కరువు ప్రాంతాల్లో చెరువులపైనే ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం వైఎస్‌ జగన్‌

CM YS Jagan Review on Externally Aided Projects at Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఈఏపీ (ఎక్స్‌టర్నెల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్స్‌)పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మొత్తం 10 ప్రాజెక్టుల కోసం రూ. 25,497.28 కోట్లు ఖర్చుచేస్తోంది ప్రభుత్వం. ఈ సందర్భంగా.. న్యూడెవలప్‌మెంట్‌ (ఎన్డీబీ)బ్యాంకు, ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ), జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోపరేషన్‌ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ బ్యాంకుల రుణసహాయంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులనూ సమీక్షించారు సీఎం జగన్‌. 

ఈ సమీక్ష సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా చూసుకోవాలని, నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.  

కరువు ప్రాంతాల్లో కాల్వల ద్వారా చెరువుల అనుసంధానం: రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర తదితర కరవు ప్రాంతాల్లో చెరువులను కాల్వల ద్వారా అనుసంధానం చేయాలని సీఎం జగన్‌.. అధికారులకు సూచించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని.. ఉండాల్సిన చోట చెరువులు ఉన్నాయా? లేవా? ఉన్న చెరువుల పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయాలని ఆదేశించారు.  

ఒకవేళ అవసరమైన చోట చెరువులు లేకపోతే.. అక్కడ కొత్తగా చెరువులు నిర్మించాలన్న ఆయన.. ఈ చెరువులన్నింటినీకూడా గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయాలని అధికారులకు చెప్పారు. దీనివల్ల భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయని, పర్యావరణ సమతుల్యత కూడా ఉంటుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. చెరువు కింద చక్కగా భూములు సాగు జరుగుతుందని, వ్యవసాయం బాగుండడంతో ఉపాధి, ఆదాయాలు కూడా స్థిరంగా ఉంటాయని, ఒక సమగ్రమైన అధ్యయనం చేసి ఈప్రాజెక్టును చేపట్టాలని, ప్రపంచబ్యాంకు లాంటి ఆర్థిక సంస్థల సహాయంతో ముందుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు  సీఎం జగన్‌.

పోర్టులతో పెద్దఎత్తున​ అభివృద్ధి 
పనులు పూర్తిచేయకుండా వదిలేసిన బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లు.. వీటిని పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు.  ‘‘రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో మూడు పోర్టులు కడుతున్నాం. వీటిచుట్టుపక్కల అభివృద్ధి జరిగే అవకాశాలు బాగా ఉంటాయి కాబట్టి, వాటి పరిధిలో ల్యాండ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం అన్నది చాలా అవసరం. దీనివల్ల పోర్టు ఆధారితంగా పెద్ద  ఎత్తున అభివృద్ధి జరుగుతుందని అధికారులతో సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో సీఎస్‌ సమీర్‌ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జి సృజన, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీ పి రాజాబాబు.. ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కుప్పంలో సీఎం జగన్‌ పర్యటన

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top