యువతిపై దాడి కేసు.. ప్రేమోన్మాది గణేష్‌ అరెస్ట్‌ | Andhra Pradesh Pileru Incident Accused Arrested, More Details About This Case Inside | Sakshi
Sakshi News home page

యువతిపై దాడి కేసు.. ప్రేమోన్మాది గణేష్‌ అరెస్ట్‌

Feb 15 2025 2:50 PM | Updated on Feb 15 2025 4:47 PM

Andhra Pradesh Pileru Incident Accused Arrested

సాక్షి,అన్నమయ్య జిల్లా: పీలేరులో యువతిపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డ ప్రేమోన్మాది గణేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మదనపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ విద్యా సాగర్ నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ‘ఇంటర్,డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి గణేష్ ,గౌతమి ఒకే కాలేజీలో చదువుకున్నారు. గౌతమిని ప్రేమ పేరుతో వేధిస్తుండేవాడు. చదువు పూర్తి అయ్యాక గౌతమి బ్యూటీషియన్‌గా మదనపల్లి బ్యూటీ పార్లర్‌లో పనిచేసేది. అప్పుడు కూడా గణేష్ ఆమె వెంటపడేవాడు.

ఈ విషయాన్ని గౌతమి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు వారి సమీప బంధువు శ్రీకాంత్‌తో  వివాహం నిశ్చయించారు. ఏప్రిల్ 29వ తేదీ పెళ్లి జరిపేందుకు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న గణేష్ శుక్రవారం ఉదయం గౌతమి నివాసం ఉంటున్న ప్యారంపల్లిలోని ఆమె ఇంటి వద్దకు వెళ్లి తననే పెళ్లి చేసుకోవాలని గొడవపడ్డాడు. గౌతమి అంగీకరించకపోవడంతో కోపంతో  గణేష్ ఆమెను కత్తితో పలుచోట్ల పొడిచాడు, అంతేకాకుండా వెంట తెచ్చుకున్న యాసిడ్‌ ఆమె నోటిలో పోశాడు.

తీవ్రంగా గాయపడిన గౌతమిని కుటుంబీకులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారు. ఈ కేసులో నిందితుడైన గణేష్‌ను శుక్రవారం సాయంత్రమే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. బాలికలు యువతులు మహిళలను  ఎవరైనా వేధిస్తే సహించేది లేదు. వేధింపులు ఎక్కువైతే పోలీసుల దృష్టికి తీసుకురావాలి’అని ఎస్పీ కోరారు.

 

Advertisement
 
Advertisement
Advertisement