అర్ధరాత్రి విద్యాలయంలోకి ప్రవేశించిన ఆగంతకులు
10 మంది బాలికల జడలు కత్తిరించిన దుండగులు
భీమునిపట్నం: విశాఖ జిల్లా భీమిలిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు తొమ్మిదో తరగతి చదువుతున్న పదిమంది విద్యార్థినుల జడలు కత్తిరించడం కలకలం రేపింది. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరగగా శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ తరగతిలో మొత్తం 38 మంది విద్యార్థినులు ఉన్నారు. వీరిలో 20 మంది ఒక గదిలో, 18 మంది మరో గదిలో నిద్రిస్తారు. బుధవారం రాత్రి 12 గంటల వరకు వార్డెన్ పర్యవేక్షణలోనే విద్యార్థినులు ఉన్నారు.
అనంతరం అందరూ నిద్రించిన తర్వాత.. ఒక గదిలో నిద్రిస్తున్న ఆరుగురి జడలను, మరో గదిలో నిద్రిస్తున్న నలుగురి జడలను గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కేవలం ఒక్క జడ వేసుకున్న బాలికల జడలనే కత్తిరించడం గమనార్హం. ఈ ఘటనపై గురువారం విద్యార్థినులను పిలిచి విచారించినప్పటికీ తమకేమీ తెలీదని చెప్పినట్లు ప్రిన్సిపాల్ గంగాకుమారి తెలిపారు.
దీంతో పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ గౌరి విద్యార్థినులను విచారించా రని, ఆమె వద్ద కూడా తమకు తెలియదనే సమాధానం చెప్పారని ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారి శ్రీదేవి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కాగా, విద్యాలయంలోకి బయటి వ్యక్తులు ప్రవేశించే అవకాశంలేదని, విద్యార్థినుల్లోనే ఎవరైనా ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది.


