
తిరుపతి,సాక్షి: టీటీడీ గోశాల వద్ద భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోశాలలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించిన అభినయ్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా.. భూమని అభినయ్రెడ్డి మాట్లాడుతూ.. ‘టీడీపీ చేసిన ఛాలెంజ్ను స్వీకరించి గోశాలకు వచ్చాం. కానీ టీడీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమని అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవాళ్లు స్వీకరించినప్పుడు పోలీసులతో అడ్డుకోవడం ఏమిటి. ఫోన్ చేసి రమ్మంటారు. వస్తే పోలీసులతో అడ్డుకుంటారు. ఇదే మీ సంస్కారం’అని దుయ్యబట్టారు.
భూమన ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ చేసిన ఛాలెంజ్ను స్వీకరిస్తూ గోశాలకు బయల్దేరిన భూమన కరుణాకర్రెడ్డి, ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్రెడ్డిలను కూటమి నేతల నిర్భంద కాండకు పాల్పడ్డారు.
ఓవైపు పోలీసులతో కూటమి నేతలు నిర్భందించారు. మరో వైపు గోశాలకు రావాలంటూ భూమనకు కూటమి నేతలు ఫోన్లు చేస్తున్నారు. గోశాలకు బయల్దేరిన భూమనను మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. అయితే, కూటమి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. గోశాలకు రాకుండా భూమనను కూటమి నేతలు అడ్డుకున్నారు. వేరే దారిలో గోశాలకు వచ్చా. నిజాల్ని నిరూపించేందుకు మేం సిద్ధం’అని వ్యాఖ్యానించారు.