
విశాఖపట్నంలో క్రిస్మస్ ప్రార్థనలు చేస్తున్న మహిళలు
గుణదల (విజయవాడ తూర్పు)/అనంతపురం కల్చరల్: లోక రక్షకుడైన యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగానున్న క్రైస్తవులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. చర్చి ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన శాంతాక్లాజ్, క్రిస్మస్ ట్రీ విశేషంగా ఆకట్టుకోగా.. పశువుల పాకలో కొలువైన బాలయేసును భక్తి శ్రద్ధలతో పూజించారు. కాగా క్రైస్తవ విశ్వాసులు, యాత్రికులు పెద్ద సంఖ్యలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి చేరుకోవడంతో గుణదల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది.
అనంతపురంలో క్రిస్మస్ ప్రార్థనలకు హాజరైన భక్తులు
రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు మాట్లాడుతూ.. యేసుక్రీస్తు ఆచరించి చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. అలాగే అనంతపురం ఎస్ఐయూ చర్చిలో జరిగిన వేడుకల్లో శాసనమండలి విప్ వెన్నపూస గోపాల్రెడ్డి, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు.
గుణదల మేరీమాత ఆలయం వద్ద భక్తుల సందడి