బడ్జెట్పై దేశమంతా చర్చలు
కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి కిషన్రావు కరాడే
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కిషన్రావు కరాడే తెలిపారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అనంతరం బడ్జెట్పై వివిధ రంగాల నిపుణులతో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ప్రతిపక్షాలు బడ్జెట్పై చేస్తున్న అసత్యాలను ప్రజలు నమ్మవద్దని, వాస్తవాలను అర్థం చేసుకోవాలని కోరారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నులు విధించకుండా ప్రాధాన్యతా రంగాలకు అధిక కేటాయింపులు చేసినట్లు చెప్పారు.
జాతీయ రహదారులు, పోర్టులు, ఇండస్ట్రియల్ సెక్టార్కు భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. గ్రామీణ భారతంలో పోస్టాఫీసుల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందజేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. దేశ ప్రజలందరికీ ఉపయోగపడేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణం 78 శాతం పూర్తయిందన్నారు. రాష్ట్రంలో పోర్టులు కట్టాలని మోదీ కలలు కంటున్నారని చెప్పారు. లతా మంగేష్కర్ మృతిపట్ల సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది. లతా మరణం దేశానికి తీరని లోటని సోము వీర్రాజు పేర్కొన్నారు.
కార్యకర్తలు కష్టపడితే బీజేపీకి అధికారం
కార్యకర్తలు కష్టించి పనిచేస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారం సాధించడం సాధ్యమేనని కేంద్రమంత్రి భగవత్ కిషన్రావు కరాడే పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. భగవత్ కిషన్రావు కరాడేకు ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్, ప్రెసిడెంట్–ఎలక్ట్ పొట్లూరి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్తో కూడిన బృందం వినతిపత్రం అందజేసింది.
దుర్గమ్మ సేవలో కేంద్ర మంత్రి
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కిషన్రావు కరాడే ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు.