
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల ప్రభావం
63 శాతం నియామకాలు నిలిపివేసిన బహుళ జాతి కంపెనీలు
ఉద్యోగులపై 21శాతం అదనపు పనిభారం
లింక్డిన్ డేటా ఆధారంగా జీనియస్ కన్సల్టెంట్స్ నివేదిక
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా మధ్య ప్రాచ్యంలో ముసురుకుంటున్న యుద్ధ మేఘాలతో బహుళ జాతి కంపెనీలు నూతన నియామకాలను నిలిపివేయడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారుతోంది. ఏకంగా 63శాతం కంపెనీలు కొత్త నియామకాలను ప్రస్తుతానికి నిలుపుదల చేసినట్టు ప్రముఖ మార్కెటింగ్– హెచ్ఆర్ ప్రొవైడర్ ‘జీనియస్ కన్సల్టెంట్స్’ తాజా నివేదిక వెల్లడించింది. మే, జూన్లలో లింక్డిన్ డేటాను విశ్లేషిస్తూ విడుదల చేసిన నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ..
⇒ ప్రపంచంలోని ప్రముఖ బహుళ జాతి సంస్థల్లో 63శాతం కొత్త ఉద్యోగుల నియామకాలను ప్రస్తుతానికి నిలిపివేశాయి. ఉన్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే దిశగా చర్యలు చేపట్టాయి.
⇒ 15శాతం సంస్థలు రెగ్యులర్ ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించడం, లేదంటే ఫ్రీలాన్సర్ల సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి.
⇒ 36శాతం మంది ఉద్యోగుల పదోన్నతులు, జీతాల పెంపు, బోనస్ల చెల్లింపులపై ప్రతికూల ప్రభావం పడింది.
⇒ ఉద్యోగులకు పనిభారం 21శాతం పెరిగింది.
⇒ అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగుల పనితీరు గుర్తింపు, కార్యాలయ పనిమీద విదేశీ పర్యటనల అవకాశాల్లో 22శాతం కోత విధించారు.