
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై సమీక్ష జరిపారు. ఇప్పటికే తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లాలకు ప్రభుత్వం పంపింది. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆదేశాలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో హై అలర్ట్గా ఉండాలన్నారు. ఇప్పటికే మీకు నిధులు ఇచ్చామని, తుపాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమని’’ కలెక్టర్లు, అధికారులకు సీఎం సూచించారు.
చదవండి: అసని తుపాను ఎఫెక్ట్.. 37 రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..
‘‘కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశం. అయినా ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదు. ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి. అవసరమైన చోట సహాయపునరావాస శిబిరాలను తెరవండి. సహాయ శిబిరాలకు తరలించిన ఒక వ్యక్తికి రూ.వెయ్యి, కుటుంబానికి రూ.2వేల చొప్పున ఇవ్వండి. సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయండి. జనరేటర్లు, జేసీబీలు.. ఇవన్నీకూడా సిద్ధంచేసుకోండి. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని’’ సీఎం అన్నారు.
‘‘తుపాను బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండి. వారికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవాలి. పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దు. సెంట్రల్ హెల్ప్ లైన్తో పాటు, జిల్లాల వారీగా హెల్ప్లైన్ నంబర్లు సమర్థవంతగా పనిచేసేలా చూడాలి. వచ్చే కాల్స్ పట్ల వెంటనే స్పందించండి. ఈ నంబర్లకు బాగా ప్రచారం కల్పించాలని’’ సీఎం పేర్కొన్నారు.
ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..
అసని తుపాను ప్రభావంతో విశాఖ, తుర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. విశాఖపై అసని తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏపీ తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మొహరించారు. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరోవైపు పలువురు మంత్రులు అసని తుపాను ప్రభారంపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
చదవండి: ‘అసని’ తుపాను తెచ్చిన ‘బంగారు’ మందిరం
కంట్రోల్ రూమ్ నంబర్లు
కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 18004253077
కాకినాడ ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 0884-2368100
శ్రీకాకుళం: 08942-240557
తూర్పు గోదావరి: 8885425365
ఏలూరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 18002331077
విజయనగరం: 08922-236947
పార్వతీపురం మన్యం: 7286881293
మచిలీపట్నం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 08672 252572
మచిలీపట్నంం ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 08672 252486
బాపట్ల కంట్రోల్ రూమ్ నంబర్: 8712655878, 8712655881
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 90103 13920
విశాఖ: 0891-2590100,102
అనకాపల్లి: 7730939383