరకు ఎన్డీఎస్ఏ సిఫారసులు ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది. రిపోర్టు ఇచ్చిన తర్వాత మరమ్మతులు చేయకపోవడం మరో కుట్ర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేడిగడ్డ ప్రాజెక్టును కూల్చివేసే కుట్ర చేశాయి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మౖక్కై ఎన్డీఎస్ఏ నివేదికను ఈడీ, సీబీఐ తరహాలో వాడుతున్నారు..’ అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో ఎన్డీఎస్ఏ బిల్లును లోక్సభలో కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ వ్యతిరేకించారని చెప్పారు. గతంలో ఆయన కు ఎన్డీఎస్ఏ తప్పుగా కన్పించిందని, ఇప్పుడు అదే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక..ఆయనకు భగవద్గీతలా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. భారత్ సమ్మిట్, రైతు మహోత్సవాలు, ఎన్డీఎస్ఏ తుది నివేదిక పేరిట బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని, అయినా కేసీఆర్ గర్జనతో కాంగ్రెస్ కకావికలం అయిందని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ నివేదికను ప్రశ్నిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘ఎన్డీఎస్ఏ నిర్మించిన పోలవరం డయాఫ్రమ్ వాల్ కుప్పకూలినా నాలుగేళ్లుగా ఎందుకు సందర్శించ లేదు..’ అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నివేదిక తప్పుబట్టింది ‘బీఆర్ఎస్పై విమర్శలు చేయాలనే తొందరపాటులో మంత్రి ఉత్తమ్ కనీసం ఎన్డీఎస్ఏ నివేదికను కూడా అధ్యయనం చేయలేదు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని నివేదికలో చెప్పకున్నా.. బురద చల్లేందుకు ఉత్తమ్ అపసోపాలు పడ్డారు. బ్లాక్ 7ను తిరిగి నిర్మించడం ద్వారా మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావచ్చని ఎన్డీఎస్ఏ నివేదిక చెప్పడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. లక్ష కోట్లు వృధా అయితే నీళ్లెలా వస్తున్నాయి? మహారాష్ట్రతో అంతర్ రాష్ట ఒప్పందం లేకుండానే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి కాంగ్రెస్ నేతలకు కమీషన్లు దోచిపెట్టారు. అనుమతులు తేవడంలో విఫలం కావడం వల్లే సీడబ్ల్యూసీ, వాప్కోస్ సూచన మేరకు నీటి లభ్యత ఉన్న మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించాం. నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెంచడం వల్లే ప్రాజెక్టు వ్యయం పెరిగింది. నిపుణుల సూచనల మేరకే అన్నారం, సుందిళ్ల బరాజ్ల లొకేషన్ మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల వృధా జరిగితే నీళ్లు ఎలా వస్తున్నాయి?..’ అని హరీశ్రావు ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్కు వెంటనే మరమ్మతు చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, చింత ప్రభాకర్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, పార్టీ నేత ఎర్రోల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ కక్కుర్తి వల్ల చాలా నష్టం జరిగింది: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, సాక్షి: మేడిగడ్డ ప్రాజెక్టు కట్టింది.. కూలిపోయింది.. ఈ విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికగా ఇచ్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనేనని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్డీఎస్ఏ నివేదికపై తెలంగాణ సచివాలయంలో మంగళవారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారాయన. తెలంగాణ ఆర్టిక వ్యవస్థకు సంబంధించింది బాధ్యత గల పౌరుడిగా మాట్లాడుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం బీఆర్ఎస్వాళ్లు తప్పుడు ప్రచారాలు చేశారు. 