బకాయిల మోత.. విద్యార్థులకు వాత | Chandrababu Coalition govt Neglected fee reimbursement to Students | Sakshi
Sakshi News home page

బకాయిల మోత.. విద్యార్థులకు వాత

Jun 16 2025 4:57 AM | Updated on Jun 16 2025 12:32 PM

Chandrababu Coalition govt Neglected fee reimbursement to Students

పేదింటి బిడ్డల ఉన్నత చదువులకు కూటమి సర్కారు గండి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులో తీవ్ర నిర్లక్ష్యం

తీవ్ర ఆందోళనలో కళాశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు

కొండలా పేరుకుపోయిన బకాయిలతో విద్యారంగంలో కల్లోలం.. కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు చేతికందక విద్యార్థులు సతమతం

ఆరు త్రైమాసికాల ఫీజు బకాయిలు రూ. 4,200 కోట్లు.. హాస్టల్‌ మెయింటెనెన్స్‌ చార్జీలు రూ. 2,200 కోట్లు.. మొత్తంగా సుమారు రూ.6,400 కోట్లు చెల్లించని చంద్రబాబు ప్రభుత్వం 

షెడ్యూల్‌ ప్రకారం చెల్లింపులకు మంగళం.. వసతి దీవెన ఎత్తివేతకు కుట్ర

ఫలితంగా నాణ్యమైన విద్యా బోధన కరువు 

ఓపిక నశించి పోరుకు సిద్ధమైన ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు 

న్యాయస్థానంలో తేల్చుకుంటామని హెచ్చరిక 

ఏటా రూ.3,900 కోట్లకుగాను బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు

ఉన్నత చదువుల కోసం, ఆరోగ్యం కోసం పేదలు అప్పులపాలు కాకూడదనే గత ప్రభుత్వ స్ఫూర్తికి కూటమి సర్కారు గండికొట్టింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో ఇటు విద్యార్థులు–తల్లిదండ్రులతో పాటు అటు కళాశాలల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. నాణ్యమైన విద్య మిథ్యగా మారిపోయింది. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన విద్యా రంగ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. విద్యార్థులతో పాటు కళాశాలల యాజమాన్యాల దుస్థితి దినదిన గండంగా తయారైంది. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’ బకాయిలు కొండలా పేరుకు పోవడంతో కళాశాలల మనుగడ, విద్యార్థుల భవిష్యత్తు పెను ప్రమాదంలో పడింది. ప్రభుత్వం సకాలంలో ‘ఫీజు’ చెల్లింపులు చేయక పోవడం యావత్‌ కళాశాలల ఉనికికే ప్రశ్నార్థకమైంది. 

రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో దాదాపు రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ.2,200 కోట్లు హాస్టల్‌ మెయింటెనెన్స్‌ చార్జీలు (వసతి దీవెన).. మొత్తంగా రూ.6,400 కోట్లు పెండింగ్‌ పెట్టింది. వాస్తవానికి అధిక శాతం కళాశాలలు విద్యార్థుల ఫీజులపైనే ఆధారపడి నిర్వహణను చేపట్టడంతో తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాయి. అధ్యాపకులకు, బోధ­నేతర సిబ్బందికి జీతాలు చెల్లించలేక కొట్టుమిట్టాడు­తున్నాయి. 

ఈ పరిణామాల ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన బోధన లభించడం లేదు. అధునాతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా కళాశాలలు అప్‌గ్రేడ్‌ అవలేక మూస పద్ధతిలోనే కొనసాగడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కళాశాల యాజమా­న్యాలు ఉన్నప్పుడు నైపుణ్యం కలిగిన సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. 

అరకొర సిబ్బందితో బోధనను సాగించాల్సిన దయ­నీయ పరిస్థితి నెలకొనడంతో విద్యార్థులకు కోలుకో­లేని నష్టం కలుగుతోంది. విద్యార్థులకు హాస్టల్‌ మెయింటెనెన్స్‌ కింద అందించే మొత్తాన్ని కూడా నిలిపి వేయడంతో పేదింటి బిడ్డలకు ఉన్నత విద్య భారంగా మారింది. గతంలో వసతి దీవెన కింద ఈ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేసినప్పుడు కళాశాలల హాస్టల్‌లో విద్యార్థులు సకాలంలో చెల్లింపులు చేసేవారు. ఆ విధంగానూ కళాశాలలు ఆర్థికంగా బలంగా ఉండేవి. 


ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం 
ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యను భ్రష్టు పట్టించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవస్థను తీవ్రంగా నాశనం చేసింది. విద్యార్థులు హాయిగా కళాశాలలకు వెళ్లి చదువుకునే వాతావర­ణాన్ని దెబ్బ తీసింది. ప్రైవేటు కళాశాలల యాజమా­న్యాలకు సైతం కంటిమీద కునుకు లేకుండా  ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసింది. 

విద్యా సంవత్సరం ముగిసినా ఇప్పటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులు చేయక పోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నిసార్లు ప్రభు­త్వా­నికి, అధికారులకు విజ్ఞప్తులు చేసినా ఫలితం శూన్యమేనని మండి పడుతున్నాయి. 



ప్రభుత్వం స్పం­దించి వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయని పక్షంలో ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవు­తున్నాయి. త్వరలో కోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ పూర్తిగా దిగజారిన విద్యా రంగ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 


వాస్తవానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రైవేటు కళాశాలల మనుగడను దృష్టిలో పెట్టుకుని ‘క్వార్టర్‌’ (మూడు నెలలు) ప్రాతిప­దికన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదలయ్యేలా షెడ్యూల్‌ను అమలు చేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా చెల్లింపులు చేయడంతో పారదర్శ­కతతో పాటు యాజమాన్యాల నుంచి జవాబుదారీ తనాన్ని ప్రోత్సహించింది. 

కానీ, కూటమి ప్రభుత్వం క్వార్టర్‌ను కాస్తా.. ఆరు నెలలకు ఒకసారికి మార్చింది. తల్లుల ఖాతాల్లోకి బదులు కళాశాలలకు నేరుగా ఫీజులు చెల్లిస్తామని చెప్పింది. కానీ, విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ ఫీజులు చెల్లించక పోవడంతో ప్రైవేటు కళాశాలల నిర్వహణ దెబ్బతిని ఉన్నత విద్య ప్రమాదంలో పడుతోంది.

గాడి తప్పిన షెడ్యూల్‌ 
పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేసిన చరిత్ర దేశంలో వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది. అంతకు ముందు వరకు ప్రభుత్వం నుంచి అరకొర చెల్లింపులు ఉండటంతో పేదింటి బిడ్డలు ఉన్నత చదువుల కోసం తీవ్ర అవస్థలు పడ్డారు. కానీ, 2019 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 

ఐదేళ్లు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిన చదువులు ఏడాదిగా కుదుపులకు గురవుతున్నాయి. విద్యార్థుల చదువు­లను బాధ్యతగా తీసుకోవాల్సిన కూటమి ప్రభుత్వం రాజకీయ ధోరణితో అంధకారంలోకి నెడుతోంది. 2024 మార్చి వరకు షెడ్యూల్‌ ప్రకారం వైఎస్సార్‌­సీపీ ప్రభుత్వ హయాంలో నిధులు విడుదల­య్యాయి. 


ఆ వెంటనే ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో విద్యార్థులకు క్రమం తప్పకుండా చెల్లించే ఫీజులను కూటమి నాయకులు కుట్రలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా ఫీజుల చెల్లింపుల షెడ్యూల్‌ విధానాన్ని నాశనం చేసింది. 

ఈ క్రమంలో 2024 ఏప్రిల్‌ నుంచి ఇప్పటిదాక మొత్తంగా ఆరు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు, ఏప్రిల్‌–మేలో ఇవ్వాల్సిన వసతి దీవెన (హాస్టల్‌ మెయింటెనెన్స్‌ చార్జీలు) నిధులను విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. ఈ ఏడాదీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా లక్షలాది మంది పేదింటి విద్యార్థుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. అప్పులు చేసి సర్టిఫికెట్లు, పరీక్షలకు హాల్‌ టికెట్లు తీసుకుంటున్న దుస్థితి కనిపిస్తోంది.

రూ.6,400 కోట్ల బకాయిలు 
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్‌ మెయింటెనెన్స్‌ చార్జీల చెల్లింపుల కింద కూటమి ప్రభుత్వం సుమారు రూ.6,400 కోట్లు బకాయిలు పెట్టింది. ఇందులో విద్యార్థుల హాస్టల్‌ ఖర్చుల కింద రూ.2,200 కోట్ల చెల్లింపులకు మంగళం పాడేసింది. అసలు ఎక్కడా ఆ ఊసే ఎత్తడం లేదు.  కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అడపాదడపా మాట్లాడుతూ.. సకాలంలో చెల్లింపులు చేసేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటోంది. కానీ, ఇప్పటికీ రూ.4,200 కోట్ల వరకు బకాయిలు కనిపిస్తున్నాయి. 

ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలనను మొదటి నుంచి ప్రారంభిస్తామంటే చట్టాలు, రాజ్యాంగం అంగీకరించవు. అందుకే ఏ ప్రభుత్వమైనా తప్పనిసరిగా కొనసాగించాల్సిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే 2014–19లో టీడీపీ హయాంలో16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.1,778 కోట్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తక్షణ బాధ్యతగా భావించి చెల్లింపులు చేసింది.  


బడ్జెట్‌లోనూ విద్యకు లోటే 
ఒక విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,800 కోట్లు, హాస్టల్‌ మెయింటెనెన్స్‌ ఖర్చుల కింద రూ.1,100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు వెచ్చించాలి. కానీ, 2024–25కు నిధులు ఏమీ విదల్చక పోగా, 2025–26 విద్యా సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.3,900 కోట్లు కేటాయించాల్సి ఉంటే కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేసింది. 

విద్యార్థుల భవిష్యత్తుకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసింది. టీడీపీ ప్రభుత్వ బకాయి­లతో కలిపితే మొత్తం రూ.18,663.44 కోట్లు ఉన్నత విద్య కింద ఉచిత చదువులకు ఖర్చు పెట్టింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement