అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన | Annavaram temple AEO Kondalarao Over Action With Devotees | Sakshi
Sakshi News home page

అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన

May 31 2025 11:40 AM | Updated on May 31 2025 1:31 PM

Annavaram temple AEO Kondalarao Over Action With Devotees

సాక్షి, అన్నవరం: అన్నవరం దేవస్థానం ఏఈఓ కొండలరావు.. మహిళా భక్తులతో అనుచితంగా ప్రవర్తించడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇలా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా కొండలరావును ఆలయ విభాగం నుండి గోశాల, గార్డెన్స్‌ విభాగాలకు బదిలీ చేశారు. ఇక, కొండలరావుపై ఇప్పటి వరకు ఇద్దరు మహిళా భక్తులు ఫిర్యాదు చేయడం గమనార్హం.

వివరాల ప్రకారం.. తెలంగాణలోని మంచిర్యాల నుంచి సత్యదేవుని సన్నిధిలో సేవ చేయడానికి వచ్చిన తమ పట్ల కొండలరావు దురుసుగా ప్రవర్తించారని మహిళా సేవకులు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై మండిపడిన దేవదాయ శాఖ కమిషనర్‌ ఈ వ్యవహారంపై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావును ఆదేశించారు. ఈ మేరకు కొండలరావుకు షోకాజ్‌ నోటీసు కూడా జారీ అయ్యింది. ఈ వివాదం ఇంకా ముగియక ముందే ఆయనపై మరో భక్తుడు తీవ్ర స్థాయి ఆరోపణలతో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో) ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది.

ఏం జరిగిందంటే..
హైదరాబాద్‌కు చెందిన భక్తుడు హోతా కామేశ్వరశాస్త్రి ఈ నెల 13వ తేదీ రాత్రి జరిగిన సత్యదేవుని శ్రీపుష్పయాగం కార్యక్రమానికి అన్నవరం వచ్చారు. రూ.రెండు వేల టికెట్‌తో సత్యదేవుని వ్రతం ఆచరించి, స్వామివారిని దర్శించుకోవాలని అనుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి పురోహితుడు రాత్రి స్వామివారి శ్రీపుష్పయాగ మహోత్సవం జరుగుతుందని చెప్పడంతో కామేశ్వరశాస్త్రి దంపతులు హైదరాబాద్‌ ప్రయాణం రద్దు చేసుకున్నారు. అనంతరం, సత్యదేవుని శ్రీపుష్పయాగానికి హాజరయ్యారు. ఈ ఉత్సవం ముగిసిన తరువాత ప్రసాదం తీసుకునేందుకు అర్చకుని వద్దకు వెళ్లగా, తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి తన భార్య భుజంపై చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు.

దీంతో, తాను ఒక్కసారిగా షాక్‌కు గురైనట్టు తెలిపారు. అయితే, ఆ వ్యక్తి దేవస్థానం ఏఈఓ కొండలరావుగా అక్కడి సిబ్బంది ద్వారా తెలుసుకున్నానని పేర్కొన్నారు. వెంటనే ఈ విషయమై ఈవోకు ఫిర్యాదు చేద్దామనుకున్నాను. కానీ, అప్పటికే ఈవో కొండ దిగువకు వెళ్లిపోయారని తెలిసి హైదరాబాద్‌ వచ్చేశామని పేర్కొన్నారు. తన భార్యతో పాటు ఇతర భక్తుల పట్ల అతడి ప్రవర్తన అదేవిధంగా ఉందని ఆ ఫిర్యాదులో కామేశ్వరశాస్త్రి చెప్పుకొచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదు కాపీని దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి గురువారం దేవస్థానానికి పంపించి, దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఈవోను ఆదేశించారు. దీనిపై విచారణాధికారి ద్వారా విచారణ చేయించనున్నట్లు ఈవో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement