‘ఆపద్బాంధవి’ మరింత బలోపేతం.. మరిన్ని 108 అంబులెన్స్‌లు | Sakshi
Sakshi News home page

‘ఆపద్బాంధవి’ మరింత బలోపేతం.. మరిన్ని 108 అంబులెన్స్‌లు

Published Wed, Dec 14 2022 9:38 AM

AP Govt To Purchase Another 146 New 108 Vehicles With Rs 46 Crores - Sakshi

సాక్షి, అమరావతి: అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌చేసిన నిమిషాల్లో కుయ్‌.. కుయ్‌మంటూ వచ్చి బాధితులను ఆస్పత్రులకు చేరుస్తూ ‘108’ అంబులెన్స్‌లు ఆపద్బాంధవిలా లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాయి. ఈ సేవలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభు­త్వం మరిన్ని కొత్త వాహనాల కొనుగోలుకు చ­ర్యలు చేపడుతోంది. టీడీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ‘108’ సేవలకు సీఎం వైఎస్‌ జగన్‌ ఊపిరిలూదిన విషయం తెలిసిందే. ఫలితంగా 2020 జూలై నుంచి ఇప్పటివరకూ ఈ అంబులెన్స్‌లు 10 లక్షలకు పైగా ఎమర్జెన్సీ కేసు­ల్లో ప్రజలను ఆస్పత్రులకు చేర్చాయి. ఫోన్‌చేసిన వెంటనే అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకునే సమయం గణనీయంగా తగ్గింది.  

రూ.46 కోట్లతో 146 వాహనాలు
టీడీపీ హయాంలో 440 అంబులెన్స్‌లతో ఏపీ­లో 108 సేవలు అంతంతమాత్రంగా ఉండేవి. సీఎం వైఎస్‌ జగన్‌ వచ్చాక 768 అంబులెన్స్‌లతో వాటి సేవలను విస్తరించారు. తాజాగా.. రూ.46 కోట్లతో మరో 146 కొత్త వాహనాల కొనుగోలుకు వైద్యశాఖ చర్యలు తీసుకుంటోంది. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమ­లు­­కోసం రూ.107 కోట్లతో 432 కొత్త 104 వాహనాలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభు­త్వం గతంలో నిర్ణయించింది. కానీ, రాష్ట్రంలో 10,032 డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు ఉన్నాయి.

ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో భాగంగా పీహెచ్‌సీ వైద్యులు నెలలో రెండుసార్లు ఒక్కో గ్రామాన్ని 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్స్‌ (ఎంఎంయూ)తోపాటు విలేజ్‌ క్లినిక్‌లను సందర్శించాలి. ఇప్పటికే ఉన్న 656 ‘104 ఎంఎంయూ’ వాహనాలతో 7,166 విలేజ్‌ క్లినిక్‌లను సందర్శిస్తున్నారు. మిగిలిన విలేజ్‌ క్లినిక్‌లలోనూ నెలలో రెండుసార్లు సందర్శించడానికి 260 నూతన 104 వాహనాలు కొనుగోలు చేస్తే సరిపోతుందని వైద్యశాఖ నిర్ణయించింది. 

ఇదీ చదవండి: చెత్తతో ‘పవర్‌’ ఫుల్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement