ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి | Five children die while swimming | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి

May 14 2025 4:57 AM | Updated on May 14 2025 4:57 AM

Five children die while swimming

వైఎస్సార్‌ జిల్లా మల్లేపల్లెలో విషాదం

బ్రహ్మంగారి మఠం: వైఎస్సార్‌ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం మల్లేపల్లె చెరువులో ఈతకు దిగి చరణ్‌ (15), పార్థు (12), హర్ష (12), దీక్షిత్‌ (12), తరుణ్‌ యాదవ్‌ (10) మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి సెలవులు కావటంతో మల్లేపల్లెకి చెందిన ఉప్పలపాటి నారాయణ యాదవ్‌ ఇంటికి అతడి చెల్లెళ్లు సావిత్రి, భవాని హైదరాబాద్‌ నుంచి పిల్లలతో కలిసి వచ్చారు. 

గ్రామంలోని చెరువులో ఈత కొట్టాలని భావించిన భవాని పిల్లలు చరణ్, పార్థు, మరో చెల్లెలు సావిత్రి కుమారుడు హర్ష, మల్లేపల్లె గ్రామానికి చెందిన మేకల గంగాధర్‌ యాదవ్‌ కుమారుడు తరుణ్‌ యాదవ్, కాశినాయన మండలం మల్లేరు కొట్టాలకు చెందిన నారాయణ కుమారుడు దీక్షిత్‌ గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లారు. చీకటి పడినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో చెరువు వద్దకు వెళ్లారు. 

పిల్లల బట్టలు ఒడ్డున ఉండటం.. చుట్టూ ఎక్కడా పిల్లల జాడ కనిపించపోవడంతో చెరువులో పిల్లలు గల్లంతైనట్టు తెలుసుకుని గాలించారు. సమాచారం అందుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పోలీసులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత మృతదేహాలు లభ్యమయ్యాయి. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ఎస్‌ఐ శివప్రసాద్‌ గాలింపు చర్యలను పర్యవేక్షించారు.  

Advertisement
 
Advertisement
Advertisement