
అనంతపురం టూటౌన్ నుంచి కళ్యాణదుర్గానికి కేసు బదిలీ
డీఎస్పీ సమక్షంలో నిందితుల విచారణ
నేడో, రేపో అరెస్టు చూపే అవకాశం
సాక్షి టాస్క్ఫోర్స్: నకిలీ ఈ–స్టాంప్ల కుంభకోణంలో నిందితులను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి పాల్పడిన మీసేవ కేంద్ర నిర్వాహకుడు మీసేవ బాబు అలియాస్ యర్రప్పతో పాటు కేంద్రంలో పనిచేసే మరో ఇద్దరిని కూడా ఇటీవల అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే.
ఈ స్కాంలో తమ ప్రమేయంలేదని కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు మీసేవ బాబుపై అనంతపురం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న అనంతపురం పోలీసులు సుమారు ఐదు రోజులపాటు విచారణ జరిపారు. ఈ వ్యవహారంలో అనుమానం ఉన్న వారినీ అదుపులోకి తీసుకుని విచారించారు. 24 గంటల్లోపే నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కానీ, ఐదు రోజులు కావస్తున్నా అరెస్టు చూపకపోవడంతో ప్రజల్లో అనుమానాలు రేకెత్తాయి.
పోలీసుల్లో కదలిక..
ఈ–స్టాంప్ల కుంభకోణంలో నిందితుల అరెస్టు చూపకపోవడంపై వారివారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పోలీసులు అరెస్టుచేశారా లేక స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు ఎత్తుకెళ్లారా అన్న అనుమానం ప్రజల్లో రేకెత్తుతోంది. దీనికితోడు వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య విజయవాడ ప్రెస్మీట్ లో పరిణామాలపై పలు ప్రశ్నలు సంధించారు. దీంతో పోలీసుల్లో కదలిక వచ్చింది.
ఈనెల 26న ఈ కేసును అనంతపురం టూటౌన్ పోలీసుస్టేషన్ నుంచి కళ్యాణదుర్గానికి బదలాయించినట్లు పోలీసులు తెలిపారు. అదేరోజు సాయంత్రం పోలీసు పెద్దల నుంచి స్థానిక డీఎస్పీ, సిబ్బందికి ఆదేశాలు రావడంతో నిందితులను స్టేషన్కు తీసుకొచ్చారు. కళ్యాణదుర్గం డీఎస్పీ కార్యాలయంలో నిందితులను ఉంచి తమదైన శైలిలో విచారణ చేపట్టారు.
నేడో, రేపో అరెస్టు..
నకిలీ ఈ–స్టాంప్ల కుంభకోణంలో నిందితులను కళ్యాణదుర్గానికి తీసుకొచ్చారని సమాచారం తెలియడంతో వారి కుటుంబ సభ్యులు, మీడియా ప్రతినిధులు డీఎస్పీ కార్యాలయానికి తరలివచ్చారు. అయితే, కేసు తీవ్రమైందని, పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయని.. ఎవరూ కార్యాలయం లోపలకు వచ్చేందుకు అనుమతిలేదని డీఎస్పీ రవిబాబు తెలిపారు. త్వరలోనే నిందితులను కోర్టులో హాజరుపరుస్తామన్నారు.