కోవిడ్‌ ప్రభావం తగ్గగానే రచ్చబండ

CM YS Jaganmohan Reddy Said Rachabanda Program Will Be Organized - Sakshi

గ్రామాల్లో పర్యటించే నాటికి అర్హులందరికీ ఇంటి పట్టా అందాలి

‘స్పందన’పై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌

యాంత్రీకరణ కోసం దాదాపు రూ.1700 కోట్ల ఖర్చు 

విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఆర్బీకేల ద్వారా అందాలి.. ఆర్డర్‌ చేసిన 72 గంటల్లో ఇసుక 

ఆగస్టు 31 నాటికి స్కూళ్లలో నాడు– నేడు సివిల్‌ పనులు పూర్తి కావాలి

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే రాష్ట్రంలో పేదలకూ స్వాతంత్య్రం వస్తుందని భావిస్తున్నాను. అందుకే ఆ రోజున (ఆగస్టు 15) రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తాం. ఆ మేరకు అధికారులు సిద్ధం కావాలి.

రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల కుటుంబాలు ఉండగా, ఇప్పుడు 30 లక్షల నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నాం. ఆ విధంగా 20 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నాం. ఇప్పటికే 97.83 శాతం ప్లాట్ల విభజన పూర్తయ్యింది. మిగతా వాటిని కూడా వెంటనే పూర్తి చేయాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

‘కరోనా తగ్గుముఖం పట్టగానే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. ప్రజల సమస్యలు, పథకాలు అమలవుతున్న తీరును స్వయంగా పరిశీలించేందుకు గ్రామాల్లో పర్యటిస్తాను. ప్రజలు పెట్టుకునే అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారం అవుతున్నాయా లేదా అన్న దానిపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి’    – ట్విట్టర్‌లో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: కోవిడ్‌ ప్రభావం తగ్గగానే రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. గ్రామాల పర్యటన ద్వారా ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారం తీరును స్వయంగా తెలుసుకుంటానని స్పష్టం చేశారు. అప్పటికల్లా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం అందేలా చూడాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్, సీజనల్‌ వ్యాధులు, పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు, ఇసుక సరఫరా, వ్యవసాయం, ఉపాధి హామీ పనులు, పాఠశాలల్లో నాడు–నేడు పనులపై సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇళ్ల స్థలాల కోసం రూ.22,355 కోట్లు
► రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం మొత్తం రూ.22,355 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. ఇందుకోసం 66,842 ఎకరాల భూముల్లో ఇళ్ల స్థలాలు లే అవుట్‌ వేశాం.
► ఇందులో రూ.7,700 కోట్ల విలువైన 25,462 ఎకరాల ప్రభుత్వ భూమి, రూ.9,200 కోట్ల విలువైన 23,262 ఎకరాల ప్రైవేటు భూమి, రూ.1350 కోట్ల విలువైన 4,457 ఎకరాల ల్యాండ్‌ పూలింగ్‌ భూములు, రూ.325 కోట్ల విలువైన 1,074 ఎకరాల సీఆర్డీయే భూములు, రూ.810 కోట్ల విలువైన 2,686 ఎకరాల టిడ్కో భూమి, పొజిషన్‌ సర్టిఫికెట్ల ద్వారా సేకరించిన రూ.2,970 కోట్ల విలువైన 9,900 ఎకరాల భూములు ఉన్నాయి. రాష్ట్రంలో ఏనాడూ ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఏ ప్రభుత్వం కూడా ఇంత ఖర్చు చేయలేదు.   

ఇళ్ల స్థలాల పంపిణీ నిరంతర ప్రక్రియ
► సచివాలయాల్లో ప్లాట్ల లబ్ధిదారుల జాబితాలు డిస్‌ప్లే అవుతున్నాయా? లేదా? అన్నది అధికారులు చెక్‌ చేయాలి. ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి అర్హత ఉంటే, గతంలో చెప్పిన విధంగా 90 రోజుల్లో ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తాం. ఇది నిరంతర ప్రక్రియ.  
► పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాల పట్టాలపైనే అత్యధికంగా దరఖాస్తులు స్పందనలో వస్తున్నాయన్న విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలి. నిర్ణయించుకున్న సమయంలోగా ఆ దరఖాస్తులను పరిష్కరిస్తున్నామో లేదో చూడాలి. కోవిడ్‌ పరిస్థితులు తగ్గగానే రచ్చ బండ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తా. అప్పటికల్లా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం అందేలా చూడాలి.
► పేదల ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 19 వేల లేఅవుట్లు అభివృద్ధి చేయగా, వాటిలో 13 వేల లేఅవుట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటన్నింటిలో వన మహోత్సవం (జగనన్న పచ్చతోరణం)లో భాగంగా మొక్కలు నాటాలి. అన్ని లేఅవుట్లలో వన మహోత్సవం కార్యక్రమం చేపట్టాలి.

ఇసుక నిల్వలు పెంచాలి
► ఆర్డర్‌ పెట్టిన 72 గంటల్లో ఇసుక డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాలలో బ్యాక్‌లాగ్‌ ఉంది.  స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి రెండు మూడు రోజుల్లో మొత్తం క్లియర్‌ చేయాలి. 
► వర్షాకాలంలో పనుల కోసం 52.5 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉంది.  వర్షాల వల్ల రీచ్‌లు మునిగిపోయే పరిస్థితులు వస్తాయి కాబట్టి, ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ రీచ్‌లు ప్రారంభించి ఇసుక నిల్వలు పెంచాలి.

వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ పనులు ఊపందుకోవాలి
► గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ రూరల్‌ హెల్త్‌ క్లినిక్స్, వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ పనులు ఊపందుకోవాలి. దీనిపై జాయింట్‌ కలెక్టర్లు రోజూ సమీక్షించాలి. కలెక్టర్లు రోజు విడిచి రోజు వాటి నిర్మాణాలపై దృష్టి పెట్టాలి. వాటి నిర్మాణం కోసం ఇంకా పలు చోట్ల స్థలాలు గుర్తించాల్సి ఉంది. కలెక్టర్లు వెంటనే ఆ పని పూర్తి చేయాలి. 
► కోవిడ్‌ లాంటి విపత్తులను ఎదుర్కోవాలంటే వైఎస్సార్‌ రూరల్, అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ చాలా అవసరం. అందువల్ల వాటిపై శ్రద్ధ చూపాలి. అదే విధంగా కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపును వెంటనే పూర్తి చేయాలి.

మనబడి నాడు–నేడు పనులు పూర్తి చేయాలి
► ఈ ఏడాది సెప్టెంబరు 5న స్కూళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో నాడు–నేడు కింద చేపట్టిన అన్ని సివిల్‌ పనులు ఆగస్టు 31 నాటికి పూర్తి కావాలి. వాటిపై ప్రతి రోజూ జేసీ రివ్యూ చేయాలి. కలెక్టర్‌ రెండు రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించాలి.

ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందాలి
► రాష్ట్రంలో ఈ ఏడాది 39 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 10 జిల్లాలో అధికంగా, 3 జిల్లాల్లో సాధారణ వర్షం కురిసింది. ఇది చాలా మంచి పరిణామం. అందువల్ల క్వాలిటీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతు భరోసా కేంద్రాల  ద్వారా అందేలా జాయింట్‌ కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. 
► క్వాలిటీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించే బాధ్యత ప్రభుత్వానిదని మాట ఇచ్చాం. ఆ మేరకు అవి సకాలంలో ఇస్తున్నారా? లేదా? అన్నది పరిశీలించాలి.
► ఇ–క్రాపింగ్‌ కోసం జాయింట్‌ అజమాయిషీ సరిగ్గా జరుగుతుందా? లేదా? అన్నది చూడాలి. సంబంధిత జేసీలు దీనిపై దృష్టి పెట్టాలి. గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్లు ఆ ప్రక్రియ పూర్తి చేయాలి.
► కౌలు రైతుల కోసం తీసుకొచ్చిన సాగు ఒప్పందం అమలు చేయాలి. దాని వల్ల తమకు ఎలాంటి నష్టం జరగదని రైతులకు అవగాహన కల్పించాలి. తద్వారా కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాలి.

ఇళ్ల స్థలాలను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తాం. అన్నింటికీ పక్కా డాక్యుమెంట్లు ఇస్తాం. వాటిలో స్పష్టంగా లబ్ధిదారు పేరు, ప్లాటు, సరిహద్దుల వివరాలు రాయాలి. ఈ ప్రక్రియ అంతా ఆగస్టు 10 నాటికి పూర్తి కావాలి.

వ్యవసాయ సలహా కమిటీలు
జిల్లా, మండల స్థాయి వ్యవసాయ సలహా కమిటీలు ఏర్పాటు చేశాం. ఆ కమిటీల సమావేశాలు నిర్వహించేలా చూడాలి. ఏ పంటలు వేయాలి? ఏవి వేయకూడదు? మార్కెటింగ్‌ అవకాశాలు ఏంటి? తదితర అంశాలపై చర్చించాలి. ఏ పంటలు సాగు చేస్తే మంచి ధరలు వస్తాయన్న దానిపై కమిటీలకు సమాచారం ఉంచాలి.  ఆ కమిటీల ద్వారా ఆర్‌బీకేలు, అక్కడ నుంచి రైతులకు ఆ సమాచారం అందాలి. ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలి.  ఆర్బీకేల పరిధిలో రైతుల గ్రూపులు ఏర్పాటు కావాలి. దీని వల్ల వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు ఆర్బీకేలకు అందించగలుగుతాం. వ్యవసాయ యాంత్రీకరణ కోసం దాదాపు రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పంటలకు వచ్చే వ్యాధులు, తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

టోల్‌ఫ్రీ నంబర్లు
► పంటల సాగులో వచ్చే కష్టనష్టాలపై తగిన సలహాలు ఇవ్వడానికి 155251 టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశాం.  ఈ నంబర్‌ ద్వారా శాస్త్రవేత్తల నుంచి రైతులకు సలహాలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులపై సమాచారం ఇస్తున్నారు. 
► 20 మంది సైంటిస్టులను కాల్‌ సెంటర్లో పెట్టాం. ఆర్బీకేల్లో ఎలాంటి సమస్య వచ్చినా 1902కు నివేదించవచ్చు. వెంటనే ఆ సమస్యలపై అధికారులు దృష్టి సారించాలి. కాల్‌ సెంటర్లు సరిగ్గా పని చేస్తున్నాయా? లేదా? అన్నది అధికారులు స్వయంగా ఫోన్‌ చేసి పరిశీలించాలి.
► ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top