
ఉత్తరప్రదేశ్లో అత్యధికం..రెండోస్థానంలో బిహార్
కేరళ ఆదర్శం ..ఒక్క కేసుకే పరిమితం
వైద్య కళాశాలల్లో నమోదైన ర్యాగింగ్ ఫిర్యాదుల గణాంకాలను వెల్లడించిన కేంద్రం
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా వైద్యకళాశాలల్లో గతేడాది నమోదైన ర్యాగింగ్ ఫిర్యాదుల గణాంకాలను కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదించింది. దేశ వ్యాప్తంగా 2024లో మొత్తం 165 కేసులు నమోదైనట్లు వెల్లడించింది, ఈ నివేదిక ప్రకారం అత్యధిక ఫిర్యాదులు నమోదైన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో నిలవగా, రెండోస్థానంలో బిహార్ ఉంది. ఉత్తర ప్రదేశ్లో 33, బిహార్లో 17 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది.
ఏపీతో పాటు హరియాణా, ఉత్తరాఖండ్లో గతేడాదిలో చెరో ఆరు ర్యాగింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయని నివేదిక వెల్లడించింది. తెలంగాణ, గుజరాత్, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్లో చెరో మూడు కేసులు నమోదై 12వ స్థానంలో నిలిచాయి. ర్యాగింగ్ నివారణలో కేరళ ఆదర్శనీయంగా నిలిచింది. కేవలం ఒకే ఒక్క ఫిర్యాదుకు మాత్రమే పరిమితమైందని కేంద్రం తెలిపింది.
కళాశాలలు, ఆసుపత్రులు, హాస్టళ్లు సహా క్యాంపస్లోని పలు ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో పాటు సంస్థలలోని వివిధ ప్రదేశాల్లో ర్యాగింగ్ నిరోధక పోస్టర్లు హోర్డింగ్లను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. ర్యాగింగ్పై విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ ప్రత్యేక పోర్టల్ని ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది.