సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో దక్షిణ ఒరిస్సా ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య అల్పపీడనం బలపడుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా 9.4 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రెండు రోజులపాటు ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఇవాళ(గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ భారీ వర్షాలు పడే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రేపు (శుక్రవారం) అనకాపల్లి, అల్లూరు, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. రేపు(శుక్రవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు(శుక్రవారం) ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు.. రెండు రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఆదేశించారు.
విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ ప్రకాశం 4 సెం.మీ, అనకాపల్లి 4, భీమిలి 2, పల్నాడు 2, గుంటూరు 2, ఎన్టీఆర్ 1.5, విజయనగరం 1.5, తుని 1 సెం.మీ వర్షపాతం నమోదైంది.


