AP Assembly 2022: పోలవరంపై సీఎం జగన్‌ ప్రసంగం.. జయము జయము చంద్రన్న పాటతో సభలో నవ్వులు

AP CM Jagan About Polavaram Jayamu Jayamu Chandranna Tour - Sakshi

పోలవరం ఎత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న రాద్ధాంతంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, శాసన సభ సమావేశాల్లో ఎండగట్టారు. మంగళవారం సభలో పోలవరంపై స్వల్ఫకాలిక చర్చ సందర్భంగా.. ప్రాజెక్టుకు సంబంధించిన పనుల గురించి వివరిస్తూనే, ప్రతిపక్ష నేత చేస్తున్న తప్పుడు ప్రచారాలను సూటిగా ప్రశ్నించారు సీఎం వైఎస్‌ జగన్‌.  

చంద్రబాబు పాలనలో స్పిల్‌వే కాంక్రీట్‌ శంకుస్థాపన, ఐకానిక్‌ బ్రిడ్జ్‌ అండ్‌ కాపర్‌ డ్యామ్‌ పనుల పేరిట మరో శంకుస్థాపన, పునాది అయిపోయిందని ఇంకో శంకుస్థాపన, స్పిల్‌వేలో గేట్లకు సంబంధించిన పనులకు సంబంధించిన ఓ శంకుస్థాపన..ఇలా అవసరం లేని శంకుస్థాపనలతో కోట్ల ప్రజాధనం వృధా అయ్యిందని గుర్తు చేశారు సీఎం జగన్‌. గేట్లకు సంబంధించిన.. స్పిల్‌వేలో గ్యాలరీ వాక్‌ అంటూ కుటుంబ సభ్యులతో ఫ్యామిలీటూర్‌ చేశారని, తద్వారా పొలవరం పనులు పూర్తయ్యాయనే భ్రమను జనాల్లో కలిగించే ప్రయత్నం చేశారన్నారు సీఎం జగన్‌. ఇవి మాత్రమే కాదు.. 

ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో.. రూ.100 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బస్సుల్లో జనాలను పొలవరం తరలించారని, ‘జయము జయము చంద్రన్న’ పాటతో ప్రత్యేకంగా భజన సైతం చేయించుకున్నారని సీఎం జగన్‌ ఎద్దేవా చేశారు. ఆ సమయంలో జయము జయము చంద్రన్న పాట ప్లే కాగా.. సభ మొత్తం నవ్వులు పూశాయి. కమీషన్ల కోసం కక్కుర్తి పడే ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని, పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన గొంతు నొక్కారని సీఎం జగన్‌ గుర్తు చేసుకున్నారు. తమ పాలనలో పొలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మెజార్టీ పనులు పూర్తి చేసినట్లు.. పూర్తి వివరాలను సభకు వెల్లడించారు సీఎం జగన్‌. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలకు గట్టిగా బుద్ధి చెప్పారని, ఇప్పుడు చేస్తున్న కుట్రలకు వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ బాబుకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. 

వక్రీకరణ, అబద్దాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. తాను విజనరి అని చెప్పుకునే చంద్రబాబు వల్లే ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయన్నారు సీఎం జగన్‌. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నామని చంద్రబాబుకు ఎవరు  చెప్పారు? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించమని సీఎం జగన్‌ సభాముఖంగా స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top