మాపై నాలుగు శాఖల పెత్తనం | Andhra Pradesh village Secretariat Engineering Assistants Protest | Sakshi
Sakshi News home page

మాపై నాలుగు శాఖల పెత్తనం

Jun 17 2025 6:01 AM | Updated on Jun 17 2025 6:01 AM

Andhra Pradesh village Secretariat Engineering Assistants Protest

జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ధర్నాచేస్తున్న ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు

పనిభారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం

ఉద్యోగ భారాన్ని తగ్గించండి

ఉన్నత చదువులు చదివి పదో తరగతి అర్హత కలిగిన కేడర్‌లో పనిచేస్తున్నాం

ఏపీ సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్ల అసోసియేషన్‌

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌)/మంగళగిరి టౌన్‌: పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా నియమితులైన తమపై నాలుగు శాఖలు పెత్తనం చేస్తున్నాయని, ఆ శాఖల పనులు ఏకకాలంలో చేయాల్సి రావడంతో పనిభారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు వాపోయారు. సోమవారం విజయవాడ అలంకార్‌ సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రామ సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు పెద్ద సంఖ్యలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు తరలివచ్చారు. ప్రమోషన్‌ చానల్‌ కల్పించాలని, పనిభారం తగ్గించాలని నినాదాలు చేశారు.

ధర్నాలో పాల్గొన్న అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శంకరరావు మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థలోని మిగిలిన ఉద్యోగులందరూ ఒక శాఖకు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు నాలుగు శాఖల పరిధి­లో పనిచేయాల్సి వస్తోందన్నారు. డిప్లొమా, బీటెక్‌ విద్యార్హతతో ఉద్యోగం సాధించిన తమను పదో తరగతి విద్యార్హత కన్నా తక్కువ కేడర్‌లో పనిచేయించడం దారుణమన్నారు. కేటగిరి సవరణ చేసి తమను కేటగిరి–5లో చేర్చాలన్నారు.

తాము ఏయే శాఖల పరిధిలో పనిచేస్తున్నామో ఆయా శాఖల్లో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లను విలీనం చేసి ప్రమోషన్‌ ఛానల్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కొన్ని శాఖలు మౌఖిక ఆదేశాలతో పనులు చేయిస్తూ ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే తమను బాధ్యులను చేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ప్రమోషన్‌ చానల్‌ ఏర్పాటు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అసోసియేషన్‌ ఆఫ్‌ సెక్రటేరియట్‌ ఇంజనీర్స్‌ రాష్ట్ర అధ్యక్షులు బి.యువషణ్ముఖ, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ కె విష్ణువర్థన తదితరులు పాల్గొన్నారు. 

ఉద్యోగ భారాన్ని తగ్గించండి 
రాష్ట్రంలోని గ్రామ సచివాయాల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లకు ప్రమోషన్‌ చానల్‌ కల్పించాలని, ఉద్యోగ భారాన్ని తగ్గించాలంటూ ఆం«ధ్రప్రదేశ్‌ గ్రామ సచివాలయాల ఇంజినీరింగ్‌ అసిస్టెంట్ల అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం జోన్‌–3, 4 జిల్లాల ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు మాట్లాడుతూ రాష్ట్రంలో తొమ్మిదివేల మంది ఉన్నా  ప్రమోషన్‌ చానల్‌ లేకుండా పోయిందని వాపోయారు.

విద్యార్హతకు తగ్గట్లుగా గ్రేడ్‌–3 కేడర్‌గా గుర్తించి సంబంధిత పే స్కేల్‌ వర్తింపజేసేలా అమండ్‌ మెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళన చేపట్టి తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జోన్‌ 3,4 జిల్లాల అసోసియేషన్‌ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, ఉమెన్‌ సెక్రటరీలతో పాటు 700 మందికి పైగా ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

అర్హతకు తగ్గ పదోన్నతి ఇవ్వండి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మా అర్హతకు తగ్గట్టు ఉద్యోగాలు పొందాం. కానీ నేడు మా ఉద్యోగానికి ప్రమోషన్‌ చానల్‌ లేదని అధికారులు చెబుతున్నారు. తొమ్మిదివేల మంది ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు ప్రమోషన్‌ చానల్‌ కల్పించి వారి కడుపు కోత తీర్చాలి. – శ్రీతేజ, బాపట్ల జిల్లా అసోసియేషన్‌ ఉమెన్‌ సెక్రటరీ 

ఆరేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాం
సచివాలయ పరిధిలో 17 రకాల ఉద్యోగులు ఉన్నారు. వారికి ప్రమోషన్‌ చానల్‌ మీద ఒక స్పష్టత ఉంది. ఒక్క ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లకే ప్రమోషన్‌ చానల్‌ లేకుండా పోయింది. మా విద్యార్హతకు తగ్గట్టుగా ప్రమోషన్లు ఇవ్వాలి. – కె.విజయ భాస్కర్, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు 

ఒత్తిడికి గురవుతున్నాం
పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంటే కాక హౌసింగ్‌ ,ఆర్‌ అండ్‌ బీ, ఇరిగేషన్, రూరల్‌ వాటర్‌ సప్లయ్‌ శాఖల్లో కూడా మాచేత పనిచేయించుకుంటున్నారు. దీంతో మానసిక ఒత్తిడికి గురి అవుతున్నాం. – బండారు జయలలిత, అనంతపురం జిల్లా అసోసియేషన్‌ ఉమెన్‌ సెక్రటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement