
డ్రగ్స్ డోర్ డెలివరీతో యథేచ్ఛగా దందా
నగరాలు, పట్టణాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న ముఠాలు
యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్కు అడ్డాగా ఆంధ్రప్రదేశ్
వివిధ ప్రాంతాల డీలర్లకు ఏపీనే ప్రధాన మార్కెట్
విద్యాసంస్థలే టార్గెట్.. సమీపంలో యథేచ్ఛగా విక్రయాలు
విజయవాడలో పట్టుకున్నది గోరంతేనంటున్న పోలీస్ వర్గాలు
రాష్ట్రంలో ఎటుచూసినా ఏరులై పారుతున్న మద్యం
బెల్ట్ షాప్లతో ఇంటింటికీ మద్యం డెలివరీ
పైనుంచి కింది వరకు భారీగా చేతులు మారుతున్న లంచాలు
పేకాట క్లబ్బుల దందాతో భారీ దోపిడీ
కూటమి పార్టీల ఎమ్మెల్యేలదే ఈ దందా.. బలయ్యేది ప్రజలు
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులతో వేధింపులు
మరోవైపు అత్యాచారాలతో అట్టుడుకుతున్న రాష్ట్రం
అనంతపురం జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం
చంద్రబాబు ఏడాది పాలనలో 187 అత్యాచారాలు
హత్యాచారాలు 15.. హత్యలు 380.. అనుమానాస్పద మృతులు 16
ఇదీ రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగ మారణహోమం
ఇంటింటికి రేషన్ బియ్యం డోర్ డెలివరీ పథకాన్ని రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం డ్రగ్స్ డోర్ డెలివరీకి మాత్రం పచ్చజెండా ఊపుతోంది.మహిళల భద్రతకు ఉద్దేశించిన దిశ వ్యవస్థను నిర్వీర్యం చేసిన టీడీపీ కూటమి సర్కారు.. బాలికలపై జరుగుతున్న సామూహిక అత్యాచారాల పట్ల చోద్యం చూస్తోంది.కూటమి ఎమ్మెల్యేలతో ఊరూరా పేకాట క్లబ్బుల దందాకు తెరతీసిన బాబు ప్రభుత్వం... పోలీసులను అడ్డుపెట్టుకుని అమాయకులు ఆత్మహత్యకు పాల్పడేంత తీవ్రస్థాయిలో అక్రమ కేసులతో వేధిస్తోంది....గురువారం ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న మూడు సంఘటనలు రాష్ట్రంలో దారుణంగా దిగజారుతున్న పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయి. రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తోందని స్పష్టం చేశాయి. డ్రగ్స్ మాఫియా కరాళ నృత్యం చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తోందని తేల్చిచెప్పాయి. బాలికలపై అత్యాచారాలకు తెగబడుతున్న అరాచక మూకకు ప్రభుత్వమే కొమ్ముకాస్తోందన్న కఠిన నిజాన్ని వెలుగులోకి తెచ్చాయి. పేకాట క్లబ్బుల దందాతో ఎందరో జీవితాలను రోడ్డు పాల్జేస్తోందని నిర్ధారించాయి. అరాచక, అసాంఘిక కార్యక్రమాలతో యావత్ రాష్ట్రం బెంబేలెత్తుతోందని కుండబద్దలు కొట్టాయి.
సాక్షి, అమరావతి; ఏడాది క్రితం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. ఏకంగా కొరియర్ సర్వీసులతో డోర్ డెలివరీ చేసేంతగా దందా వేళ్లూనుకుంటోంది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్కు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డ్రగ్ డీలర్లు ఏడాదిగా ఆంధ్రప్రదేశ్నే ప్రధాన మార్కెట్గా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఢిల్లీ నుంచి నూజివీడు మీదుగా విజయవాడ తరలిస్తున్న డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో రాష్ట్రంలో వేళ్లూనుకున్న మత్తు నెట్వర్క్ తీవ్రత వెలుగుచూసింది. విజయవాడలో పట్టుకున్నది గోరంతేనని.. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న డ్రగ్స్ దందా కొండంత అని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. దేశంలో ప్రధాన నగరాలే కేంద్రంగా విస్తరించిన డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోని ఊరూరా విస్తరిస్తోంది.
