
నిరసన దగ్గర నుంచి కేసుల వరకు కుట్రలే
టీడీపీ నిరసనలకు అనుమతులు లేవంటూ దర్శి డీఎస్పీనే ప్రకటించారు
అన్ని అనుమతులతో జగన్ పొదిలి పోరుబాట ర్యాలీ
అనుమతి లేకుండా నిరసన చేసినవారిని వదిలేశారు
నిబంధనలు పాటించిన వారిపై కేసులు పెట్టారు
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో పోలీసులు వింత వైఖరి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరుబాట కార్యక్రమం విషయంలో మొదట్నుంచీ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగానే వ్యవహరిస్తోంది. పోలీసుల అనుమతితోనే కష్టాల్లో ఉన్న పొగాకు రైతులకు మద్దతుగా పోరుబాట ర్యాలీ జరిగింది. పోలీసుల అనుమతి లేకుండా టీడీపీ వర్గీయులు నిరసనలకు దిగారు. గొడవలు సృష్టించారు. అయినా పోలీసులు అసలు నిందితులైన టీడీపీ వర్గీయులను వదిలేశారు. కేవలం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల పైనే కేసులు పెట్టడం కుట్రపూరితేమనన్న వ్యాఖ్యలు వినిస్తున్నాయి.
పోలీసులు అనుమతి లేకుండా నిరసనలు
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పొదిలి పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు నిరసనలకు దిగడం ద్వారా గొడవలు సృష్టించాలన్న కుట్ర జరిగిందని తెలుస్తోంది. పోరుబాటలో టీడీపీ చేపట్టిన నిరసనలకు పోలీసుల అనుమతులు లేవని ఈనెల 12న దర్శి డీఎస్పీ స్వయంగా చెప్పారు. పోలీసుల అనుమతి లభించాకే జగన్ పోరుబాటకు ఏర్పాట్లు చేసుకున్నారు. వారు సూచించిన రూట్ ప్రకారమే ర్యాలీ నిర్వహించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో టీడీపీ నిరసనలకు దిగడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలకు పోలీసుల నుంచి సరైన సమాధానాలు లేవు. టీడీపీ మూకలు అనుమతి లేకుండా పెద్ద సంఖఱ్యలో వ చ్చి, విధ్వంసం సృష్టించినా పోలీసులు పట్టించుకోలేదు. ర్యాలీని భగ్నం చేయాలన్న కుట్రతోనే పచ్చమూకలు నిరసనలకు దిగినట్లు స్పష్టమవుతోంది.
పచ్చమూకలకు కాపలాగా...
వైఎస్ జగన్ పొదిలిలోకి ప్రవేశించక ముందే స్థానిక టీడీపీ నాయకుడు గుణిపూడి భాస్కర్ ఇంటి వద్ద కొంత మంది పచ్చమూకలు గుమిగూడారు. నవాబ్ మిట్ట దగ్గర వంద మందికి పైగానే కాపుకాశారు. ఈ రెండు చోట్ల చేతిలో నల్లకుండలు పట్టుకొని, నల్లబెలూన్లు ఎగరేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తున్న పచ్చమూకలకు పోలీసులు కాపలా కాస్తూ కనిపించారు. నిజానికి పోలీసుల అనుమతి లేకుండా నిరసనలకు దిగిన వారిని అదుపులోకి తీసుకొని అక్కడ నుంచి తరలించాల్సి ఉంది.
కానీ వారి సమక్షంలోనే వైఎస్ జగన్ ర్యాలీ మీదకు రాళ్లు, చెప్పులు విసిరారు. అయినా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రాళ్లు రువ్వుతున్న దుండగులను వదిలేసి ర్యాలీకి తరలి వచ్చిన రైతులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తల మీద లాఠీచార్జి చేశారు.ర్యాలీ మీద రాళ్లు రువి్వన తరువాత కొందరు పోలీసులు పచ్చమూకలతో చెట్టాపట్టాలేసుకొని తిరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అసలు ఈ గొడవలు జరుగుతాయని ముందుగానే పోలీసులకు, పచ్చమీడియాకు తెలుసని జోరుగా ప్రచారం జరుగుతోంది.
వేషం మార్చి పిచ్చివేషాలేసి...
జగన్ ర్యాలీలో పక్కా ప్రణాళిక ప్రకారమే టీడీపీ నేతలు గొడవలు సృష్టించినట్లు స్పష్టమవుతోంది. పోరుబాటకు జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తారని ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తెలుసుకున్న అధికార పార్టీ వారు మారువేషంలో ర్యాలీలోకి ప్రవేశించినట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ కార్యకర్తలు తెల్ల ఖద్దరు దుస్తులు ధరించి ర్యాలీలోని ప్రజలతో కలిసిపోయినట్లు సమాచారం. అందుకోసం మార్కెట్ యార్డు పదవి ఇస్తామన్న హామీతో ఒక నాయకుడిని రంగంలోకి దించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇతర ప్రాంతాల నుంచి కిరాయి మూకలను రంగంలోకి దించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియోలు తీసి స్థానిక నాయకుడి ఫోన్కు పంపించినట్లు తెలుస్తోంది. ర్యాలీకి తరలి వచి్చన నిరక్షరాస్యులైన వృద్ధులు, మహిళలకు జాకెట్ ముక్కలు, నగదు, జగన్కు వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను పంపిణీ చేశారు. పోరుబాట భగ్నం చేయడానికి అధికార టీడీపీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో పోలీసు కేసుల పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధించే కుట్రలకు తెరలేపారు.