సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు తిరుగుతున్న విలాసవంతమైన ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోంది. ఇటీవల పొదుపు మాటలు చెప్పిన చంద్రబాబు.. ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చాలు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల్లోనే ప్రయాణిస్తున్నారు. జిల్లాల పర్యటనలకు, పక్క రాష్ట్రంలోని తన నివాసానికి, ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాలకు, చివరకు ఉండవల్లి నుంచి గన్నవరానికి కూడా ప్రత్యేక హెలికాప్టర్, విమానాలనే వినియోగిస్తున్నారు.
2026–27 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దె చెల్లింపుల కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.54.63 కోట్లు కేటాయించింది. ఇందులో నుంచి తొలి త్రైమాసికానికి రూ.19.12 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ) ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో చంద్రబాబు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.109.04 కోట్లు ఖర్చు చేసింది. 2024–25లో రూ.54.41 కోట్లు.. 2025–26లో రూ.54.63 కోట్ల వ్యయం చేసింది.


