రావులపాలెం: డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొత్త కాలనీలో విషాదం చోటు చేసుకుంది. చిట్టీల వ్యాపారం చేస్తున్న కర్రి నాగేశ్వరరెడ్డి, దుర్గాలక్ష్మీ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని దంపతులు చనిపోవడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.
ఓ మహిళకు రూ. కోటి అప్పు ఇచ్చి తాము నిండా మునిగిపోయామని, ఆ డబ్బులు ఎంతకీ రాకపోవడంతో చేసేది లేక ఆత్మహత్యకు పాల్పడుతున్న సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.. ఆ మహిళ డబ్బులు ఇవ్వకపోవడంతోనే తాము ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని నాగేశ్వరరెడ్డి దంపతులు లేఖలో పేర్కొన్నారు.
గత నెల 31వ తేదీన కొప్పిశెఠ్టి నాగమల్లేశ్వరి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నాగేశ్వరెడ్డి తీసుకున్న రూ. 15 లక్షలు తిరిగి ఇవ్వకపోవడంతో నాగమల్లేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కర్రి నాగేశ్వరరెడ్డి దంపతులు బయటకు ఇచ్చిన నగదు కోసం ఎంత ప్రయత్నించినా తిరిగి వచ్చే అవకాశం లేదని భావించే బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.


