భానుకోటలో అరెస్టు చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను ధర్మవరం కోర్టుకు తరలిస్తున్న పోలీసులు
ఆరాధ్యనేత పుట్టిన రోజు చేశారని కేసులు, అరెస్టులు
అధికార కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు
అన్నదానంలో మాంసం పెట్టారని జీవహింస కింద కేసు నమోదు
సాక్షి, నెట్వర్క్: చంద్రబాబు సర్కారు మరోమారు తన అల్పబుద్ధిని చాటుకుంది. వైఎస్సార్సీపీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును వేడుకగా చేశారనే అక్కసు, అసూయతో అక్రమ కేసులు పెట్టింది. అడ్డగోలుగా అరెస్టులకు తెగబడింది. పోలీసులను పావులుగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా అరాచకం సృష్టించింది.
⇒ శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోటలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారు. ఆదివారం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించడాన్ని ఓర్వలేని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, మండల నాయకులు.. జగన్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు హుకుం జారీ చేయడంతో 12 మందిపై కేసులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు గంగుల సు«దీర్రెడ్డి, మామిళ్లపల్లి అమరనాథరెడ్డిపైనా అక్రమ కేసులు బనాయించారు. వీరిలో ఏడుగురిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
⇒ ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసరలో వైఎస్ జగన్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించడాన్ని ఓర్వలేని టీడీపీ నేతలు పోలీసులను రెచ్చగొట్టి తమ పార్టీ ఫ్లెక్సీని వైఎస్సార్సీపీ కార్యకర్తలు చింపి వేశారనే నెపంతో కర్ల ఆనందరాÐవుపై కేసు నమోదు చేయించారు. ఉప సర్పంచి చలమల ప్రభాకర్, వార్డు సభ్యుడు అచ్చారావునీ అదుపులోకి తీసుకుని తెల్లవార్లూ స్టేషన్లోనే ఉంచారు.
⇒ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రభుత్వాస్పత్రిలో వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడంతో పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు.
⇒ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు జరిపినందుకు పోలీసులు వైఎస్సార్సీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. స్టేషన్కు పిలిచి బెదిరించారు. వీర్నమలకు చెందిన 16 మందిపై కేసులు నమోదు చేశారు. అన్నదానంలో మాంసాహారం వడ్డించారని, ఇందుకోసం జీవహింసకు పాల్పడ్డారని కేసు నమోదు చేయడం గమనార్హం.
⇒ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బొమ్మగానిపల్లిలో పోలీసులు అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బొమ్మగానిపల్లి సర్పంచ్ పాటిల్ ఆదినారాయణరెడ్డితో పాటు రంగస్వామి, దొనతిమ్మ, నాగార్జున, ప్రసాద్ శీనులను అక్రమంగా అరెస్టు చేశారు. స్టేషన్కు తరలించే సమయంలో మార్గంమధ్యలో పోలీసులు వాహనాలు ఆపి సర్పంచ్ ఆదినారాయణరెడ్డిపై చేయిచేసుకోవడంతోపాటు, వైఎస్సార్సీపీ నాయకులనూ తీవ్రంగా కొట్టారు. వీరికోసం సోమవారం పోలీస్ స్టేషన్కు వచ్చిన పలువురు ప్రజాప్రతినిధులపైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వంద మందికి పైగా స్పెషల్ ఫోర్స్ పోలీసులను రంగంలోకి దింపి పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్సార్సీపీ నేతలు లేకుండా చెదరగొట్టారు.


