AP: పత్రికా స్వేచ్ఛపై పాశవిక దాడి | Attacks on Sakshi offices across the state | Sakshi
Sakshi News home page

AP: పత్రికా స్వేచ్ఛపై పాశవిక దాడి

Jun 10 2025 3:46 AM | Updated on Jun 10 2025 10:16 AM

Attacks on Sakshi offices across the state

విజయవాడలోని ‘సాక్షి’ కార్యాలయంపై దాడి చేసి బోర్డును ధ్వంసం చేస్తున్న టీడీపీ గూండాలు.. హైదరాబాద్‌లో సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేస్తున్న ఏపీ పోలీసులు

  • రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై పచ్చమూకల విధ్వంసం 
  • ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే ‘సాక్షి’పై కుతంత్రం
  • ఎమర్జెన్సీని తలదన్నే రీతిలో కూటమి సర్కారు దౌర్జన్యకాండ
  • రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ చెలరేగిన టీడీపీ గూండాలు 
  • కర్రలు, రాళ్లతో విధ్వంసం 
  • కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే పన్నాగం
  • ఏపీలో రెడ్‌బుక్‌ అరాచకంపై జాతీయ స్థాయిలో ఆందోళన

నాణేనికి మరోవైపు కోణాన్ని నిర్భయంగా చూపుతున్న తెలుగు ప్రజల మనస్సాక్షి.. ‘సాక్షి’పై ముష్కర మూకలు దాడులకు తెగబడ్డాయి.. అదును కోసం నక్కిన గుంటనక్కలు లేగదూడపై ఆవురావురుమంటూ విరుచుకు­పడిన చందంగా ఒక్కసారిగా సాక్షి కార్యాలయాలపై ఈ పచ్చమూకలు విరుచుకుపడ్డాయి.. గేట్లపై రాళ్లు, కోడిగుడ్లు విసిరి, బోర్డులను విరగ్గొట్టి, పేపర్లను తగులబెట్టి వికృతానాందాన్ని ఆస్వాదించాయి. 

ప్రజల వాణిగా.. వాస్తవాల వారధిగా సాక్షి నిలవడం నచ్చని ఉన్మాదులు ఈ దాడిలో అత్యుత్సాహం చూపడం ఆశ్చర్యపరచకపోయినా.. నచ్చని మాట అన్నారంటూ ఆగ్రహించిన అతివలు అత్యంత లాఘవంగా గేట్ల పైకెక్కడం చూసి జనం ముక్కున వేలేసుకున్నారు.. మహిళలను గౌరవించడంలో ముందుండే సాక్షి మీడియా వివాదానికి కారణమైన విశ్లేషకుడి మాటలను తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది.. వాటిని సాక్షికి ఆపాదించవద్దని కోరింది. 

అయినా దీనిని ఓ అవకాశంగా మార్చుకోవాలన్న దుగ్ధతో, రాజకీయ కుట్రతో శ్రేణులను ఎగదోస్తూ దాడులకు ప్రేరేపించారు. సాక్షి కార్యాలయాలపై విధ్వంసానికి పురికొల్పారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ టీడీపీ  నాయకులు, కార్యకర్తలు సాగించిన ఈ దుర్మార్గాన్ని ప్రజాస్వామిక­వాదులు, పత్రికా స్వేచ్ఛను కాంక్షించే ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నారు.

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌ : రాష్ట్రంలో రెడ్‌బుక్‌ అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు. గత ఎన్నికల్లో గుప్పించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ఏడాదైనా ఒక్కటీ నెరవేర్చలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్‌ పాలి‘ట్రిక్స్‌’ చేస్తోంది. అందులో భాగంగానే అడ్డగోలుగా అక్రమ అరెస్టులు, అనవసర రాద్ధాంతాలు చేస్తోంది.  

ఈ క్రమంలోనే.. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’పై దాడులకు ఉసిగొలిపింది. తెలుగువారి మనస్సాక్షిగా.. పేదవాడి గొంతుకై.. నాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలబడుతూ, వాస్తవాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తున్న ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు. 

విచక్షణారహితంగా రాళ్లు రువ్వుతూ, కోడిగుడ్లు విసురుతూ రెచ్చిపోయారు. ‘సాక్షి’ యూనిట్‌ కార్యాలయాల వద్ద నేమ్‌ బోర్డులను పెకిలించేశారు. ‘సాక్షి’ పత్రిక ప్రతులతో పాటు, ‘సాక్షి’ నేమ్‌ బోర్డులను తగులబెట్టారు. బయటి వ్యక్తి వ్యాఖ్యలతో సంబంధంలేదని ‘సాక్షి’ చెప్పినప్పటికీ రెచ్చిపోయిన టీడీపీ మూకలు నానా బీభత్సం సృష్టిస్తూ, ‘సాక్షి’ సిబ్బందిని భయాందోళనలకు గురిచేశారు. 

AP: సాక్షి ఆఫీస్ లోకి చొచ్చుకెళ్లేందుకు టీడీపీ గూండాల యత్నం

విజయవాడలో ‘సాక్షి’ ఏపీ ప్రధాన కార్యాలయంపై దాడి
ఈ దాడుల్లో భాగంగా.. విజయవాడ ఆటోనగర్‌లో ఉన్న ‘సాక్షి’ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపైనా పచ్చమూకలు విరుచుకుపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు భార్య అనురాధ, ఆయన కొడుకు గద్దె క్రాంతికుమార్, కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, ముమ్మనేని ప్రసాద్, పొట్లూరి సాయిబాబు, మాజీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు, అల్లరిమూకలు ఉ.11 గంటలకు ‘సాక్షి’ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని గేటు ముందు బైఠాయించారు. 

‘సాక్షి’ పత్రికకు, యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అక్కడితో సరిపెట్టకుండా, కొందరు అత్యుత్సాహంతో కార్యాలయం గేటుపైకెక్కి లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు. కార్యాలయంలోకి వెళ్లి విధ్వంసం చేయాలని శతధా ప్రయత్నించారు. అది సాధ్యంకాక గుడ్లు, రాళ్లు తెచ్చి కార్యాలయంపైకి విసిరారు. దీంతో అక్కడ రక్షణ కల్పిస్తున్న పోలీసులకు అవి తగిలాయి. మహిళా పోలీసులపై కోడిగుడ్లు పడ్డాయి. అప్పటికీ శాంతించని కూటమి నేతలు ‘సాక్షి’ నేమ్‌ బోర్డును తొలగించి, కొంత భాగాన్ని మురుగుకాలువలో పడేశారు. 

మిగతా భాగాన్ని గేటు ముందుకు తెచ్చి కాళ్లతో తొక్కారు. పత్రిక ప్రతులతో పాటు నేమ్‌ బోర్డుకు నిప్పుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు ఈ విధ్వంసకాండ కొనసాగింది. ఆ సమయంలో విధుల్లోకి వెళ్లాల్సిన ‘సాక్షి’ సిబ్బంది రోడ్డుపైనే మండుటెండలో ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు.. కూటమి నేతల దుశ్చర్యలకు ఆటోనగర్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనచోదకులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుపతిలో టీడీపీ నాయకులు సోమవారం పోలీస్‌ చట్టం సెక్షన్‌–30ని ఉల్లంఘించి నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఎల్లోగ్యాంగ్‌ అరాచకం ఇలా..
» శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని ‘సాక్షి’ కార్యాలయం ఆస్తులను టీడీపీ మూకలు నిరసనకారుల ముసుగులో ధ్వంసం చేశాయి. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు బావ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు తదితరులు సుమారు మూడు గంటలపాటు విధ్వంసకాండకు పాల్పడ్డారు. కార్యాలయం నేమ్‌ బోర్డును పీకేసి తగలబెట్టారు. కార్యాలయంలోకి, ప్రహరీపై పేడ విసిరారు. ప్రహరీపై నుంచి లోపలికి దూకి కార్యాలయం లోపల గలాటా సృష్టించారు. గేటుకున్న తాళాన్ని సైతం పీకేశారు. కార్యాలయం ఎదుట రెండు టెంట్లు వేసి ధర్నా చేశారు. 

»   విశాఖ, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని ‘సాక్షి’ యూనిట్‌ కార్యాలయాల వద్ద టీడీపీ, జనసేన శ్రేణులు ఆందోళన నిర్వహించారు. 

»   ఏలూరులోని ‘సాక్షి’ జిల్లా కార్యాలయంపైనా టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు యత్నించారు. టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో రభస సృష్టించారు. 

»  గుంటూరు జిల్లా ఆత్మకూరులోని సాక్షి కార్యాలయం వద్ద అమరావతి జేఏసీ పేరుతో అమరావతి రైతులు, మహిళలు ధర్నా చేశారు. పలుమార్లు సాక్షి కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. గేట్లు ఎక్కి రాళ్లు రువ్వారు. రాజధాని జేఏసీ కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్, మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంభంపాటి శిరీష, మాజీ జెడ్పీటీసీ ఆకుల జయసత్య, మంగళగిరి మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ జవ్వాది కిరణ్, తాడికొండ మార్కెట్‌ యార్డ్‌ మాజీచైర్మన్, టీడీపీ నాయకులు బెల్లంకొండ నరసింహారావు, తాడేపల్లి టీడీపీ మహిళా పట్టణ అధ్యక్షురాలు అన్నె కుసుమ, గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. గుంటూరు, పల్నాడు జిల్లా నరసరావుపేట సాక్షి కార్యాలయాల ముందు కూడా ఆందోళన చేశారు. 

» నెల్లూరు, కర్నూలు,    కడప, రేణిగుంటలోని సాక్షి యూనిట్‌ కార్యాలయాలపైనా టీడీపీ మూకలు కొందరు రౌడీలతో కలిసి దాడికి తెగబడ్డాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement