చక్కని వసతులు.. ఇంగ్లిష్‌ మాటలు

CM YS Jagan Comments In High Level Review Meeting On Nadu Nedu  - Sakshi

అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చబోతున్నాం

నాడు–నేడు, వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లపై సమీక్షలో సీఎం జగన్‌ 

55,607 అంగన్‌వాడీల్లో నాడు–నేడు కింద పది రకాల మౌలిక వసతుల కల్పన 

ఇందులో 27,438 అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్తగా భవనాలు

తొలి దశలో 17,984, రెండో దశలో 9,454 కేంద్రాలు 

నవంబర్‌లో పీపీ–1, పీపీ–2 స్కూళ్లు ప్రారంభించేందుకు చర్యలు

కిండర్‌ గార్టెన్‌ స్కూల్స్‌ పాఠ్య ప్రణాళికను అధ్యయనం చేయాలి 

అత్యుత్తమ విధానాలు ఉంటే ఇక్కడా అమలు చేయాలి

స్కూళ్ల తరహాలోనే అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ నాడు–నేడు కార్యక్రమం కింద అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం. రన్నింగ్‌ వాటర్‌తో టాయిలెట్లు, తాగు నీరు, చిన్న, పెద్ద మరమ్మతులు, విద్యుదీకరణ,కిచెన్, రిఫ్రిజిరేటర్, ఫర్నిచర్, గ్రీన్‌ చాక్‌ బోర్డు, 55 అంగుళాల టీవీ, గోడలపై పెయింటింగ్స్‌తో పాటు ప్లే జోన్‌ (క్రీడా స్థలం) ఉండేలా మార్పులు చేయాలి. ఈ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దు.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల రూపు రేఖలు పూర్తిగా మార్చబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. 55,607 అంగన్‌వాడీల్లో కొత్తగా 27,438 అంగన్‌వాడీ కేంద్రాల భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో తొలి దశలో 17,984 భవనాల నిర్మాణాలను ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించాలని, రెండో దశలో 9,454 భవనాల నిర్మాణం వచ్చే ఏడాది నవంబర్‌ 14న ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మిగతా వాటన్నింటిలో 10 రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు–నేడు, వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. 
నాడు–నేడు, వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో సీఎస్‌ నీలం సాహ్ని, మంత్రులు వనిత, ఆదిమూలపు సురేష్‌ తదితరులు 

వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లు.. పీపీ–1, పీపీ–2 
► అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మహిళా శక్తి కేంద్రాల (ఎంకేఎస్‌) సూపర్‌వైజర్లు ఇంగ్లిష్‌లో మాట్లాడడం కోసం సాధన ప్రారంభించాలి. ఇందుకు మొబైల్‌ యాప్‌ రూపొందించాలి. నవంబర్‌ రెండో వారం నుంచి పీపీ–1, పీపీ–2 స్కూళ్లు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి.  
► కిండర్‌ గార్టెన్‌ స్కూల్స్‌లో ఉన్న పాఠ్య ప్రణాళిక అధ్యయనం చేయాలి. అక్కడ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు ఇక్కడ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలి. అంగన్‌వాడీ టీచర్స్‌ ట్రైనింగ్‌ పక్కాగా ఉండాలి. మరింత ఛాలెంజింగ్‌గా ఉండాలి.  
► ఈ సమీక్షలో మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్నితో పాటు, విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

డిసెంబర్‌లో నాడు–నేడు పనులు 
► నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ఈనెల 30వ తేదీ నాటికి స్థలాలు గుర్తింపు పూర్తి చేసి, ఆ తర్వాత అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయాలి. మెటీరియల్‌ సేకరణ, ఇతర పనులన్నీ పూర్తి చేసుకుని, ఈ ఏడాది డిసెంబర్‌ 1న పనులు మొదలుపెట్టి, వచ్చే ఏడాది జూన్‌ 30 నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకోవాలి. 
► కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వైజరీ కమిటీ, కరిక్యులమ్‌ కమిటీలు.. ఫుడ్, శానిటేషన్, బాత్రూమ్స్‌పై కూడా మానిటరింగ్‌ చేయాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top