రూ.200 కోట్లతో గ్రామాలకు రక్షణ గోడ | CM Jagan to Irrigation Chief Engineering protective wall for villages | Sakshi
Sakshi News home page

రూ.200 కోట్లతో గ్రామాలకు రక్షణ గోడ

Aug 9 2023 6:10 AM | Updated on Aug 9 2023 6:10 AM

CM Jagan to Irrigation Chief Engineering protective wall for villages - Sakshi

సాక్షి అమలాపురం: గోదావరి నది కోత వల్ల ఇళ్లు దెబ్బతినే ప్రాంతాల్లో గ్రోయెన్లు, రివిట్‌మెంట్‌ నిర్మాణాల కోసం రూ.200 కోట్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లంక గ్రామ వాసుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ఆయన ముమ్మిడివరం మండలం గురజాపులంక, కూనలంక రామాల­యం­పేట, లంకాఫ్‌ ఠానేల్లంక రామాలయంపేట, అయినవిల్లి మండలం కొండుకుదురులంకలోని తొత్తరమూడివారిపేటలో నదీ కోత తీవ్ర­తను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలె­క్టర్‌ హిమాన్షు శుక్లా, ముమ్మిడివరం, పి.గన్నవరం ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్, కొండేటి చిట్టిబాబులు కోత తీవ్రత గురించి సీఎంకు వివరించారు. ఈ ప్రాంతంలో గ్రోయెన్లు, రివిట్‌­మెంట్ల నిర్మాణాలు చేపట్టాలని కోరారు.  బాధి­తుల ఇళ్ల వద్దకు వెళ్లిన సమయంలో. బహిరంగంగా వారితో మాట్లాడినప్పుడు పలువురు ఇదే సమస్యను ప్రస్తావించారు. దీనిపై కూనలంకలో సీఎం జగన్‌.. అప్పటికప్పుడే స్పందిస్తూ ఆరు గ్రామాల్లో కోతకు పరిష్కారం చూపేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

జనం నివాసముండే ఆవాస ప్రాంతాల్లో సుమారు 3.5 కిలోమీటర్ల మేర బిట్లు బిట్లుగా గ్రోయెన్ల నిర్మాణాలు చేపడతామని తెలిపారు. పొట్టిలంకలో వెయ్యి మీటర్లు, కొండుకుదురులంక వద్ద 400 మీటర్లు, వివేకానంద వారధి వద్ద 300 మీటర్లు, లంకాఫ్‌ ఠానేల్లంకలో 400 మీటర్లు, కూనలంక వద్ద 800 మీటర్లు, గురజాపులంక వద్ద 600 మీటర్లు చొప్పున నిర్మిస్తామని చెప్పారు.

ప్రజల సమక్షంలోనే ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీరు సతీష్‌తో మాట్లాడారు. ఎప్పటికి పూర్తి స్థాయిలో అంచనాలు తయారు చేస్తారని ప్రశ్నించారు. అంచనాలు పూర్తి చేసి, నెలాఖరు నాటికి టెండర్లు పూర్తి చేయాలని, ఆ తర్వాత నెల రోజులకు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పనులు మొదలైన తర్వాత కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌లు తనకు ఫొటోలు పంపాలని ఆదేశించారు. 

Advertisement
 
Advertisement
Advertisement