కలకలం.. సీఐ నాగరాజు వేధింపులకు మరో యువకుడు బలి? | CI Nagaraju Faces Serious Allegations Over Two Youth Deaths | Sakshi
Sakshi News home page

కలకలం.. సీఐ నాగరాజు వేధింపులకు మరో యువకుడు బలి?

Jun 18 2026 3:41 PM | Updated on Jun 18 2026 4:11 PM

CI Nagaraju Faces Serious Allegations Over Two Youth Deaths

సాక్షి,కృష్ణ: ప్రశాంతంగా ఉండే విజయవాడ నగరం.. గాదె సాయికృష్ణ అదృశ్యం, కస్టడీ మరణం ఆరోపణల ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంచలనం సద్దుమణగక ముందే.. కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజుపై మరో తీవ్ర ఆరోపణ వెలుగులోకి వచ్చింది. 

గతంలో క్రాంతికుమార్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం చర్చనీయాంశంగా మారింది. తన ఆత్మహత్యకు సీఐ నాగరాజే కారణమంటూ క్రాంతికుమార్ మరణానికి ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఒకే పోలీస్ అధికారిపై వరుసగా ఇద్దరు యువకుల మరణాలు, అదృశ్యాలకు సంబంధించిన ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది. 

సీఐ నాగరాజు నిరంతర వేధింపుల వల్లే క్రాంతికుమార్ ప్రాణాలు తీసుకున్నాడని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో పోలీస్ స్టేషన్‌కు రావాలని పిలిచిన వెంటనే తీవ్ర భయాందోళనకు గురైన క్రాంతికుమార్.. విష గుళికలు మింగి తనువు చాలించాడు. ఈ ఘోరానికి సంబంధించి మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అప్పట్లోనే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఎవరీ సీఐ నాగరాజు
విజయవాడ నగరంలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు పనిచేశారు. ఇద్దరు యువకుల (గాదె సాయికృష్ణ, క్రాంతికుమార్) అదృశ్యం, మరణం కేసులలో తీవ్రమైన వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

గాదె సాయికృష్ణ (25) అనే యువకుడిని మే 9, 2026న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆచూకీ పూర్తిగా గల్లంతైంది. సీఐ నాగరాజు ఆధ్వర్యంలో సాయికృష్ణను పోలీస్ స్టేషన్‌లో దారుణంగా కొట్టి, థర్డ్ డిగ్రీ ఉపయోగించారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ హింస భరించలేకే అతను కస్టడీలోనే మరణించి ఉంటాడని (లాకప్ డెత్) అతని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై బెజవాడ బార్ అసోసియేషన్ సాయంతో కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు, జూన్ 29 లోపు సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.

ఇదే క్రమంలో క్రాంతికుమార్ అనే మరో యువకుడి మృతి కూడా తీవ్ర కలకలం రేపింది. ఇటీవల కృష్ణలంక పోలీసులు తనను స్టేషన్‌కు రావాలని పిలవడంతో తీవ్ర ఆందోళనకు గురైన క్రాంతికుమార్ విష గుళికలు (పురుగుల మందు) మింగి ఆత్మహత్య చేసుకున్నాడు.

చనిపోయే ముందు ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో ఇటీవల బయటపడింది. ఆ వీడియోలో క్రాంతికుమార్ స్పందిస్తూ... ‘కృష్ణలంక సీఐ నాగరాజు మూడు నెలలుగా నన్ను వేటాడుతూ, కొడుతూ తీవ్రంగా వేధిస్తున్నారు. నా చావుకు ఆయనే కారణం’ అని స్పష్టంగా పేర్కొనడం సంచలనంగా మారింది. ఈ రెండు వరుస ఘటనలకు సీఐ నాగరాజు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement