
రేపు ఈసెట్, ఎల్లుండి ఐసెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కేంద్రంలోకి నో ఎంట్రీ
సాక్షి, అమరావతి/అనంతపురం: రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పరీక్షలకు వేళయ్యింది. ఈ నెల 6 నుంచి జూన్ 13 వరకు ఎనిమిది ప్రవేశ పరీక్షలను ఉన్నత విద్యా మండలి నిర్వహించనుంది. ఈనెల 6న ఈసెట్, 7న ఐసెట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. నిర్ణీత సమయానికంటే నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.
ఇప్పటికే పరీక్షల తేదీల వారీగా హాల్టికెట్లను అందుబాటులో ఉంచామని తెలిపింది. అభ్యర్థులు తమ హాల్టికెట్తో పాటు వ్యక్తిగత గుర్తింపు కార్డు, బ్లాక్/బ్లూ బాల్పాయింట్ పెన్నును తీసుకెళ్లాలని సూచించింది. హాల్టికెట్పై ముద్రించిన వివరాలపై అభ్యంతరం ఉంటే పరీక్షా కేంద్రంలోని అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరింది. అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది.
ఈసెట్ నిర్వహణకు సిద్ధం: ఏపీ ఈసెట్ను మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈసెట్ కన్వినర్ ప్రొఫెసర్ బి.దుర్గాప్రసాద్ వెల్లడించారు. లేటరల్ ఎంట్రీ కింద ఇంజినీరింగ్ సెకండియర్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈసెట్ ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై 12 గంటలకు ముగుస్తుందని.. మధ్యాహ్నం సెషన్ 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుందన్నారు.