
సాక్షి, అమరావతి: వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. సొంత మండలం నిబంధన నుంచి వార్డు సచివాలయాల ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. ఉద్యోగులు సొంత వార్డు పరి«ధిలో కాకుండా ఆ పట్టణంలోనే ఇతర వార్డులకు గానీ, ఉమ్మడి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు గానీ బదిలీపై వెళ్లేందుకు అర్హులని తెలియజేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా అవకాశం ఇవ్వాలి
‘వార్డు సచివాలయ ఉద్యోగులకు సొంత పట్టణంలోని మున్సిపాలిటీల్లోనే బదిలీలకు అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. అయితే, గ్రామ సచివాలయాల ఉద్యోగులకు సొంత మండలాలకు బదిలీలకు అవకాశం కల్పించకపోవడంపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ’ఒకే శాఖకు చెందిన ఉద్యోగులకు రెండు రకాల నిబంధనలు సమంజసం కాదు. గ్రామ సచివాలయాల ఉద్యోగులకు సైతం వారి సొంత మండలాలకు బదిలీలకు అవకాశం కల్పించాలి’ అని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు జాని పాషా, ప్రధాన కార్యదర్శి అంకమ్మరావు సోమవారం ఒక ప్రకటనలో కోరారు.
నేడు జిల్లా, మండల కేంద్రాల్లో వినతులు
గ్రామ సచివాలయాల ఉద్యోగులకు కూడా సొంత మండలాల్లో పనిచేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతూ మంగళవారం అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో అధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఒక ప్రకటనలో తెలిపింది.