కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలతో రాష్ట్రం

AP residents have high hopes on central budget - Sakshi

జాతీయ సంస్థలకు నిధుల కేటాయింపుపై చూపులు 

వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపుపై ఆశలు 

పోలవరంకు ప్రత్యేక కేటాయింపులు కోరుతున్న రాష్ట్రం 

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా ఏపీకి గ్రాంట్లు

సాక్షి, అమరావతి: కేంద్రం సోమవారం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ సంస్థలకు గ్రాంట్ల రూపంలో తగినన్ని నిధుల కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం గంపెడు ఆశలతో ఎదురు చూస్తోంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుకు తగినన్ని నిధుల కేటాయింపులతో పాటు ఇప్పటికే ఉన్న బకాయిలకు బడెŠజ్‌ట్‌లో తగినన్ని నిధులు కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంటు నిధులకు సంబంధించి ఈ బడ్జెట్‌లోనైనా కేటాయింపులు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి సాయం కింద బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద పదేళ్ల పాటు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ మినహాయింపు, ఇన్సూరెన్స్‌ ప్రీమియం 100 శాతం రీయింబర్స్‌మెంట్‌లను కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. 

కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ఊతమందేనా.. 
రాష్ట్రంలో కొత్తమెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు అనుమతించాలని కోరినందున బడ్జెట్‌లో ఆ కాలేజీలకు నిధులు కేటాయిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. దుగరాజపట్నం పోర్టు, వైఎస్సార్‌ కడప స్టీల్‌ ప్లాంట్‌తో పాటు రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణతో.. ఆ కార్యకలాపాలకు నిధులు కేటాయింపులు చేయాలని ప్రభుత్వం కోరింది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న పలు విద్య, వైద్య సంస్థలకు ప్రత్యేకంగా కేటాయింపులను ప్రభుత్వం ఆశిస్తోంది. కోవిడ్‌ నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా కొంత ఉపశమనం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే గత ఆర్థిక ఏడాది 15వ ఆర్థిక సంఘం ఒక ఆర్థిక ఏడాదికే సిఫార్సులు చేసింది. ఇప్పుడు కూడా కోవిడ్‌ నేపథ్యంలో వచ్చే ఆర్థిక ఏడాదికే గతేడాది సిఫార్సులనే మళ్లీ చేస్తుందా లేక కొంత మేర గ్రాంట్లు పెంచుతుందా అనే దానిపై రాష్ట్రానికి నిధులు రావడం ఆధారపడి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top