ఢిల్లీ, ముంబై, అమృత్సర్ తదితర నగరాల్లోని మాఫియా అప్ఘానిస్థాన్ తదితర దేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న డ్రగ్స్ను మార్కెట్ చేయడానికి ఏపీనే గమ్యస్థానంగా ఎంచుకున్నాయి. వివిధ రూపాల్లోని ఎండీఎంఏ డ్రగ్స్ను రాష్ట్రంలోకి యథేచ్ఛగా తరలిస్తున్నారు.
అందుకోసం విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ వంటి ప్రధాన నగరాలతో పాటు నూజివీడు, జగ్గయ్యపేట, భీమవరం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, హిందూపురం, నంద్యాల వంటి దాదాపు 50 పట్టణాల్లో ఏజెంట్ల వ్యవస్థను డ్రగ్స్ ముఠా ఏర్పాటు చేసుకుంది.
ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి స్థానిక ఏజెంట్లకు డ్రగ్స్ను సరఫరా అవుతున్నాయి. ఇందుకోసం కొరియర్ సర్వీసులను వాడుకుంటున్నాయి. ఏజెంట్లు అందుకున్న డ్రగ్స్ను చిన్నచిన్న ప్యాకెట్లుగా వెండార్స్ (విక్రేతలు)కు అందిస్తున్నారు. ఆ వెండార్స్ గట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ యువతను మత్తులో ముంచుతున్నారు.
విద్యాసంస్థలే టార్గెట్
డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోని విద్యాసంస్థలను తమ దందాకు కేంద్రంగా చేసుకుంది. వెండార్స్ విద్యాసంస్థల ప్రాంగణాల సమీపంలోనే విక్రయిస్తున్నారు. జూనియర్ కాలేజీల నుంచి ఇంజినీరింగ్, మెడికల్, ఇతర వృత్తి విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలను లక్ష్యంగా చేసుకున్నారు. ఉన్నత విద్యాసంస్థల సమీపంలోనే బడ్డీలు, స్ట్రీట్ వెండార్స్ రూపంలో డ్రగ్స్, గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు.
సిగరెట్లు, చాక్లెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో విక్రయిసు్తన్నారు. విజయవాడలోని ఉన్నత విద్యాసంస్థల ప్రాంగణాల సమీపంలో విక్రయించేందుకు ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసు ద్వారా నూజివీడు మీదుగా డ్రగ్స్ తరలించడమే అందుకు తాజా తార్కాణం.
డ్రగ్స్పై చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కారు
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదు. డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ చేపట్టలేదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ను రెండు దశల్లో సమర్థంగా అమలు చేసింది.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసి పటిష్ఠ కార్యాచరణ చేపట్టింది. ఏపీ–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా నడుస్తున్న గంజాయి సాగును కూకటివేళ్లతో పెకలించింది. ఏకంగా 11,500 ఎకరాల్లో పంటను ధ్వంసం చేసింది. గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది.
ఇందుకు రూ.500 కోట్లతో ప్రత్యేక పథకాన్ని తెచ్చింది. ఇక విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి డ్రగ్స్ అక్రమ రవాణాను సమర్థంగా కట్టడి చేసింది. సెబ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలతో అక్రమ రవాణాను అడ్డుకుంది.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి కేసులు
కూటమి రాకతో..
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసు వ్యవస్థ డ్రగ్స్పై పట్టు వదిలేసింది. సర్కారు కక్షపూరితంగా సెబ్ను రద్దు చేసింది. కొత్తగా ఈగల్ వ్యవస్థను తెచ్చామని చెప్పినప్పటికీ దానికి కనీసం మౌలిక వసతులు సమకూర్చలేదు. విస్తృత అధికారాలు కల్పించలేదు. ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా డ్రగ్స్ దందాకు టీడీపీ సీనియర్ నేత కుటుంబం అండదండలు ఉండడంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉదాసీనంగా ఉంటోందన్న విషయం స్పష్టమైంది. అందుకనే పోలీసు శాఖ కూడా డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతున్నా చోద్యం చూస్తోంది.
రాష్ట్రంలో ఏరులై పారుతున్నమద్యం
ఇంటింటికీ డెలివరీ చేస్తున్న బెల్ట్ షాప్లు
పోలీసులే దగ్గరుండి అమ్మిస్తున్న వైనం
పైనుంచి కిందివరకు చేతులు మారుతున్న లంచాలు
కూటమి ప్రభుత్వం పాలనలో డ్రగ్స్ దందాకు తోడు మద్యం ఏరులై పారుతోంది. వసూ్తనే ప్రైవేటు మద్యం దుకాణాల వ్యవస్థను మళ్లీ తెచ్చిన చంద్రబాబు సర్కారు.. పోలీసులను పెట్టించి మరీ దగ్గరుండి అమ్మకాలు సాగిస్తోంది. బార్లకు తోడు పర్మిట్ రూమ్లనూ ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు బెల్టు షాపులకు పచ్చజెండా ఊపింది. దీంతో ఒక్కో ఊరిలో రెండు, మూడు బెల్టుషాపులు వెలిశాయి.
ఇంటింటికీ మద్యం డెలివరీ చేస్తున్నాయి. ఇక మద్యం మత్తులో జరుగుతున్న నేరాలు–ఘోరాలకు అంతే ఉండడం లేదు. మద్యం తాగేందుకు డబ్బులు కావాలంటూ అయినవారిపైనే దాడులకు దిగుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. కాగా, మద్యం దందాలో పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు భారీఎత్తున లంచాలు చేతులు మారుతున్నాయి.
అత్యాచారాలతో అట్టుడుకుతున్న రాష్ట్రం
మహిళలు, బాలికలపై వరుసగా అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో అత్యాచారాలు, హత్యాచారాల గణాంకాలు చూస్తే భయాందోళనలు కలుగుతున్నాయి. చంబల్ లోయను తలపిస్తున్న రీతిలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు తెగబడుతుండడంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ముక్కుపచ్చలారని బాలికలు, విద్యార్థినులకూ భద్రత కరువు
చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో అత్యాచార పర్వం యథేచ్ఛగా సాగుతోంది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతి, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురం, మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి, హోం మంత్రి అనిత నియోజకవర్గం పాయకారావుపేట... ఇలా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి.
ముక్కుపచ్చలారని బాలికలు, విద్యార్థినులకు ఏమాత్రం భద్రత లేకపోవడం తల్లిదండ్రులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ దారుణపర్వంలో మరో దుర్ఘటన అనంతపురం జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత ప్రాంతం రామగిరి మండలం పేరూరు పంచాయతీ ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై 13 మంది యువకులు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం బయటకు పొక్కింది. నిందితులు అందరూ టీడీపీ కార్యకర్తలే కావడంతో అధికార పార్టీ నేతలు వారికి అండగా నిలుస్తున్నారు. ఇది ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
బెజవాడలో డ్రగ్స్ రాకెట్
పటమట (విజయవాడ తూర్పు): డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురు యువకులను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ కమిషనరేట్ డీసీపీ కేజీవీ సరిత గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని రామవరప్పాడు రింగ్ వద్ద ఈ నెల 4న వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు యువకులు రెండు స్కూటర్లపై అనుమానాస్పదంగా కనిపించారు.
వారు ప్రయాణిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్, మరో ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేశారు. ఆ వాహనాల డిక్కీల్లో ఉన్న తెలుపు రంగు క్రిస్టల్ ఎండీఎంఏ (మిథలిన్ డయాక్సి మిథపేటావిున్) డ్రగ్ రెండు ప్యాకెట్లు, ఊదా రంగు క్రిస్టల్ ఎండీఎంఏ డ్రగ్ ఒక ప్యాకెట్, ఎరుపు రంగు ఎండీఎంఏ డ్రగ్ ఒక ప్యాకెట్ లభించాయి.
సుమారు 33 గ్రాములు గల ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని అంచనా. వీటిని తీసుకొస్తున్న కృష్ణా జిల్లా పెనమలూరు మండలం సనత్నగర్ రామాలయం వీధికి చెందిన తిరుమలశెట్టి జీవన్కుమార్ (29), పటమట ఫన్టైం క్లబ్ రోడ్డులో నివాసం ఉండే బొంతు నితీష్కుమార్ (28), కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు ఇందిరానగర్–1కు చెందిన తులిమిల్లి తరుణ్ప్రసాద్(20)ను అరెస్ట్ చేశారు.
