గిరిజనాభివృద్ధిలో నవశకం

CM YS Jagan Review Meeting With Tribal Welfare Department Officials - Sakshi

ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ 

1.24 లక్షల మందికి 2.28 లక్షల ఎకరాలకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు 

19,919 మంది గిరిజనులకు 31,155 ఎకరాల్లో డీకేటీ పట్టాలు  

గిరిజన రైతుల చేతుల్లో ఏటా రూ.13,500 నగదు పెడుతున్నాం

ఆ భూముల్లో బోర్లు వేసి పంటల సాగుకు కార్యాచరణ 

నవరత్నాలతో గిరిజనుల్లో వెలుగులు

గిరిజన ప్రాంతాల్లో మరిన్ని మౌలిక సదుపాయాలకు బాటలు

ఇంటర్నెట్, మొబైల్‌ తదితర సౌకర్యాలు కల్పించాలి

స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాలు వేగవంతం చేయాలి 

గిరిజన ప్రాంతాల్లో అన్ని గ్రామ సచివాలయాలను ఆధార్‌ సెంటర్లుగా గుర్తించాలి

ఈ మేరకు ప్రణాళిక రూపొందించాలి

26న కేంద్రంతో సమావేశంలో వారి సహకారం కోరాలి

వారి వారి ఊళ్లలోని గ్రామ సచివాలయాల్లో గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చాం. వలంటీర్లుగా నియమించాం. తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్రైబల్‌ ప్రాంతాల్లో గిరిజనులకు పూర్తి రిజర్వేషన్‌ ఇచ్చాం. రికార్డు స్థాయిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. స్కూళ్లు, ఆస్పత్రులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, వాటి రూపురేఖలు మారుస్తున్నాం. పౌష్టికాహారం పంపిణీ ద్వారా  గర్భిణులు, బాలింతలైన చెల్లెమ్మలు, చిన్నారులకు అండగా నిలిచాం. ఈ కార్యక్రమాలన్నీ గిరిజనుల జీవన ప్రమాణాలను కచ్చితంగా పెంచుతాయి.       – సీఎం జగన్‌

సాక్షి, అమరావతి : చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గిరిజనుల అభివృద్ధికి ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపట్టి, సంతృప్త స్థాయిలో అమలు చేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా తొలి విడతలో 1.24 లక్షల మందికి 2.28 లక్షల ఎకరాలకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చామని తెలిపారు. దేశంలోనే ఇది ఒక చరిత్ర అని, రెండో విడతలో మరికొంత మందికి ఈ పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. 19,919 మంది గిరిజనులకు 31,155 ఎకరాల్లో డీకేటీ పట్టాలు ఇచ్చామన్నారు. వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సెప్టెంబర్‌ 26న సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు తీసుకుంటున్న చర్యలు, ఈ విషయంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో హోం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు, వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టాలు ఉన్న గిరిజన రైతులకు రైతు భరోసా కూడా ఇస్తున్నామని చెప్పారు. ప్రతి ఏటా రూ.13,500 వారి చేతిలో పెడుతున్నామన్నారు. ఆ భూముల్లో బోర్లు వేసి, పంటల సాగు కోసం కార్యాచరణ రూపొందించామని, దీన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఆసరా, చేయూత, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలతో నవరత్నాల ద్వారా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని పేర్కొన్నారు. 36 షెడ్యూలు మండలాల్లో పాఠశాలలు, హాస్టళ్లను నాడు –నేడు కింద 10 అంశాల ద్వారా మెరుగు పరుస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 


హోం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

గిరిజన గ్రామాలకు కమ్యూనికేషన్‌ మెరుగు పరచాలి
– గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించాం. రోడ్లు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు పలు చర్యలు తీసుకున్నాం. షెడ్యూలు ప్రాంతాల్లోని స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాలు చేపట్టాం. ఈ కార్యక్రమాలకు కేంద్రం సాయం అందేలా చూడాలి.
– గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న టవర్ల మ్యాపింగ్‌ జాగ్రత్తగా చేయాలి. దాదాపు 400 టవర్ల ద్వారా 900 గ్రామాలకు టెలికాం సౌకర్యం కల్పిస్తున్నందున ఇంటర్నెట్, మొబైల్‌ సౌకర్యం సమగ్రంగా ఇచ్చేలా విధానం ఉండాలి.
– దీనిపై ఒక ప్రణాళిక రూపొందించాలి. ఒక్క గ్రామం కూడా మిగిలిపోకుండా అన్ని గిరిజన గ్రామాలకు ఇంటర్నెట్, మొబైల్‌ సౌకర్యం కల్పించే దిశగా అడుగులేయాలి. 
– గ్రామ సచివాలయాలు ఉన్న ప్రతి చోటా పోస్ట్‌ ఆఫీసు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు మ్యాపింగ్‌ చేసుకుని, మిగిలిన పోస్ట్‌ ఆఫీసులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి. ట్రైబల్‌ యూనివర్సిటీని త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. 
– గిరిజనుల్లో చాలా మంది పిల్లలకు ఆధార్‌ లేదని తెలుస్తోంది. ఈ దృష్ట్యా గిరిజన ప్రాంతాల్లోని అన్ని గ్రామ సచివాలయాలను ఆధార్‌ సెంటర్లుగా గుర్తించేలా కూడా కేంద్రాన్ని కోరాలి.  
 
తగ్గిన మావోయిస్టుల కార్యకలాపాలు 
రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని, సాయుధ మావోయిస్టుల బలం సుమారు 50కి పరిమితమైందని డీజీపీ గౌతం సవాంగ్‌ వివరించారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకే పరిమితమయ్యాయని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు గిరిజనుల జీవితాలపై విశేష ప్రభావం చూపుతున్నాయన్నారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా వారి గడప వద్దకే సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పట్ల గిరిజనులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. మావోయిస్టుల రిక్రూట్‌మెంట్‌ పట్ల గిరిజన యువకులు ఆసక్తి చూపడం లేదని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలే ఇందుకు ప్రధాన కారణమని డీజీపీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్ప శ్రీవాణి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top