ఎమ్మెల్సీ ఓటర్‌గా నమోదుకు మరో అవకాశం | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఓటర్‌గా నమోదుకు మరో అవకాశం

Published Mon, Nov 28 2022 11:30 PM

Andhra Pradesh: Teacher MLC Voter Registration Deadline Is 9th December - Sakshi

బద్వేలు/కడప కోటిరెడ్డి సర్కిల్‌: వచ్చే ఏడాది జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈ నెల 23న విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పశ్చిమ రాయలసీమ (కర్నూలు, అనంతపురం, వైఎస్సార్‌ ఉమ్మడి జిల్లాలు)కు సంబంధించి గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో ఓటర్‌ నమోదుకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం జాబితాను ఎన్నికల సంఘం రద్దు చేస్తుంది. దీంతో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి.  

►పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరుగా అర్హులై ఉండి గతంలో దరఖాస్తు చేసుకోని వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన షెడ్యూల్‌ మేరకు అర్హులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారితో ఈ నెల 23న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించారు.

జాబితాను పరిశీలించి ఓటర్‌గా నమోదు కాకుంటే మరో పర్యాయం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అదే రోజు నుంచి డిసెంబర్‌ 9వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలతో పాటు కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తులను ఆర్డీఓ, తహశీల్దార్‌ కార్యాలయాల్లో కానీ, కలెక్టరేట్‌లో ఉన్న సహాయ ఎన్నికల అధికారికి అందజేయాలి. దీనిపై సందేహాలకు 1950 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి తీర్చుకోవచ్చు. 

నమోదు కోసం... 
గ్రాడ్యుయేట్‌: వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. 2019 అక్టోబర్‌ 31 నాటికి గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసి ఉండాలి. ఏదైనా డిగ్రీ, ఎంబీబీఎస్, బీటెక్, బీఈ వంటి డిగ్రీలు చదివిన వారు అర్హులే. ఇంటర్‌ తదుపరి మూడు సంవత్సరాల డిప్లొమో చదివిన వారు గ్రాడ్యుయేట్‌ ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైñన్‌లో ఫారం–18 ఎన్నికల కమిషన్‌ సూచనల ప్రకారం చేసుకోవచ్చు ఫొటో, ప్రొవిజనల్‌ సర్టిఫికెట్, ఓటర్‌కార్డు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో ఫారం–18 పూర్తి చేసి, ఫొటో అతికించిన దరఖాస్తుతో డిగ్రీ ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌(గెజిటెడ్‌ అటేస్టేషన్‌ చేయాలి), ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు జెరాక్స్‌ కాపీలను అందజేయాలి.  

ఉపాధ్యాయులు: ఫారం–19 పూర్తి చేసి ఇవ్వాలి. దరఖాస్తుతో పాటు సర్వీస్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా అందజేయాలి. నవంబర్‌ 2016 నుంచి అక్టోబర్‌ 2022 లోపు ఆరేళ్లలో కనీసం మూడేళ్లు సర్వీస్‌ పూర్తి చేయాలి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు పాఠశాల హెచ్‌ఎం, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఎంఈఓ, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేసే అధ్యాపకులకు ప్రిన్సిపల్‌ సర్వీస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలి.

ప్రయివేట్‌ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి ధ్రువీకరించాలి. ప్రయివేట్‌జూనియర్‌ కళాశాలలో పని చేస్తున్న వారికి ఇంటర్‌ బోర్డుకు సంబంధించి ఆర్‌ఐఓ, ఆర్జేడీ ధ్రువీకరించాలి. ప్రయివేట్‌ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు ఉన్నత విద్యాశాఖకు చెందిన ఆర్జేడీ ధ్రువీకరించాలి.  

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి 
శ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటుహక్కుకు సంబంధించి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు ఈనెల 23 నుంచి డిసెంబరు 9వ తేదీలోగా తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 
– శివరామిరెడ్డి, తహసీల్దార్, కడప   

Advertisement
Advertisement