
తప్పులు కప్పిపుచ్చేందుకు జలవనరుల శాఖ మంత్రి యత్నం..
వాల్ నిర్మించేది భూగర్భంలో..
మందం లోతు కొలవడానికి ప్రత్యేక సాంకేతికత
ట్రెంచ్ కట్టర్, గ్రాబర్ను కార్మికులతో కొలిపించి..
1.5 మీటర్ల మందం ఉన్నట్లుగా మాయ చేసిన మంత్రి నిమ్మల
మంత్రి నిమ్మల తీరుతో విస్తుపోయిన ఇంజినీర్లు
అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఎత్తిచూపిన తప్పులను బహిర్గతం చేసిన ‘సాక్షి’
ఆ తప్పులను దిద్దుకోవాల్సిందిపోయి మంత్రి డ్రామాలు
కమీషన్ల కక్కుర్తితో 2016–18లో చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారంటున్న ఇంజినీరింగ్ నిపుణులు
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం గ్యాప్–2 పునాది డయాఫ్రం వాల్ పనుల్లో అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆక్షేపించిన, ‘సాక్షి’ ఎత్తిచూపిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మంగళవారం గోదావరి వేదికగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు డ్రామా చేశారు. డయాఫ్రం వాల్ను భూగర్భంలో నిర్మిస్తారు. దాని మందం, లోతు, నాణ్యత కొలతకు ప్రత్యేక సాంకేతికతను ఉపయోగిస్తారు.భూమిని తవ్వే ట్రెంచ్ కట్టర్/గ్రాబర్ను బేయర్ సంస్థ కార్మికులతో టేపుతో కొలిపించి.. 1.5 మీటర్ల మందంతో డయాఫ్రం వాల్ను నిర్మిస్తున్నట్లుగా ప్రకటించి మంత్రి నిమ్మల మాయ చేశారు. దీనిపై ఇంజినీరింగ్ నిపుణులు విస్తుపోయారు.
కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్, డ్రాయింగ్ ప్రకారం డయాఫ్రం వాల్ను గరిష్ట లోతు వంద మీటర్లతో 3 శాతం టోలరెన్స్(విచలనం, భ్రమణం) డీవియేషన్తో 1.5 మీటర్లు(1500 మిల్లీమీటర్లు) మందంతో నిర్మించాల్సి ఉండగా.. కనిష్ట మందం 0.9 మీటర్లు(900 మిల్లీమీటర్లే) ఉందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చిచెబుతూ ఈనెల 4న పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కి నివేదిక ఇచ్చింది. ఈ అంశంపై సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని సిఫార్సు చేసింది.
ఇదే అంశాన్ని ‘డయాఫ్రం వాల్ పనులు డిజైన్కు విరుద్ధం’ శీర్షికన ఆదివారం ప్రచురించిన కథనం ద్వారా ‘సాక్షి’ బహిర్గతం చేసింది. అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సులను పాటిస్తూ డయాఫ్రం వాల్ను నాణ్యతతో నిర్మించాల్సిందిపోయి.. చేస్తున్న తప్పులను కప్పిపుచ్చేందుకు మంత్రి యత్నించడంపై ఇంజినీరింVŠ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్కు విరుద్ధంగా..!
ప్రధాన డ్యాం గ్యాప్–2లో 1396.6 మీటర్ల పొడవు.. 1.5 మీటర్ల మందం, 93.5 మీటర్ల లోతు.. 0.3 శాతం టోలరెన్స్(విచలనం, భ్రమణం) డీవియేషన్తో డయాఫ్రం వాల్ను నిర్మించేలా ఈ ఏడాది జనవరి 16న సీడబ్ల్యూసీ, డిజైన్, డ్రాయింగ్, లేఅవుట్ ప్లాన్ను ఆమోదించింది. డయాఫ్రం వాల్ నిర్మాణానికి వర్కింగ్ ప్లాట్ఫాంను ఏర్పాటుచేసి దానిపై ట్రెంచ్ కట్టర్/గ్రాబర్తో భూమి లోపల రాతి పొర తగిలే వరకూ తవ్వుతూపోతారు. ప్యానళ్లను అత్యంత కఠిన శిల(సౌండ్ హార్డ్ రాక్)లోకి రెండు మీటర్లు దించాలి.
ఖాళీ ప్రదేశంలోకి బెంటనైట్ మిశ్రమంతో నింపుతూపోవాలి. ఆ తర్వాత 32 డిగ్రీల వద్ద టీ–16 ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనాన్ని అధిక ఒత్తిడితో పంపాలి. అప్పుడు బెంటనైట్ మిశ్రమం బయటకు వస్తుంది. కొంత బెంటనైట్ మిశ్రమం ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనంతో కలిసి పటిష్ట గోడగా మారుతంది. అదే డయాఫ్రం వాల్.. అధిక ఒత్తిడితో ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనాన్ని పంపినప్పుడు అది విచలనం, భ్రమణాని(టోలరెన్స్)కి గురవడం వల్ల మందం కాస్త తగ్గుతుంది.
