వలంటీర్లపై రామోజీ విషపు రాతలు | Chelluboyina Srinivasa Venugopalakrishna Takes On Yellow Media | Sakshi
Sakshi News home page

వలంటీర్లపై రామోజీ విషపు రాతలు

Jan 19 2023 7:36 AM | Updated on Jan 19 2023 9:35 AM

Chelluboyina Srinivasa Venugopalakrishna Takes On Yellow Media - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: నిస్వార్థ సేవకులైన గ్రామ, వార్డు వలంటీర్లపై ఈనాడు రామోజీరావు విషపు రాతలు రాస్తున్నారని సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల దోపిడీ రామోజీ కళ్లకు కనిపించలేదా అని ప్రశ్నించారు. పింఛన్లు, ఇళ్ల మంజూరు హక్కును జన్మభూమి కమిటీలకు ఇచ్చారని, ఆ మేరకు జీవోలు కూడా జారీ చేశారని గుర్తు చేశారు. ‘అప్పట్లో  ప్రతి పథకానికీ రేటు పెట్టిమరీ వసూళ్లకు పాల్పడ్డారని, అవేమీ మీ కళ్లకు కనిపించలేదా రామోజీ. నిస్వార్థ సేవకులైన వలంటీర్లపై అంత అక్కసు ఎందుకు వెళ్లగక్కుతున్నారు’ అని ప్రశ్నించారు. చంద్రబాబును జాకీలతో ఎత్తేందుకు ఈనాడు, రామోజీ ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ ఆశ నెరవేరదని తేల్చి చెప్పారు.

వారిపై ఎందుకంత అక్కసు
‘ఈనాడులో వలంటీర్లపై విషం చిమ్ముతూ క«థనం రాశారు. వలంటీర్లు అంత నిస్వార్థంగా పని చేస్తుంటే.. రామోజీరావుకు ఎందుకంత అక్కసు. పెన్షన్‌ లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత జన్మభూమి కమిటీలకు అప్పగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌ 17న జీవో 135 జారీ చేస్తే రామోజీకి అది కనిపించలేదా. అది తప్పనిపించలేదా. హౌసింగ్‌ పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత కూడా జన్మభూమి కమిటీలకు ఇస్తూ జీవో 36 జారీ చేశారు. అవేవీ రామోజీరావుకు తప్పుగా కనిపించలేదు. ఆ కమిటీలు ఎంత అవినీతికి పాల్పడినా పట్టించుకోలేదు’ అని వేణు ధ్వజమెత్తారు. నిజం చెప్పాలంటే వలంటీర్లు నిరుపేదల పాలిట దేవుళ్ల మాదిరిగా ఉన్నారన్నారు.

డోర్‌ డెలివరీపై ఏనాడైనా రాశారా
ప్రతినెలా కచ్చితంగా 1వ తేదీన ఆదివారం అయినా.. సెలవు రోజైనా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను లబ్ధిదారుల చేతిలో పెడుతున్న విషయాన్ని మంత్రి వేణు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే.. ఒక్క రోజైనా రాశారా అని నిలదీశారు. అలాంటివి రాయరని, ఎందుకంటే రామోజీకి కావాల్సిన వ్యక్తి సీఎం పదవిలో లేరని ఎద్దేవా చేశారు. వలంటీర్లు జన్మభూమి కమిటీల మాదిరిగా అవినీతికి పాల్పడే వారు కాదని, కాబట్టి వలంటీర్లు ఎలా ఉండాలో తెలుగుదేశం పార్టీ వలంటీర్లయిన రామోజీ, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు చెప్పడం మానేస్తే మర్యాదగా ఉంటుందని హితవు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement