నిజాలకు మసిబొట్టు.. బాబు కోసం కనికట్టు 

Eenadu Ramoji Rao Fake News On AP Govt Coal purchase - Sakshi

బొగ్గు కొనుగోలుపై ఈనాడు ‘పచ్చ’ పైత్యం 

ఇదే పని చంద్రబాబు చేసుంటే విజనరీ అని రాసేవారు 

సీఎం కుర్చీలో ఉన్నది ఆయన కాదు కాబట్టే బురదచల్లుడు 

కేంద్రం ఆదేశాల మేరకే విదేశీ బొగ్గు కొనుగోలు 

2015–16 నుంచి 2018–19 మధ్య 21.03 లక్షల టన్నులు కొనుగోలు 

ఈ ప్రభుత్వంలో ధర తగ్గింపు లక్ష్యంగా 4సార్లు టెండర్లు రద్దు 

ఐదవసారి తక్కువ ధరకే టెండరు ఆమోదం.. రివర్స్‌ టెండర్లతో రూ.5.1 కోట్లు ఆదా 

ఈ వాస్తవాలకు మసి పూస్తూ కుట్రతో తప్పుడు కథనం 

సాక్షి, అమరావతి: ‘మన చంద్రబాబు కాదు కదా.. వెయ్యండి బురద’ అంటూ రామోజీ మరోమారు తన ద్వంద్వ నీతి రాతలతో ప్రజల్లో విషం నింపే కార్యక్రమంలో ఇంకో అడుగు ముందుకు వేశారు. కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి బొగ్గును అధిక ధరతో కొన్నారనే సాకుతో వాస్తవాలకు మసి బొట్లు పెట్టారు. బొగ్గు కొనుగోలు టెండరులో అదానీ సంస్థ ఎల్‌–1గా నిలిచిందని ఒప్పుకుంటూ కూడా.. అది తప్పన్నట్లు ‘బొగ్గు టెండరూ అదానీకే’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని అచ్చేయడం కేవలం చంద్రబాబుకు రాజకీయంగా లబ్ధి చేకూర్చాలని కాదా? ఇదే పని చంద్రబాబు చేసి ఉంటే.. బాబు గ్రేట్‌ విజనరీ.. బాబు ముందు చూపు.. అని డప్పు కొట్టే వారు కాదా? సీఎం వైఎస్‌ జగన్‌ చేసినందున మీ ‘పచ్చ’కళ్లకు తప్పుగా కనిపిస్తోంది.

భవిష్యత్‌లో విద్యుత్‌ కొరత ఉండకూడదనే దూరదృష్టితో ఈ పని చేయడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారని మీ కథనంలోని వాక్యాలు చెప్పకనే చెబుతున్నాయి. అందుకే కదా.. ఈ ప్రభుత్వం ఈ టెండర్‌ను నామినేషన్‌పై కట్టబెట్టిందన్నట్లు మీరు తిమ్మినిబమ్మి చేసి చూపడాన్ని ఏమనాలి? తక్కువ ధరకు బొగ్గు కొనుగోలు కోసం నాలుగుసార్లు టెండర్లు నిర్వహించి రద్దు చేసిన విషయం మీకు తెలియదా? ఐదోసారి టెండర్లలో అదానీ సంస్థ ఎల్‌–1గా నిలిచిన తర్వాతే టెండర్‌ ఖరారు చేశారనేది నిజం కాదా? పచ్చి నిజాన్ని అందమైన అబద్ధంగా మార్చి.. ప్రజలంతా అదే నిజమని భ్రమ పడేలా చేయాలన్న మీ ఆరాటం వల్ల మీరు రోజురోజుకూ దిగజారి పోతున్నారనే విషయాన్ని గుర్తించండి. అబ్బే.. అలాంటివన్నీ మా ఒంటికి పట్టవు అనుకుంటే ‘టీడీపీ ఈనాడు’ అని పత్రిక పేరు మార్చుకుంటే సరి. మీ కథనంలో పేర్కొన్న నిజానిజాల్లోకి వెళితే.. 
20% విదేశీ బొగ్గును వాడుకోవాలంటూ కేంద్రం ఆదేశాలు  

ఆరోపణ: ప్రభుత్వంపై రూ.300 కోట్లు అదనపు భారం  
వాస్తవం:  7.50 లక్షల టన్నుల విదేశీ బొగ్గుతో 1,776 మిలియన్‌ యూనిట్ల అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు ఏపీపీడీసీఎల్‌ ఇవ్వగలుగుతుంది. దీనికి అ­య్యే వ్యయం యూనిట్‌కు రూ.4.44 చొప్పున రూ.788.54 కోట్లు. ఇదే 1,776 మిలియన్‌ యూనిట్లను పవర్‌ ఎక్సే్చంజి(బహిరంగ మార్కెట్‌)లో కొనుగోలు చేస్తే వెచ్చించాల్సిన సొమ్ము రూ.1,456.32 కోట్లు. పవర్‌ ఎక్స్చేంజిలో కొనాలంటే యూనిట్‌కు దాదాపు రూ.8.20 చెల్లించాలి. అంటే విదేశీ బొగ్గుతో ఉత్పత్తి చేయడం వల్ల రూ.668 కోట్లు డిస్కంలకు ఆదా. దేశీయ బొగ్గుతో సగటు ఉత్పత్తి వ్యయం పె­రుగుదలను పరిగణనలోకి తీసుకున్నాక, డిస్కంల­కు రూ.319.78 కోట్లు నికరంగా ఆదా అవుతుంది. 

ఆరోపణ: 6 శాతం విదేశీ బొగ్గు చాలు.. 
వాస్తవం:  దేశంలో తీవ్ర బొగ్గు కొరత నేపథ్యంలో బొగ్గు వినియోగంలో 20 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటూ కేంద్ర ఇంధన శాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల కమిటీ, సబ్‌ కమిటీలతో సమావేశాలు, కోల్‌ ఇండియా ద్వారా అన్ని జెన్‌కోలకు బొగ్గు సరఫరాపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది.

వారు చెప్పినంత విదేశీ బొగ్గును సేకరించడంలో విఫలమైతే, కోల్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి దేశీయ బొగ్గు సరఫరాను దామాషా ప్రకారం తగ్గిస్తారు. అదీకాకుండా కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎస్‌డీఎస్‌టీపీఎస్‌)లో 30 శాతం విదేశీ, 70 శాతం స్వదేశీ బొగ్గు వినియోగించి విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా రూపొందించారు. దీని ప్రకారం 30 శాతం విదేశీ బొగ్గునే దీనికి వినియోగించాలి.  
టన్ను విదేశీ బొగ్గును ఎన్టీపీసీ రూ.18,509కి కొనుగోలు చేస్తున్నట్టు తెలిపే డాక్యుమెంట్‌  

ఆరోపణ: టన్ను విదేశీ బొగ్గు ధర రూ.10వేల నుంచి 11 వేలు 
వాస్తవం:  విదేశీ బొగ్గు టన్ను ధర రూ.10 –11వేలకు లభిస్తుందని ఏ నిపుణులు చెప్పారో తెలియదు. నిజానికి దేశంలో రోజుకు 2.781 మిలియన్‌ టన్నుల బొగ్గు డిమాండ్‌ ఉన్నప్పటికీ 2.2 మిలియన్‌ టన్నులే అందుబాటులో ఉంది. అంతర్జాతీయ పరిస్థితులు, దేశంలో విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుదల కారణంగా విదేశీ బొగ్గు ధర చాలా ఎక్కువగా ఉంది. దీనికి రవాణా ఖర్చులు, జీఎస్టీ కలిపితే అదానీ కోట్‌ చేసిన ధర దాటిపోతుంది.