0.3 శాతం విచలనం, భ్రమణాన్ని పరిగణలోకి తీసుకుంటే.. సీడబ్ల్యూసీ ఆమోదించిన ప్రకారం గరిష్ట లోతు 100 మీటర్ల వద్ద అంటే అట్టడుగు భాగంలో డయాఫ్రం వాల్ మందం కనిష్టంగా 1.2 మీటర్లు.. గరిష్టంగా 1.455 మీటర్లు ఉండాలి. అట్టడుగు భాగంలో అంతకంటే మందం తగ్గితే డయాఫ్రం వాల్ సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్కు విరుద్ధంగా ఉన్నట్లు లెక్క. డయాఫ్రం వాల్ నాణ్యతను నిర్ణయించడానికి నిర్వహించిన పరీక్షల్లో దాని మందం కనిష్టంగా 0.9 మీటర్లే ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణుల కమిటీ గుర్తించి.. అదే అంశాన్ని నివేదికలో తెలిపింది.
నిన్న ఒకలా.. నేడు మరోలా..: జలవనరుల శాఖ మంత్రి నిమ్మల సోమవారం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ లోతుకు వెళ్లే క్రమంలో కొన్ని ప్రాంతాల్లో 0.3 మీటర్లు, ఒక ప్యానల్ పక్కన మరో ప్యానల్ దించేటప్పుడు 0.3 మీటర్లు మందం మొత్తం 0.6 మీటర్లు తగ్గే అవకాశం ఉంటుందని సీడబ్ల్యూసీ ఆమోదించిన డయాఫ్రం వాల్ డిజైన్లో ఉందని పేర్కొన్నారు.
నిర్దిష్టంగా 0.9 మీటర్ల మందంతో డయాఫ్రం వాల్ ఉండాలనే లక్ష్యంతోనే డయాఫ్రం వాల్ మందాన్ని 1.5 మీటర్లుగా నిర్ణయించారన్న విషయాన్ని గ్రహించాలని, పోలవరం పనులు పరుగులు పెడుతుండటాన్ని జీర్ణించుకోలేక ‘సాక్షి’ అబద్ధాపు కథనాలను ప్రచురిస్తోందని విమర్శించారు.
కానీ.. పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయి పరిశీలన పేరుతో మంగళవారం అక్కడికి వెళ్లిన నిమ్మల ట్రెంచ్ కట్టర్/గ్రాబర్ను కార్మికులతో కొలిపించి.. డయాఫ్రం వాల్ను 1.5 మీటర్ల మందంతో నిర్మిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే.. డయాఫ్రం వాల్ నిర్మాణంలో తప్పులను కప్పిపుచ్చేందుకు మంత్రి నిమ్మల డ్రామాలాడినట్లు స్పష్టమవుతోంది.
పనుల నాణ్యతపై నోరుమెదపరేం?:
డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించిన ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనం నాణ్యత లోపం వల్ల ఏప్రిల్ నాటికి 52 ప్యానళ్లలో 9 ప్యానళ్ల పరిధిలో డయాఫ్రం వాల్లో పైభాగం 1 నుంచి 2 మీటర్ల లోతు వరకూ నీటి బుడగలు కన్పిస్తున్నాయని, సీపేజీ తీవ్రతను తేల్చడానికి 2 నుంచి 3 మీటర్ల లోతు వరకూ వరుసగా రంద్రాలు చేసి అధ్యయనం చేయాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచించిన అంశాన్ని ‘సాక్షి’ ఎత్తిచూపింది.
సీపేజీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో డయాఫ్రం వాల్ పైభాగంలో 1 నుంచి 2 మీటర్ల లోతు వరకూ తొలగించాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేయడాన్ని.. ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనం నాణ్యతను సమీక్షించి.. డయాఫ్రం వాల్ను నిర్మించాలని సూచించడాన్ని ‘సాక్షి’ చాటిచెప్పింది.
టీ–16 ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనం 32 డిగ్రీల వద్ద నాణ్యంగా ఉంటుందని.. కానీ 35 డిగ్రీలతో ఉన్న ప్లాస్టిక్ కాంక్రీట్ను వినియోగించడం, నీటి శాతం ఎక్కువగా ఉండటంతో ఆ ఉష్ణోగ్రతకు సిమెంటు, బెంటనైట్, కంకర వంటివి విడిపోయాయని(సెగ్రిగేట్).. ఇదే సీపేజీకి దారితీస్తోందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఆ ప్లాస్టిక్ కాంక్రీట్ను సమీక్షించి.. 32 డిగ్రీల వద్ద ఉండేలా చూడాలని సూచించింది. వాటిపై మంత్రి నిమ్మల నోరుమెదపకపోవడం గమనార్హం.
2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి
పోలవరం రూరల్: పోవలరం ప్రాజెక్టు పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను మంగళవారం ఆయన అధికారులు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో కలిసి పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతున్న తీరును ప్రాజెక్టు సీఈ నరసింహమూర్తి ఆయనకు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూఇప్పటికే డయాఫ్రమ్వాల్ నిర్మాణం 360 మీటర్లకు చేరుకుందన్నారు. గ్యాప్–1కు సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2026కు పూర్తి చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. అనంతరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో పనుల పురోగతిపై సమీక్షించారు.