గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు
స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుగా నామకరణం
సాక్షి, అమరావతి: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల ముందుకు తెచ్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నీరుగార్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. సచివాలయం అనే పదాన్ని తొలగిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాన్ని ‘స్వర్ణ గ్రామ’గా, వార్డు సచివాలయాన్ని ‘స్వర్ణ వార్డు’గా మార్పు చేశారు. అదేవిధంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖను సైతం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖగా మార్చారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్ రూల్స్లో మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 2019 అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆ పరిధిలోని ప్రజలకు ప్రభుత్వ సేవలన్నింటినీ వారి ఇంటి వద్దనే అందించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేరును కొనసాగిస్తే వైఎస్ జగన్ గుర్తుకు వస్తారనే ఈర్ష్య తోనే చంద్రబాబు సర్కారు పేర్లను మార్చిందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.
చంద్రబాబు ప్రభుత్వం పేరు మార్చినప్పటికీ ప్రజలందరూ గ్రామ, వార్డు సచివాలయాలనే పిలుస్తారని, పేరు మార్చినంత సులభంగా ప్రజల మనసుల నుంచి ఆ ముద్రను తొలగించలేరని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారనేది రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేశాయి. చంద్రబాబు గత ప్రభుత్వం పెట్టిన పేర్లను రద్దు చేయడం లేదా మార్పు చేయడం తప్ప ఆ పథకాలను అమలు చేయడం లేదనే విషయం ప్రజలు గుర్తించారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.


