సమావేశంలో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ
కార్యకర్తలకు బొత్స దిశానిర్దేశం
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అధికారం తథ్యమని ఉద్ఘాటన
చీపురుపల్లిరూరల్(గరివిడి): ఐక్యంగా ముందుకు సాగి రానున్న స్థానిక, సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయపతాకాన్ని ఎగురవేద్దామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గరివిడిలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘కార్యకర్తలందరూ ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మనం అండగా నిలబడదాం. రాజకీయాలు శాశ్వతం కాదు. మనుషుల్లో ఉండే నైతిక విలువలు, పరస్పర గౌరవం శాశ్వతంగా నిలిచిపోతాయి.
నేను తప్పు చేసినా నాకు చెప్పండి.. తప్పును తప్పుగా చెప్పగలగాలి.. మనకు మనమే సరిదిద్దుకుంటూ ప్రజల కోసం పనిచేద్దాం’ అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని పేర్కొన్న ఆయన, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్యకర్తలకు, నాయకులకు సముచిత స్థానాలను కల్పిస్తూ గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
ప్రజల ఆదరణ అమూల్యమంటూ భావోద్వేగం
తన రాజకీయ జీవితంలో కార్యకర్తలు, ప్రజలు అందించిన ఆదరణను గుర్తు చేసుకుంటూ బొత్స ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ఈ రోజు తనకు లభిస్తున్న గౌరవం అమూల్యమైనదంటూ కంటతడి పెట్టారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుంటామని పేర్కొన్న ఆయన, అందరినీ కలుపుకుని ముందుకు సాగుదామన్నారు. వ్యక్తిగత భేదాభిప్రాయాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేద్దామన్నారు.


