
బుక్లెట్ను ఆవిష్కరిస్తున్న సీఎం జగన్, రూపకర్త షకిన్ కుమార్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు యునైటెడ్ నేషన్స్ లక్ష్యాలకు చేరువలో ఉన్నాయని ఐక్యరాజ్య సమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంపై షకిన్ కూమార్ రూపాందించిన సమగ్ర సమాచార బుక్లెట్ను బుధవారం తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సదస్సులో సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. గత సెప్టెంబర్లో పది మంది పేద విద్యార్థులను ఐక్యరాజ్యసమితికి తీసుకువెళ్లడంపై షకిన్ కుమార్ను సీఎం జగన్ అభినందించారు.
జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని షకిన్ పేర్కొన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం, అర్హతలు, దరఖాస్తు విధానం, అందించే కోర్సులు, డాక్యుమెంట్స్ చెక్లిస్ట్, అప్లికేషన్ స్టేటస్ చెకింగ్, అక్రిడేషన్, యూనివర్సిటీల జాబితా వంటి సమస్త సమాచారం ఈ పుస్తకంలో పొందుపరిచినట్టు వివరించారు. ఈ పథకం పేద, ప్రతిభావంతమైన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు రూ.కోటిన్నరకు పైగా స్కాలర్షిప్ రూపంలో ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు.