బాధితుల అణచివేత.. దారుణాల దాచివేత | Atrocities on women in Kuppam | Sakshi
Sakshi News home page

బాధితుల అణచివేత.. దారుణాల దాచివేత

Jun 21 2025 6:09 AM | Updated on Jun 21 2025 6:09 AM

Atrocities on women in Kuppam

కుప్పంలో మహిళలపై వరుస దౌర్జన్యాలు

ముఖ్యమంత్రి ఇలాకాలో పేట్రేగిపోతున్న పచ్చ మూకలు

ఏడాదిలో వెలుగు చూసిన మూడు దారుణాలు

నిందితులతో పాటు బాధితులపైనా కేసులు

సాక్షి, టాస్‌్కఫోర్స్‌: స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా, హోం మంత్రిగా ఓ మహిళ ఉన్నా కుప్పంలో మహిళలకు మాత్రం రక్షణ కరువైంది. ‘రెడ్‌ బుక్‌’ పాలనలో రాజ్యాంగం, చట్టాలు, విలువలను గాలికి వదిలేసి పచ్చ శాసనాలనే అధికార యంత్రాంగం పాటిస్తోంది. తాము ఏం చేసినా అడిగేవారు లేరనే విచ్చలవిడి తనంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆటవికంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలపై కనీస గౌరవం, కనికరం లేకుండా దౌర్జన్యకాండను కొనసాగిస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీలోని ఒకటవ డివిజన్‌ నారాయణపురంలో రూ.80 వేల అప్పును తీర్చటం ఆలస్యమైందని శిరీష అనే మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన విషయం సంచలనంగా మారింది.

ఆమెను బూతులు తిడుతూ, కొడుతూ, తన చంటి బిడ్డ ఏడుస్తున్నా కనికరం చూపని వైనాన్ని కొందరు స్థానికులు వీడియో తీయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం జరిగిన ఈ దురాగతం మీడియాలో ప్రముఖంగా రావటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకున్నప్పటికీ బాధితురాలికి జీవిత కాలం మరువలేని దారుణమైన అవమానంగా ఈ ఘటన మిగిలింది. భర్త చేసిన అప్పును సకాలంలో తీర్చలేదని టీడీపీకి చెందిన మునికన్నప్ప కుటుంబం ఈ నీచమైన చర్యకు పాల్పడింది. అధికారంలోని తమను అడిగేవారు లేరనే అహంతో మానవత్వం మరచి రెచ్చిపోయారు.

అప్పు తీర్చలేదని మహిళ నిర్బంధం 
కడపల్లి పంచాయతీలోని పోడూరుకు చెందిన వ్యక్తి అప్పు తీర్చలేదని తన భార్యను మండల కేంద్రంలో నిర్బంధించిన ఘటన ఫిబ్రవరిలో జరిగింది. పోడూరుకు చెందిన తిరుపతి అనేవ్యక్తి తుమ్మిశికి చెందిన ఓ టీడీపీ నాయకుడి వద్ద అప్పు తీసుకున్నాడు. ఫిబ్రవరి 15న భార్య ఆరతితో కలిసి శాంతిపురానికి వచి్చన తిరుపతితో అప్పు విషయమై టీడీపీ నాయకుడు గొడవ పెట్టుకున్నాడు. అప్పు తీర్చేసి భార్యను తీసుకుపొమ్మని ఆరతిని లాక్కెళ్లి గదిలో బంధించాడు. ఈ ప్రయత్నంలో ఆమె బట్టలు కూడా చిరిగిపోయాయి.

ప్రతిఘటిస్తుండగా భర్త తిరుపతి తలపై నిందితుడు ఇనుప రాడ్డుతో కొట్టడంతో గాయమైంది. విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు పెద్ద సంఖ్యలో మండల కేంద్రానికి చేరుకోవటంతో పరిస్థితి చేయి దాటుతోందని గమనించి ఆరతిని విడిచిపెట్టాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో కేసు నమోదు కాలేదు. రూ 2.20 లక్షలు బాధితులు ఇచ్చేలా పచ్చ పెద్ద మనుషులు సెటిల్మెంట్‌ చేశారు. ఇలా వరుసగా కుప్పంలో మహిళలపై పసుపు చొక్కాల దౌర్జన్యకాండ కొనసాగుతోంది.

వెంకటేష్ పురంలోనూ అదే దారుణం
శాంతిపురం మండలం మఠం పంచాయతీ వెంకటేష్ పురంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు బాలికలపై గత నెల 31న హేయమైన రీతిలో దాడి జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మధ్య ఉన్న ఆస్తుల వివాదంలో స్థానిక టీడీపీ నాయకుడు సల్లాపురి జోక్యం చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు. పార్వతమ్మ కుటుంబానికి తన తోటి కోడలు అనసూయమ్మతో ఉన్న వివాదంలో పచ్చ మూక రౌడీయిజానికి దిగి మహిళలు, బాలికలను చితకబాదింది. పార్వతమ్మ, ఇందిరమ్మలతో పాటు బాలికలు ఉమాదేవి, ఉషారాణి, శ్వేతలను విచక్షణారహితంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో పోలీసులు టీడీపీ నాయకుడి వర్గీయులతో పాటు బాధిత వర్గంలోని నలుగురి మీద కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement