
2024లో చంద్రబాబు నుంచి తంబళ్లపల్లె టీడీపీ అభ్యరి్థగా బి–ఫాం తీసుకుంటున్న జయచంద్రారెడ్డితో నిందితుడు జనార్దన్రావు
నకిలీ మద్యం రాకెట్ వ్యవహారంలో సర్కారు కనికట్టు
చిన్న చిన్న వారిపై కేసులు.. తూతూ మంత్రంగా రిమాండ్ రిపోర్ట్
లేబుళ్లు తెచ్చారంటూ.. మూతలు సరఫరా చేశారంటూ నిందితులుగా చేర్చిన వైనం..
కనిపించని సూత్రధారులు, పాత్రధారులు
ఇదో చిన్న వ్యవహారం అనేలా షో చేసి కీలక నేతలను తప్పించే పన్నాగం
అంతా ప్రభుత్వ పెద్దల దిశా నిర్దేశం మేరకే..
నకిలీ మద్యం తయారీ, సరఫరా అంతా తామేనన్న ఏ2 అద్దేపల్లి.. దాన్నే ప్రజలకు విక్రయించామని, భారీ లాభాలొచ్చాయని ఒప్పుకోలు
అందుకే దందాను విజయవాడ వరకు విస్తరించామని వెల్లడి.. బార్లు, వైన్ షాపులు,
బెల్ట్షాపులకు భారీగా అమ్మినట్లు అంగీకారం
12 మంది నిందితుల్లో ముగ్గురిని కోర్టులో హాజరు పరిచిన అధికారులు
నకిలీ మద్యం తయారీ రాకెట్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం పక్కా పథకం రచించింది. వేల కోట్ల రూపాయల దందాకు తెరలేపడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఏమాత్రం లేదనేలా వ్యవహారాన్ని రక్తి కట్టిస్తోంది. నకిలీ మద్యం తయారీ యంత్రాలు, స్పిరిట్, రసాయనాలు, వివిధ బ్రాండ్లను పోలిన లేబుల్స్, వేలాది లీటర్ల నకిలీ మద్యం.. వేల సంఖ్యలో సీసాలు, మూతలు పట్టుబడితే ఇదేదో చిన్న వ్యవహారం అనేలా చిన్న చిన్న వారిపై కేసులు పెట్టి చేతులు దులుపుకోజూస్తోంది. లేబుళ్లు సరఫరా చేశారని, సీసాల మూతలు సరఫరా చేశారని.. ఈ కేసులో ఇదే పెద్ద నేరం అన్నట్లు కలరింగ్ ఇస్తోంది. తూతూ మంత్రంగా కేసు నమోదు చేయడం ద్వారా సూత్రధారులు, పాత్రధారులను తప్పించేలా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ఇలా చేస్తోందని చెప్పడానికి నిందితుల రిమాండ్ రిపోర్టే నిదర్శనం.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నకిలీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకాల కేసులో కీలక సూత్రధారులు, పాత్రధారులను తప్పించి కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టిన టీడీపీ నేతలు భారీగా లాభాలు వస్తుండటంతో ప్రభుత్వ పెద్దల అండతో విజయవాడలోని ఇబ్రహీంపట్నాన్ని మరో అడ్డాగా మార్చారు. నకిలీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకాల ద్వారా సులభంగా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుండటంతో దానిపై కన్నేసిన కూటమి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు.. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ మద్యం దందా సాగించారు. ఈ దందా ద్వారా కమీషన్ల రూపంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఇందులో అత్యధిక భాగం డబ్బు కరకట్ట బంగ్లాకే చేరిందన్నది బహిరంగ రహస్యం.
ఇప్పుడు ఈ నకిలీ మద్యం వ్యవహారాన్ని తక్కువ చేసి చూపేందుకు ప్రభుత్వ పెద్దలు ఎక్సైజ్ అధికారులకు దశా, దిశా నిర్దేశం చేశారు. పెద్ద తలకాయల ప్రస్తావన ఏదీ లేకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని కిందిస్థాయి నేతలపై నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. తాజాగా విజయవాడ కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. నకిలీ మద్యం తయారీ వెనుక అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలకు సన్నిహితులైన అద్దేపల్లి జనార్దనరావు, ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహనరావులను ప్రధాన నిందితులుగా చేర్చిన ఎక్సైజ్ అధికారులు.. మొత్తం కథను వీరి చుట్టూనే తిప్పారు. ఇందులో ఎక్కడా ఈ మొత్తం నకిలీ మద్యం తయారీ వెనుక ఉన్న సూత్రధారులు, ప్రధాన పాత్రధారుల గురించి కనీస స్థాయిలో కూడా ప్రస్తావించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఎక్సైజ్ అధికారులు తమ రిమాండ్ రిపోర్ట్లో మొత్తం 12 మందిని నిందితులుగా చేర్చారు. ఈ 12 మందిలో అద్దేపల్లి జగన్మోహనరావు (ఏ2), బాదల్ దాస్ (ఏ7) ప్రదీప్ దాస్ (ఏ8)లను మంగళవారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరు పరచగా రిమాండ్కు పంపారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో పలు విషయాలను పొందు పరిచారు. నకిలీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకాల వ్యవహారంలో అద్దేపల్లి జనార్దనరావు (ఏ1), ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహనరావు (ఏ2)లు ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిపారు. టీడీపీ పెద్దలకు సన్నిహితుడైన తన సోదరుడు జనార్దనరావుతో కలిసి నకిలీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నట్లు జగన్మోహనరావు అంగీకరించినట్లు పేర్కొన్నారు. నకిలీ మద్యం అమ్మకాల ద్వారా భారీగా లాభాలు వస్తుండటంతో ఆ దందాను విస్తరించినట్లు జగన్మోహనరావు చెప్పినట్లు రిపోర్ట్లో వివరించారు.
అక్కడి నుంచి ఇక్కడికి..
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజల ప్రాణాలను పట్టించుకోకుండా మద్యం విక్రయాలకు తెర లేపింది. దీన్నే అదునుగా భావించిన అద్దేపల్లి జనార్దనరావు, జగన్మోహనరావు ప్రభుత్వ పెద్దల అండ, సలహాలు, సూచనలతో నకిలీ మద్యం తయారీని మొదలు పెట్టారు. మొదట మొలకలచెరువు ప్రాంతంలో నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టి అమ్ముతూ వచ్చారు. దీని ద్వారా వారు భారీగా డబ్బు ఆర్జించారు. ఇందులో పెద్ద మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలకు కమీషన్ల రూపంలో ఇచ్చారు. వారి ప్రోత్సాహంతో ఈ నకిలీ మద్యం తయారీని భారీగా విస్తరించారు. మొలకలచెరువు తరహాలో ఇబ్రహీంపట్నంలో డెన్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే విజయవాడతో పాటు వివిధ వైన్ షాపులు, బార్లు, బెల్ట్షాపులకు సరఫరా చేసి, అమ్మకాలు జరిపారు.
బెంగళూరుకు చెందిన బాలాజీ (ఏ3) ఫేక్ సీల్లు, స్పిరిట్, కారమిల్, ఇతర పదార్థాలు కలిపి మద్యం తయారీ చేయడంలో ప్రధాన భూమిక పోషించారు. హైదరాబాద్కు చెందిన రవి (ఏ4) ఫేక్ లేబుల్స్ సరఫరా చేశారు. ఆరుగురు కూలీలు సయ్యద్ మాజి, కట్టారాజు, బాదల్ దాస్, ప్రదీప్ దాస్లు, మిధిన్ దాస్, అనంత దాస్ ఈ నకిలీ మద్యం తయారీలో ఉన్నారు. వీరికి అధిక జీతాలు ఇస్తామని ఆశ చూపి, నకిలీ మద్యం తయారీలో వారిని వాడుకున్నారు. ఖాళీ పెట్ బాటిల్స్ను గన్నవరం మండలం సూరంపల్లెలో తయారు చేయించారు. దాని యజమాని శ్రీనివాసులరెడ్డిని ఏ11 నిందితునిగా, విజయవాడలోని శ్రీనివాస వైన్స్లో పనిచేసే అంగలూరి కళ్యాణ్ను ఏ12 నిందితునిగా చేర్చారు.
కళ్యాణ్ ద్వారా నకిలీ మద్యాన్ని పెద్ద మొత్తంలో అమ్మినట్లు అధికారులు గుర్తించారు. అచ్చం ఒరిజనల్ బాటిల్స్ మాదిరి తయారు చేసి, అలాగే స్టిక్కర్లు అతికించి ఎలాంటి అనుమానం రాకుండా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మారు. ప్రధానంగా ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ, క్లాసిక్ బ్లూ విస్కీ, కేరళ మాల్ట్ విస్కీ, మంజీరా విస్కీ.. బ్రాండ్లకు నకిలీ తయారు చేశారు. ఏకంగా విజయవాడలోనే పెద్ద డెన్ను ఏర్పాటు చేసి ధైర్యంగా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మారంటే ఇందుకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.
ఎన్నికల తర్వాత నుంచి నకిలీ మద్యం జోరు
2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత గోవా మద్యం పేరుతో పలువురు అధికార పార్టీ నేతలు ఈ నకిలీ మద్యం దందాకు తెర లేపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అద్దేపల్లి జనార్దనరావు పలు చోట్ల మద్యం సిండికేట్లో భాగస్వామిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లోని బ్రాందీ షాపులు, బార్లు, బెల్ట్ షాపులకు నకిలీ మద్యం సరఫరా జరిగినట్లు తేలడంతో మద్యం ప్రియుల్లో ఆందోళన మొదలైంది. అయితే నకిలీ మద్యం తయారీ విషయం ప్రజల్లోకి వెళ్లటంతో, ప్రభుత్వం దాని తీవ్రతను తక్కువ చేసి చూపించేందుకు నానా తంటాలు పడుతోంది.
నామ మాత్రపు కేసులు పెట్టి ఈ నకిలీ మద్యం కేసు నుంచి టీడీపీ నాయకులను రక్షించేందుకు పడరాని పాట్లు పడుతోంది. ఇప్పటికే నకిలీ మద్యం తాగి పలుచోట్ల అనారోగ్యం పాలైన మందుబాబులు అందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని ఊదరగొట్టి, నకిలీ మద్యంతో ఆరోగ్యాలతో చెలగాటం అడుకోవటం సరికాదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.