ఈఎస్‌ఐ సేవలు @ ఆన్‌లైన్‌  | AP Govt is moving towards massive reforms in ESI hospitals | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐ సేవలు @ ఆన్‌లైన్‌ 

Apr 15 2021 4:52 AM | Updated on Apr 15 2021 4:52 AM

AP Govt is moving towards massive reforms in ESI hospitals - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో భారీ సంస్కరణల దిశగా ముందుకు వెళుతోంది. గత ప్రభుత్వ హయాంలో కార్మీకులకు వైద్యం కాదు కదా.. వచి్చన నిధులన్నీ కాంట్రాక్టర్లు, మంత్రులు, నేతల చేతుల్లోకి వెళ్లి, కార్మీకరాజ్య బీమా ఆస్పత్రులు నిర్వీర్యం అయిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే  విచారణ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్‌ఐ కార్మికులకు ఆన్‌లైన్‌లో డాక్టరు అపాయింట్‌మెంట్‌ ఇచ్చే ఏర్పాట్లు చేస్తోంది. జబ్బు చేస్తే ఈఎస్‌ఐ డిస్పెన్సరీకి వెళ్లినా డాక్టరు లేకపోవడం వంటి కారణాలతో వెనక్కు రావాల్సి వచ్చేది. దీంతో కార్మీకులకు వైద్యం సరిగా అందేది కాదు. ఇకపై అలాకాకుండా జబ్బు చేసిన రోజు వైద్యానికి వెళ్లగానే చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 13 లక్షల మందికిపైగా కార్మీకులున్నారు.

వీరి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 40 లక్షల మందిపైనే ఉన్నారు. వీళ్లకోసం కార్మీక రాజ్యబీమా సంస్థ ‘ఏఏఏప్లస్‌’ అనే యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఏ డిస్పెన్సరీకి వెళ్లాలో దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్టరు దగ్గరకు వెళ్లే గంట ముందు యాప్‌లో వివరాలు పంపిస్తే చాలు.. పేషెంటు వెళ్లేసరికి విధిగా అక్కడ వైద్యులు ఉంటారు. పేషెంటు వేచి ఉండకుండా వెంటనే పరీక్షించి అవసరమైన మందులు ఉచితంగా ఇస్తారు. ఇప్పటికే గుణదలలోని ఆస్పత్రిని మోడల్‌ డిస్పెన్సరీగా తీర్చిదిద్దారు. మొత్తం 78 డిస్పెన్సరీలకు ఆన్‌లైన్‌ సేవలు విస్తరిస్తున్నారు. దీనివల్ల డాక్టర్లు గైర్హాజరవడానికి వీలుండదు.  ఏరోజుకారోజు ఆన్‌లైన్‌ వివరాలుఅందుతాయి. 

13 ఏళ్ల తర్వాత నర్సుల నియామకాలు 
గడిచిన 13 ఏళ్లుగా ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఒక్క నియామకమూ జరగలేదు. 13 ఏళ్ల తర్వాత ఒకేసారి 101 మంది నర్సుల నియామకం జరుగుతోంది. ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించి పరిశీలించారు. కొద్ది రోజుల్లో నర్సులు విధుల్లో చేరనున్నారు. దీనివల్ల నర్సింగ్‌ కేర్‌ సేవలు మెరుగు పడనున్నాయి. 

ఇకపై అన్నీ ఆన్‌లైన్‌ సేవలే 
తాజాగా కార్మికులకు ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ సేవలు అందుబాటులోకి తెస్తున్నాం. మందుల కొనుగోళ్లు, ఇన్వెంట్రీ, ఇండెంట్‌ అన్నీ ఆన్‌లైన్‌ పరిధిలోకి తీసుకురాబోతున్నాం. గతంలో పెండింగ్‌లో ఉన్న పేషెంట్ల బిల్లులన్నీ ఆన్‌లైన్‌ చేశాం. ప్రైవేటు ఆస్పత్రుల వివరాలను కూడా ఆన్‌లైన్‌ చేయబోతున్నాం. దీనివల్ల పారదర్శకంగా పనులు జరుగుతాయి. ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండకుండా సేవలు అందేలా చేస్తున్నాం. రెండు నెలల్లో అన్ని ఆస్పత్రులను ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ పరిధిలోకి తెస్తాం. 
– డాక్టర్‌ కుమార్‌ లక్కింశెట్టి, డైరెక్టర్,కార్మీకరాజ్య బీమా సంస్థ   

Advertisement
 
Advertisement
Advertisement