సాక్షి, అమరావతి: శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ఉదయం 9 గంటలకు, శాసన మండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికి వాయిదా పడిన తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ (బీఏసీ) సమావేశం జరుగుతంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలనే అంశాలను ఖరారు చేస్తారు. అయితే, సమావేశాలను నాలుగు రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అది బీఏసీ సమావేశంలో ఖరారవనుంది.
డీఎస్సీ కుంభకోణంపై వైఎస్సార్సీపీ, జెన్–జెడ్ ఆందోళనల నేపథ్యంలో సోమవారం తొలిరోజే ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి లోకేశ్ వివరణ ఇవ్వనున్నారు. ఈ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని బలమైన డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో అసలు దానిపై చర్చ జరగకుండా ముందే ఆయనతో వివరణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
‘మండలి’ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక?
ఈ సమావేశాల్లోనే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిసింది. డిప్యూటీ చైర్మన్గా ఉన్న జకియా ఖానూమ్ పదవీకాలం ముగియడంతో ఆ పదవికి ఎన్నిక నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.


