‘సంపూర్ణ పోషణ’కు సీఎం జగన్‌ శ్రీకారం

CM YS Jagan‌ Launched YSR Sampurna Poshana Schemes - Sakshi

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించిన సీఎం  

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ఈ పథకాల్లో ఇస్తున్న ఆహార పదార్థాల మెనూపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.. పదార్థాల రుచి చూశారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అమలులో ఉన్న వైఎస్సార్‌ అమృత హస్తం, మధ్యాహ్న భోజన పథకం, బాలామృతం, వైఎస్సార్‌ బాల సంజీవనికి అదనంగా వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేయనున్నారు. (చదవండి: జగన్‌ పాలనపై వంద శాతం సంతృప్తి

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకం..
4 రాష్ట్రంలోని 77 గిరిజన, సబ్‌ప్లాన్‌ మండలాల పరిధిలోని 8 ఐటీడీఏలు, 52 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులతో పాటు 8,320 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 66 వేల మంది గర్భిణులు, బాలింతలకు నెలలో 25 రోజులపాటు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, గుడ్డు అందజేస్తారు. టేక్‌ హోమ్‌ న్యూట్రిషన్‌ కిట్‌ కింద నెలకు 2 కిలోల మల్టీ గ్రెయిన్‌ ఆటా, అర కిలో వేరుశనగ చిక్కీ, అరకిలో రాగి పిండి, అరకిలో బెల్లం, అరకిలో ఎండు ఖర్జూరం పంపిణీ చేయనున్నారు. ఒక్కో లబ్ధిదారుడిపై నెలకి రూ.1,100 చొప్పున మొత్తం రూ.87.12 కోట్లు ఖర్చు చేయనున్నారు.

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం..
ఈ పథకాన్ని 77 గిరిజన మండలాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా 47,287 అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయనున్నారు. 5.80 లక్షలమంది గర్భిణీలు, బాలింతలకు నెలలో 25 రోజులు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, కోడి గుడ్లు సరఫరా చేస్తారు. టేక్‌ హోం న్యూట్రిషన్‌ కిట్‌ కింద నెలకు 250 గ్రాముల వేరుశనగ  చిక్కీ, కిలో రాగి పిండి, 250 గ్రాముల బెల్లం, మరో 250 గ్రాముల ఎండు ఖర్జూరం, కిలో సజ్జ పిండి అందిస్తారు. దీని కోసం ఒక్కొక్కరిపై నెలకు రూ.850 చొప్పున మొత్తం రూ.591.60 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top