అడవి బిడ్డలకు అక్షర యజ్ఞం

AP Government efforts to increase literacy of Tribal Students - Sakshi

పూర్తిగా ఉచిత చదువులు, సౌకర్యాలు

వీరి కోసం 2,678 విద్యాలయాలు

వీటిల్లో 2,05,887 మందికి చదువులు

వృత్తి విద్యలో 80,091 మంది..

వీరిలో అక్షరాస్యత పెంచేందుకు ప్రభుత్వం కృషి

సాక్షి, అమరావతి: అడవి బిడ్డల్లో అక్షరాస్యత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అక్షర యజ్ఞం చేస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గిరిజనుల్లో నూరు శాతం అక్షరాస్యత సాధించేందుకు అడుగులు ముందుకు వేస్తోంది. విద్యకు ఎంత ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే పలుసార్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా పలు కార్యక్రమాల్ని వేగవంతం చేసింది. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 27,39,920 మంది గిరిజన జనాభా ఉన్నారు. వీరిలో ప్రస్తుతం 48.98% మాత్రమే అక్షరాస్యులు. వీరిలో అక్షరాస్యత పెంచేందుకు గిరిజన గ్రామాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా స్కూళ్లు, కాలేజీలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. రోడ్లు కూడా సరిగా లేని మారుమూల పల్లెల్లోనూ ఏకోపాధ్యాయ పాఠశాలను నడుపుతోంది. ఇటీవలే మెడికల్, ఇంజనీరింగ్‌ కాలేజీల నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. త్వరలోనే గిరిజన యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

► గిరిజన గ్రామాల్లో ప్రత్యేకంగా 2,678 విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో 2,05,887 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీల్లో సకల సౌకర్యాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న 189 గిరిజన సంక్షేమ గురుకులాల్లోనూ తగిన వసతులు ఉన్నాయి.
► 184 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, 53 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు కలిపి మొత్తం 237 పాఠశాలల్లో వృత్తి విద్యను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పాఠశాలల్లో 80,091 మంది చదువుతున్నారు. ఇందుకు అవసరమైన సామగ్రిని నైపుణ్యాభివృద్ధి సంస్థ సమకూర్చింది.  
► జగనన్న విద్యా కానుక పథకం ద్వారా విద్యార్థులకు స్కూలు బ్యాగుతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు వంటివి సమకూర్చింది. వీటిని ఇటీవలే విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఒక సెట్‌ బెడ్డింగ్‌ మెటీరియల్‌ సరఫరా చేసింది. హాస్టళ్లు, ఆశ్రమ స్కూళ్లకు ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు అందజేశారు. ఇక హాస్టళ్లు, గురుకుల స్కూళ్లలో చదువుకునే వారికి కాస్మొటిక్‌ చార్జీలను ప్రభుత్వం ప్రత్యేకంగా ఇస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top