
బదిలీల్లో నిబంధనలు బేఖాతర్
ఐదేళ్లు ఒకేచోట పనిచేస్తేనే ‘బదిలీ నిబంధన’
ఆ నిబంధనకు విరుద్ధంగా ఉత్తర్వులు
తిరుపతి కేంద్రంగా లోపాయికారీ ఒప్పందాలు
బేరసారాల నడుమ బదిలీ ప్రక్రియ
ఈ నెల 9తో ముగియనున్న గడువు
సాక్షి, అమరావతి: సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో దాదాపు అన్ని శాఖల్లో పైరవీలు ఊపందుకున్నాయి. పైరవీలలో బీసీ సంక్షేమ శాఖ ఓ అడుగు ముందుకేసి తన రూటే సెప‘రేటు’ అని అంటోంది. ఉద్యోగుల బదిలీల గడువు ఈ నెల 9తో ముగియనుండటంతో నిబంధనలు బేఖాతరు చేస్తూ గురువారం జారీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదంగా మారింది.
తిరుపతి కేంద్రంగా రెండు రోజుల క్రితం జరిగిన బేరసారాల ‘డీల్’ నేపథ్యంలోనే ఆ సర్క్యులర్ జారీ చేశారని, ఇది ముమ్మాటికీ బదిలీ నిబంధనలకు విరుద్ధమని ఉద్యోగులు చెబుతున్నారు. ఇటీవల డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా జిల్లా బీసీ సంక్షేమ అధికారులు/సాధికారత అధికారులకు అడ్డగోలుగా అడ్హాక్ పదోన్నతులు కల్పించిన బీసీ సంక్షేమ శాఖ ఇప్పుడు సాధారణ బదిలీల్లోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం విమర్శల పాలవుతోంది.
మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయంటే..
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు 2022 ఏప్రిల్ 8న మార్గదర్శకాలతో కూడిన జీవో 23ను రాష్ట్ర ఆరి్థక శాఖ జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి/ఉపాధ్యాయుడు ఒకేచోట (నగరం, పట్టణం, గ్రామం) పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేపట్టాలి. అదే ప్రాంతంలో స్థానిక బదిలీలు చేస్తే సంబంధిత కార్యాలయం లేదా సంస్థలో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారి బదిలీకి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు
రాష్ట్రంలో ఏ శాఖలోనూ లేనివిధంగా ఒక్క బీసీ సంక్షేమ శాఖలో తాజాగా జారీ చేసిన సర్క్యులర్ (మెమో నంబర్ ఎ/1210/2025) ఆరి్థక శాఖ జారీ చేసిన నిబంధనలకు విరుద్ధమని ఉద్యోగులు చెబుతున్నారు. జిల్లాల పునర్ర్విభజనతో 2022 ఏప్రిల్ 4న కొత్త జిల్లాలకు పాత జిల్లాల నుంచి కేటాయించిన ఉద్యోగులు ఉమ్మడి జిల్లా (పాత జిల్లా) సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుని బదిలీల్లో అవకాశం ఇవ్వాలన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. 2022 ఏప్రిల్ 3వ తేదీ వరకు అక్కడే కొనసాగిన వారి సర్వీసును కూడా లెక్కగట్టి బదిలీకి వెసులుబాటు ఇవ్వడం తొందరపాటు చర్య అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఐదేళ్ల నిబంధన.. మూడేళ్లకే బదిలీ
రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరించిన నేపథ్యంలో ఆర్డర్ టు సర్వ్పై కొత్త జిల్లాలకు 2022 ఏప్రిల్లో ఉద్యోగులను కేటాయించారు. ఆ లెక్కన ఏదైనా ప్రాంతంలో ఆప్పటినుంచి పనిచేస్తున్న వారి సర్వీసు మూడేళ్లు మాత్రమే అవుతుంది. ఉదాహరణకు కొత్తగా ఏర్పడిన ఎనీ్టఆర్ జిల్లాకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఓ ఉద్యోగిని కేటాయిస్తే.. ఆ ఉద్యోగి సర్వీసు ప్రస్తుతం మూడేళ్లు మాత్రమే ఉంటుంది.
వారికి బదిలీల్లో అవకాశం ఉండదు. పునర్ వ్యవస్థీకరణకు ముందు పాత కృష్ణా జిల్లాలో పనిచేసి, పునర్ వ్యవస్థీకరణ తరువాత కూడా పనిచేస్తున్న ఉద్యోగికి మాత్రం ఐదేళ్ల సర్వీసు పూర్తవుతుంది. ఒకేచోట ఐదేళ్లు సర్వీసు ఉన్న వారిని బదిలీ చేయాలనే నిబంధనను బేఖాతరు చేస్తూ.. కొత్తగా ఏర్పడిన జిల్లాలో పనిచేసిన ఉద్యోగుల పాత సర్వీసును కూడా కలిపి బదిలీ అవకాశం ఇవ్వడానికి పెద్దఎత్తున పైరవీలు సాగినట్టు విశ్వసనీయ సమాచారం.
ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో బదిలీ చేయాల్సి వచి్చనా.. వారికి ప్రత్యామ్నాయం (మ్యూచువల్)గా వేరొక ఉద్యోగి ఇష్టపడితేనే బదిలీ చేయాలి. అవేమీ పట్టించుకోకుండా పాత జిల్లా సర్వీసును కొత్త జిల్లా సర్వీసుకు కలిపి ఐదేళ్లు ఉంటే బదిలీ చేయాలని సర్క్యులర్ ఇవ్వడం ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ (రాష్ట్రపతి ఉత్తర్వుల)కు వ్యతిరేకమని ఉద్యోగులు చెబుతున్నారు.
ఉమ్మడి (పాత) జిల్లాలతో సంబంధం లేకుండా కొత్త జిల్లాలను కూడా జిల్లాలుగానే పరిగణించి స్టేషన్ సీనియారిటీని విడివిడిగా లెక్కించాలనే నిబంధనను కాదని, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా బీసీ సంక్షేమ శాఖ మెమో జారీ చేయడం వెనుక తిరుపతి జిల్లాకు చెందిన ఒక అధికారి కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. ముందుగానే బేరసారాలు కొనసాగించి.. ఒప్పందాలు కుదుర్చుకున్న తరువాతే మెమో జారీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.