బొగ్గు ధర, రవాణా చార్జీలు అంతర్జాతీయ మా­ర్కెట్‌ ఇండెక్స్‌ రేట్లు, డా­లర్‌ మారకం రేట్ల ఆధారంగా అదానీకి చెల్లింపులు ఉంటాయి. ప్రస్తుతం, ఎన్టీపీసీ, ఇతర రాష్ట్ర థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు కేవలం ఇండెక్స్‌ బేస్డ్‌ ప్రైసింగ్‌ ఆధా­రంగా బొగ్గును సేకరిస్తున్నాయి. అదానీ ఇప్పటికే ఐసీఐ3(ఇండోనేషి­యన్‌ కోల్‌ ప్రైజ్‌) ఇండెక్స్‌ ఆధారంగా ఒక నౌకలో 1,65,000 మెట్రిక్‌ టన్నుల విదేశీ బొగ్గును తీసుకువచ్చి కృష్ణపట్నం పోర్ట్‌లో ఉంచింది. ఇండెక్స్‌ ఆధారంగా ఈ నౌక తీసుకువచ్చిన బొగ్గు మెట్రిక్‌ టన్ను ధర రూ.11,733 మాత్రమే.

ఆరోపణ: అదానీకి లబ్ధి చేకూర్చేందుకే.. 
వాస్తవం:  విదేశీ బొగ్గు కొనుగోలు కోసం ఏపీపీడీసీఎల్‌ ఇప్పటి వరకూ 4సార్లు బహిరంగ టెండర్లు పిలిచి ధర ఎక్కువనే ఉద్దేశంతో రద్దు చేసింది. 2021 అక్టోబర్‌ 20న 5 లక్షల టన్నుల కొనుగోలుకు టెండర్లు పిలవగా రూ.17,480 కోట్‌ చేసిన అదానీ ఎల్‌1గా నిలిచింది. 2022 మార్చి 28న రెండవసారి టెండర్లలో రూ. 25,650 కోట్‌ చేసి టైడెంట్‌ ఛెమ్‌ ఫర్‌ ఎల్‌1గా నిలిచింది.

2022 మే 4న మూడవసారి టెండర్లలో రూ.23,085 ధర కోట్‌ చేసి అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ ఎల్‌1గా నిలిచింది. 2022 జూలై 13న నాలుగోసారి రూ.13,990 ధర కోట్‌ చేసి చెట్టినాడ్‌ లాజిస్టిక్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ ఎల్‌1గా నిలిచింది. ఈ టెండర్లన్నింటినీ ఎక్కువ ధర అనే ఉద్దేశంతోనే ఏపీపీడీసీఎల్‌ రద్దు చేసింది.  ఐదవసారి టెండర్ల అనంతరం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.5.10 కోట్లు ఆదా అయ్యాయి.
ఐసీఐ–3 సూచిక ప్రకారమే చెల్లింపులుంటాయని తెలిపే ఒప్పందపత్రంలోని నిబంధన    

టెండర్ల ద్వారా బొగ్గు కొనుగోలు కొత్త కాదు 
ఐదోసారి టెండర్లలో 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కొనుగోలు కోసం టెండర్లు పిలవగా అయిదు సంస్థలు పాల్గొన్నాయి. ఎల్‌1గా వచ్చిన అదానీ సంస్థ టన్ను రూ.13,219తో సరఫరా చేసేందుకు ముందుకు వచ్చి ఒప్పందం చేసుకుంది. జాతీయ థర్మల్‌ విద్యుదుత్పత్తి సంస్థ (ఎన్టీపీసీ) చేసుకున్న ఒప్పందం ప్రకారం టన్ను విదేశీ బొగ్గు సరఫరా ధర (అన్నీ కలుపుకుని)రూ.18,509 పడుతోంది. ఇదే బొగ్గు­ను ఏపీ జెన్‌కో టన్ను ధర రూ.13,219తో (ప్లాంటుకు చేర్చేలా అన్నీ కలుపుకుని) కొనుగోలు చేసేందుకు బహిరంగ టెండర్ల ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది.  టెండర్ల ద్వారా బొగ్గు కొనుగోలు కొత్తేమీ కాదు.      
– బి.శ్రీధర్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్‌కో ఎండీ    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top