Husband Died In Amalapuram After Her Wife Won Councilor - Sakshi
Sakshi News home page

నే గెలిచా... లేవండీ!

Mar 15 2021 9:12 AM | Updated on Mar 15 2021 9:48 AM

Councilors Husband Deceased In Amalapuram - Sakshi

భర్త మృతదేహం వద్ద విలపిస్తున్న అమలాపురం పదో వార్డు వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ దుర్గాబాయి 

మున్సిపాలిటీలో 10వ వార్డు నుంచి వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌గా గెలిచిన కొల్లాటి నాగవెంకట దుర్గాబాయి ఆమె భర్త మృతదేహం వద్ద విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

అమలాపురం టౌన్‌: ఏవండీ.. లేవండీ.. ఎన్నికల్లో నే గెలిచా.. నన్ను ఆశీర్వదించండి. మీరిచ్చిన ధైర్యమే నాకు అండండీ.. మీరు లేరనే మాట నన్ను కుంగదీస్తుందండీ... అంటూ అమలాపురం మున్సిపాలిటీలో 10వ వార్డు నుంచి వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌గా గెలిచిన కొల్లాటి నాగవెంకట దుర్గాబాయి ఆమె భర్త మృతదేహం వద్ద విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. దుర్గాబాయి తల్లి శనివారం తెల్లవారు జామున మరణించారు. ఆ బాధను దిగమింగుకుని తప్పని పరిస్థితుల్లో అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కౌంటింగ్‌ హాలుకు ఆదివారం ఉదయం ఆమె వచ్చారు.

లెక్కింపు సమయంలో బరువెక్కిన హృదయంతోనే ఆమె ఉన్నారు. పదో వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించడంతో అంతా కృతజ్ఞతలు చెబుతుండగా.. ఇంతలో ఆస్పత్రిలో ఉన్న తన భర్త కూడా మరణించినట్లు సమాచారం తెలియడంతో కుంగిపోయింది. రెండు రోజుల వ్యవధిలోనే తల్లీ, భర్త చనిపోవడంతో ఆమె పడుతున్న బాధ వర్ణనాతీతం. వారిద్దరూ ఐసీయూల్లో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నా ఆ బాధను దిగమింగి మున్సిపల్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బాధ్యతతో ప్రచారం చేశారు. చివరికి తల్లీ భర్త మరణించడంతో కౌన్సిలర్‌గా గెలిచిన ఆనందం పంచుకునే అవకాశం లేకుండా పోయింది. దుర్గాబాయి దీన గాథను చూసి వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలే కాకుండా స్థానిక ప్రజలు చలించిపోయారు. ఆమె వద్దకు వెళ్లి ఓదార్చారు. మంత్రి పినిపే విశ్వరూప్, బేబీ మీనాక్షి దంపతులు, పట్టణ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర సంతాపం తెలిపారు.
చదవండి:
ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు.. 
మున్సిపల్‌ ఎన్నికలు: టీడీపీ సీనియర్లకు షాక్‌ 

Advertisement
 
Advertisement
Advertisement