
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం(kaleshwaram Project) ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం(Congress Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంలో దెబ్బతిన్న కీలక బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అవసరమైన కొత్త డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి ఆహ్వానానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ క్రమంలో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ) దర్యాప్తు ఆధారంగా పునరుద్ధరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక, వచ్చిన డిజైన్ టెండర్లను ప్రభుత్వం సీల్డ్ కవర్లో పెట్టనుంది. ఈనెల 15న టెండర్లను ప్రభుత్వం ఓపెన్ చేయనుంది. కాగా, కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ఈవోఐ పిలవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా గత నెల 19న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోగా డిజైన్ కన్సల్టెంట్ను ఎంపిక చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించడంతో ఈ ప్రక్రియ మరింత వేగం అందుకుంది.
ఇక, ఎన్డీఎస్ఏ ప్రకారం, వానాకాలానికి ముందు, ఆ తర్వాత బ్యారేజీల వద్ద భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే వర్షా కాలానికి ముందు చేపట్టాల్సిన పరీక్షలను అధికారులు పూర్తి చేశారు. అయితే, ప్రస్తుతం వరదల కారణంగా వర్షా కాలం తర్వాత చేయాల్సిన పరీక్షలకు ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి డిసెంబర్ లేదా జనవరి వరకు, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు నవంబర్ వరకు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.