
సాక్షి, తాడేపల్లి: తాను పంపింది ఒక లేఖ అయితే.. రాజీనామా లేఖ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ప్రత్యర్థులపై మాజీ మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. తాను రాజీనామా చేయలేదని, అవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మేకతోటి సుచరిత బుధవారం సుమారు గంటన్నర భేటీ అయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తనకు వీసమెత్తు అవమానం కూడా జరగలేదన్నారు. జడ్పీటీసీ స్థాయి నుంచి హోంమంత్రి వరకు తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం ఇచ్చారని తెలిపారు. కేబినెట్లో కొంతమందిని మారుస్తామని సీఎం జగన్ ముందే చెప్పారని అన్నారు. కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యల వల్లే ఇంటి నుంచి బయటకు రాలేకపోయానని తెలిపారు.
కేబినెట్ పునర్వ్యవస్థీరణలో సీఎం జగన్ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని సుచరిత తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో మనిషిగా తనను ఎప్పుడూ ఆదరిస్తారని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు.
చదవండి: టీడీపీ, తోక పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: మంత్రి ఆర్కే రోజా