600 కిలోల గంజాయి స్వాధీనం
ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్
తుమ్మపాల/కడప వైఎస్ఆర్ సర్కిల్: రూ.3 కోట్ల విలువైన 600 కిలోల గంజాయిని అనకాపల్లి రూరల్ పోలీసులు పట్టుకుని ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా గురువారం వెల్లడించారు. ముందస్తు సమాచారంతో అనకాపల్లి పోలీసులు సంపతిపురం జంక్షన్ వద్ద మాటువేసి గంజాయి లోడుతో ఉన్న వ్యాన్తో పాటు పైలట్ కారును పట్టుకున్నారు.
వ్యాన్(ఏపీ 39 వీఏ 6786)లో ఉన్న 600 కిలోల గంజాయి, పైలట్ వాహనంగా వాడిన హోండా సివిక్ (ఏపీ 16 బీసీ 0018) కారును స్వా«దీనం చేసుకున్నారు. నిందితులైన షేక్ మస్తాన్ వలి, షేక్ మదీనా, పాంగి రత్నను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. రూ.3 లక్షల కమీషన్ ఒప్పందంతో గంజాయిని ఒడిశాలోని మల్కాజ్గిరి జిల్లా చిత్రకొండ నుంచి తునిలో అందించేందుకు ప్లాన్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. ప్రధాన నిందితుడు షేక్ మస్తాన్వలిపై వేర్వేరు చోట్ల 5 గంజాయి కేసులు ఉన్నాయన్నారు.
కడపలో ఎండు గంజాయి పట్టివేత
కడపలో ఎండు గంజాయిని స్వా«దీనం చేసుకున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ఈఎస్టీఎఫ్, కడప ఎక్సైజ్ అధికారులు వాహనాల తనిఖీ చేస్తుండగా నగరంలోని బుద్ధ టౌన్షిప్ నుంచి విశ్వేశ్వరయ్య సర్కిల్ వైపునకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని తనిఖీ చేశారు. వీరి వాహనంలో 9 కిలోల గంజాయి లభ్యమైంది.
నిందితులైన మోటుపల్లి సతీష్ చంద్ర, బొమ్మవరం రవిరాజాను అరెస్టు చేశారు. వీరు అల్లూరి జిల్లా చింతలపల్లికి చెందిన కామేష్ అనే వ్యక్తి నుంచి కిలో రూ.5 వేల చొప్పున పది కిలోలు కొనుగోలు చేశారు. దాన్ని చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి ఒక్కో ప్యాకెట్ రూ.500 నుంచి డిమాండ్ని బట్టి రూ.5,000 వరకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే కిలో గంజాయి విక్రయించగా, మిగిలిన 9 కిలోలను తరలిస్తుండగా పట్టుబడ్డారు.