16 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం.. 38వేల కోట్లతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం అనాడు వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రీ ఇంజినీరింగ్, రీ డిజైనింగ్ చేసింది. కమిషన్ల కోసం ప్రాజెక్టు అంచనాలు పెంచింది. కమీషన్లకక్కుర్తి కోసం ప్రాణహిత డిజైన్ మార్చింది. చివరకు తుమ్మిడిహెట్టి వద్ద కట్టాల్సిన బ్యారేజి...మేడిగడ్డ వద్ద వంద మీటర్ల హైట్ తో కట్టారు. దీని వల్ల ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు తీవ్ర నష్టం జరిగింది. తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చే బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. బ్యారేజీల నిర్మాణ సమయంలోనే లోపాలు తెలిసినప్పటికీ సరిదిద్దుకోలేదు. సుందిళ్ల, అన్నారం దగ్గర సాయిల్ టెస్ట్ చేయలేదు. ప్రారంభానికి ముందే లోపాలు బయటపడ్డాయి.. కానీ, బీఆర్ఎస్ ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర నష్టం జరిగింది. కాళేశ్వరం డిజైన్లు ఒకలా ఉంటే.. మరోలా నిర్మాణం చేశారు. ప్రాజెక్టు కోసం 85 వేల కోట్లు అంచనా వేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం లోన్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కూలింది. NDSA మేడిగడ్డ పరిశీలనకు వచ్చింది గత ప్రభుత్వం పాలనలోనే. మేడిగడ్డ లో డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని NDSA రిపోర్ట్ గత ప్రభుత్వ హయంలోనే ఇచ్చారు. NDSA అథారిటీ బిల్లుకు పార్లమెంట్లో BRS మద్దతు పలికింది. దేశంలో 5600 బ్యారేజీలు, డ్యామ్లను ఎన్డీఎస్ఏ పర్యవేక్షిస్తోంది. దేశంలో ఏ బ్యారేజీకి ఎలాంటి సమస్య వచ్చినా NDSA నుంచే అభిప్రాయం చెప్తుంది. NDSA లో జాతీయ అంతర్జాతీయ నిపుణులు ఉన్నారు. అలాంటిది NDSA నిపుణులను సైతం BRS నాయకులు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంపై లక్షన్నర కోట్ల భారం పడుతోంది. ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులకు మిత్తి ఏడాదికి 16వేలు కట్టాల్సి వస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక మేడిగడ్డపై ఎన్డీఎస్కు లేఖ చేశాం. 14 నెలలు పరిశీలించి నివేదిక రూపొందించింది. గత ప్రభుత్వ కక్కుర్తి వల్ల చాలా నష్టం జరిగింది తుమ్మెడిహట్టి దగ్గర రెండు ప్రాజెక్టులు కడతామన్నారు. తట్టెడు మట్టి కూడా పోయలేదు. పైగా అక్కడ నీటి లభ్యత లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు.. లొకేషన్ పెద్ద మిస్టేక్. అది కూలినప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. వాల్స్, భీమ్స్లో రంధ్రాలు వచ్చాయని ఎన్డీఎస్ఏ పేర్కొంది. ఇంతకన్నా సిగ్గు చేటు ఉంటుందా?. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి.. అనవసర మాటలు మాట్లాడుతున్నారు అని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. కాళేశ్వరాన్ని ఉపయోగించుకునే స్థితి లేదని ఎన్డీఎస్ఏ చెప్పింది. రీడిజైన్ చేసి నిర్మాణం చేయాలని చెప్పింది. రిపోర్ట్ ఆధారంగానే ముందుకు వెళ్తాం ప్రాజెక్టు తప్పిదాలకు కారణమైన అధికారుల పై చట్టప్రకారం చర్యలు ఉంటాయి. అధికారులు తప్పిదాలు చేయడానికి కారణమైన వ్యక్తి గత ప్రభుత్వ పెద్ద కేసీఆర్ . చట్టప్రకారం గత ప్రభుత్వ పాలకులు, అధికారులపై చర్యలు ఉంటాయి. రాబోయే కేబినెట్ భేటీలో NDSA రిపోర్ట్ పై చర్చ జరుపుతాం. క్యాబినేట్ లో చర్చించిన తర్వాత ప్రాజెక్టు పై తదుపరి కార్యాచరణ ప్రకటన చేస్తాం.