ఢిల్లీ నుంచి నూజివీడుకు..
ప్రమాదకరమైన ఈ డ్రగ్స్ను ఢిల్లీకి చెందిన రింకు అనే వ్యక్తి ట్రాక్ఆన్, డీటీడీసీ కొరియర్ ద్వారా నూజివీడులో ఉండే మనోహర్కు సరఫరా చేశారని డీసీపీ చెప్పారు. అక్కడి నుంచి ముగ్గురు నిందితులు విజయవాడకు తరలిస్తుండగా.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. నిందితులు జీవన్కుమార్, మనోహర్ ఇంటర్ క్లాస్మేట్స్. వీరికి యూపీలో ఉంటున్న మనోహర్కుమార్ మేనమామ ద్వారా ఢిల్లీకి చెందిన రింకూ పరిచయమయ్యారని డీసీపీ వివరించారు.
విజయవాడ సరఫరా అయిన డ్రగ్స్ను నగర శివారులోని ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు సరఫరా చేస్తారని చెప్పారు. ఈ రాకెట్లో ఢిల్లీకి చెందిన రింకూ, నూజివీడుకు చెందిన మనోహర్కుమార్, యూపీలో ఉండే మనోహర్ మేనమామ కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. నిందితుల నుంచి 2 స్కూటర్లు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పటమట సీఐ పవన్కిషోర్, ఎస్సై దుర్గాదేవీలను డీసీపీ అభినందించారు. డీసీపీ వెంట ఏసీపీ దామోదర్ ఉన్నారు.
ఉసురు తీస్తున్న రెడ్బుక్ వేధింపులు
పేకాట దందా కూటమి ఎమ్మెల్యేలది.. బలయ్యేది ప్రజలు
ఆత్మహత్య చేసుకునేంతగా తీవ్ర స్థాయి వేధింపులు
చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమాయకుల ప్రాణాలు బలిగొంటోంది. ప్రభుత్వ పెద్దల కుట్రలకు వత్తాసు పలుకుతూ పోలీసులు అధికారిక గూండాల మాదిరిగా బరితెగిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దంపలగట్టుకు చెందిన రెడ్యం శివలక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకునేలా అక్రమ కేసులతో వేధించడం దీనికి నిదర్శనం. దీంతో మనస్తాపం చెందిన ఆయన గురువారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లి పుప్పగిరిదారిలో ఉన్న సబ్స్టేషన్ మెయిన్ వైరు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అసలు విషయం ఏమిటంటే... రాష్ట్రంలో పేకాట క్లబ్బులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిషేధించింది. కానీ, పేకాట మాఫియాకు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ప్రాణం పోసింది. గత ఏడాది టీడీపీ ప్రభుత్వం రాగానే పేకాట క్లబ్బులకు అనుమతులిచ్చింది. కూటమి ఎమ్మెల్యేలే స్వయంగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా జూదరులు వచ్చి పేకాడేలా అతిపెద్ద కాసినోలు నడుపుతుండడం గమనార్హం.
రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలు, నగరాలు, ప్రధాన పట్టణాల్లో ఎంపిక చేసిన అపార్టుమెంట్లు, రిసార్టులు, లాడ్జిలు, మూసివేసిన సినిమా థియేటర్లు... ఇలా అన్నీ కూడా పేకాట క్లబ్బులుగా మారిపోయాయి. పోలీసులకు మామూళ్లు ముట్టజెబుతూ కూటమి ఎమ్మెల్యేలు భారీగా కమీషన్లు తీసుకుంటూ రోజుకు రూ.వందల కోట్లలో పేకాట దందా సాగిస్తున్నారు. కానీ, అసలు పేకాటతో నిమిత్తం లేని అమాయకులను ఇరికించి.. ఆత్మహత్యకు పాల్పడేలా అక్రమ కేసులతో పోలీసులు వేధిస్తున్నారు. ఇదీ చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగం.